బాధ్యత గల పదవిలో ఉన్న వ్యక్తులు ప్రతి మాటను ఆచితూచి మాట్లాడాలి. అధికారం అనేది అహంకారం కింద మారకూడదు. అధికారంలో ఉన్నాం కదాని.. ఎడాపెడా చెలరేగి మాట్లాడకూడదు. అన్నింటినీ మించి, సమాజంలో ఉండే సామరస్య వాతావరణాన్ని దెబ్బతీసేలా.. ఆవేశపూరిత, రెచ్చగొట్టే తరహా మాటలు మాట్లాడడం అనేది పెద్దపదవుల్లో ఉన్న వారికి అస్సలు సరికాదు. కానీ.. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాధ్ అలాంటి ఆవేశపూరితమైన మాటలే మాట్లాడుతున్నారు. పైగా ఆయన మాటలతో మోడీ సర్కారుకు కూడా చేటు తప్పదులాగా ఉంది.
కేంద్రప్రభుత్వం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టంపై దేశం నలుమూలలా ఇంకా అనేకచోట్ల రాద్ధాంతం జరుగుతూ ఉన్న సంగతి తెలిసిందే. ప్రతిరోజూ దేశంలో ఎక్కడో ఒకచోట నిరసనలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. దేశంలో చెదురుమదురుగా అల్లర్లు కూడా జరుగుతూనే ఉన్నాయి. డిసెంబరులో ఉత్తరప్రదేశ్ లో జరిగిన సీఏఏ వ్యతిరేక ప్రదర్శనల్లో పోలీసుకాల్పులు జరిగాయి. ఈ సందర్భంగా కాల్పుల్లో దాదాపు పాతికమంది దాకా మరణించారు.
అయితే మరణించిన వారిలో ఒక్కరు కూడా పోలీసుల కాల్పుల్లో మరణించలేదని, ప్రదర్శనకారుల్లోనే కొందరు కాల్చడం వల్ల మరణించారని ఇప్పుడు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ అంటున్నారు. ఇదేదో ఆయన పాసింగ్ కామెంట్స్ లాగా చెప్పిన మాటలు కాదు. అసెంబ్లీలో ప్రతిపక్షాలకు ఇచ్చిన జవాబు. వారందరూ కేవలం ఆందోళనకారుల తుపాకీ గుళ్లకే బలయ్యారని, పోలీసు గుండుకు చచ్చిపోయిన వాడు ఒక్కడు కూడా లేడని ఆయన అంటున్నారు.
ఈ మాట ఒక్కటే కాదు. ‘‘మరణించడానికి సిద్ధపడి వచ్చిన వాడు.. సజీవంగా ఎలా మిగులుతాడు’’ (అగర్ కోయీ మర్నే కే లియే ఆ హీ రహా హై, వో జిందా కైసే బచేగా) అని యోగి ఆదిత్యనాధ్ అసెంబ్లీలో వ్యాఖ్యానించడం ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. సీఏఏకు వ్యతిరేకంగా ప్రదర్శనలు చేసేవారంతా.. మరణించడానికి సిద్ధపడి వచ్చిన వారే అన్నట్లుగా.. వారు ప్రాణాలతో మిగలబోరని హెచ్చరిస్తున్నట్లుగా ఈ వ్యాఖ్యలు ఉన్నాయి.
అసలే ఈ చట్టం ద్వారా.. మోడీ సర్కారు ముస్లింల్లో లేని భయాన్ని సృష్టించింది. దానికి తోడు యోగి ఆదిత్య లాంటి వాళ్లు.. ఇలాంటి దుడుకు, రెచ్చగొట్టే తరహా మాటలతో రెండు మతాల మధ్య ఉండే సున్నితమైన పరిస్థితిని
మరింత దారుణంగా మారుస్తున్నారు. మాటల్లోని ఈ తెంపరితనం యోగి ఆదిత్యదే అయినప్పటికీ.. ఆ మాటల నెగటివ్ ప్రభావం మోడీ సర్కారు మీద కూడా తప్పక ఉంటుందనే అనుకోవాలి.
ఉత్తరప్రదేశ్ ఆందోళనల్లో పాతికమందికి పైగా కాల్పుల్లో మరణించారు. 288 మంది పోలీసులు కూడా గాయపడ్డారు. యూపీ రాష్ట్ర వ్యాప్తంగా 1113 మందిని అరెస్టు చేశారు. 327 ఎఫ్ఐఆర్ లను నమోదు చేశారు. 5558 మందిని ముందస్తు అరెస్టులు చేశారు. ఇంకా అల్లర్లలో జరిగిన ఆస్తినష్టానికి పరిహారం చెల్లించాల్సిందిగా రాష్ట్రవ్యాప్తంగా కొన్ని వేల మందికి నోటీసులు జారీచేశారు. ఆ రకంగా అనేక రకాల ఉద్రిక్తతలకు ఈ సీఏఏ వ్యవహారం దారితీస్తోంది.
కాగా.. తాజాగా యోగి ఆదిత్యనాధ్ ‘చావడానికి సిద్ధపడి వచ్చిన వాళ్లు.. ఎలా బతికి బట్టకడతారు’ అంటూ వ్యాఖ్యానించడం మరింత అగ్గి రాజేసేలా కనిపిస్తోంది.
.
Discussion about this post