పెద్దలు ఈ మాటను ఊరికే అనలేదు. ‘శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు’ అనే చిన్న మాటలద్వారా, మానవజాతి జీవించిఉన్నంతకాలమూ నిత్యసత్యంగా వర్ధిల్లగల ఒక గొప్ప సత్యాన్ని వారు ప్రతిపాదించారు. పాపం.. ఈ మాటలు మన పెద్దలు పాజిటివ్ గానే అని ఉంటారు గానీ.. వాస్తవంలో ‘శతకోటి ఉపాయాలకు, అనంతకోటి అపాయాలు’ కూడా తయారవుతున్న రోజులు ఇవి.
కంప్యూటరు, మొబైలు భద్రత కోసం ఓ వంద రకాల యాంటీవైరస్ యాప్ లను, సాఫ్ట్ వేర్ లను కనుక్కుంటే.. వందన్నొక్క మాల్వేర్ లు కూడా తయారవుతున్న రోజులివి. అలాంటిది రాజకీయ రంగంలో మాత్రం వక్రమార్గాలు, కుటిలకుట్రలు కొత్త పుంతలు తొక్కకుండా ఎందుకుంటాయి? అదే ఇప్పుడు లోక్ సభలో జరుగుతోంది. 28మంది ఎంపీలున్న తృణమూల్ కాంగ్రెస్ నుంచి చీలికవర్గంగా తయారైన 20 మంది.. తమ వర్గాన్ని నేషనలిస్ట్ సిటిజన్ పార్టీ ఆఫ్ ఇండియాలో విలీనం చేయాల్సిందిగా స్పీకరుకు లేఖ ఇవ్వడం ఇప్పుడు దేశంలో కొత్త చర్చలకు దారితీస్తోంది.
తాము రాజకీయాల్లో నైతిక విలువలు పాటించే పార్టీ అని భారతీయ జనతా పార్టీ చెప్పుకుంటూ ఉంటుంది. తమాషా ఏంటంటే.. వారు పాటించే విలువలను ‘నైతిక విలువలు’ అనడం కంటె ‘చట్టపరమైన విలువలు’ అనడనం సబబు! ఒక పార్టీ తరఫున ఎన్నికల్లో గెలిచి, ఆ తర్వాత మరో పార్టీలోకి మారిపోయే వారిపై వేటుబేయడానికి ఫిరాయింపుల నిరోధక చట్టం బలంగానే పనిచేస్తుంది. చట్టం పనిచేస్తుంది గానీ.. అందులో లొసుగుల్ని వాడుకుంటూ.. ఆ చట్టాన్నే దుర్వినియోగం చేసుకుంటూ యథేచ్ఛగా పాలకపక్షాలు ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తుంటాయి. తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబునాయుడు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు, రేవంత్ రెడ్డి అందుకు ఉదాహరణలు. ప్రత్యర్థి పార్టీలనుంచి ఎమ్మెల్యేలను చేర్చుకోవడం మాత్రమే కాకుండా.. ఫిరాయింపు ఫిర్యాదుల్ని తుంగలోతొక్కిన, మంత్రి పదవులను కూడా కట్టబెట్టిన చరిత్ర వీరికి ఉంది. కానీ బిజెపి ఇలాంటి పని చేయదు. ఎక్కువగా వారు ఎంచుకునే విధానం.. ప్రజాప్రతినిధితో రాజీనామాచేయించి.. ఆతర్వాత తమ పార్టీలో చేర్చుకుని.. ఉపఎన్నికలో గెలిపించుకోవడం. ఇవాళ్టి రాజకీయాలకు అలాంటి దుర్మార్గమే అతిపెద్ద రాజకీయ నైతిక విలువ కింద లెక్క. అదే తరహాలో ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ ను లోక్ సభలో చీల్చిన విషయంలో ఇంకో కొత్త పంథాను బిజెపి కనుగొంది. మెజారిటీ ప్రతినిధులు చీలిపోయి సొంత కుంపటి పెట్టుకున్నా, చీలికవర్గంగా గుర్తింంపు కోరుకున్నా.. లీగల్ కేసులు లాంటి చికాకులు ఎదురయ్యే అవకాశం ఉంది. అలాకాకుండా.. చీలికవర్గం వేరే పార్టీలో విలీనం అయితే ఇక ఏ ఇబ్బందీ ఉండదు. ఫిరాయింపుల నిరోధక చట్టం వారికి వర్తించదు. ఈ కొత్త కుట్రను ఇక్కడ అమల్లో పెట్టారు.
ఇందులో కూడా బిజెపి ఒక వినూత్నమైన పోకడకు శ్రీకారం చుట్టింది. చీలిన తృణమూల్ ఎంపీలను నేరుగా తమ పార్టీలోనే విలీనం చేసుకోవచ్చు. అయితే.. మొన్నటిదాకా బెంగాల్ ఎన్నికల్లో తృణమూల్ నాయకులందరూ అవినీతి పరులని నానా తిట్లూ తిట్టి.. వారాల వ్యవధిలో తమలో కలిపేసుకుంటే తమ పరువే పోతుందని వారికి తెలుసు. అందుకే జాగ్రత్త పడ్డారు. ఆ ఎంపీలంతా వెళ్లి నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా అనే కోల్ కతా కేంద్రంగా రిజిస్టరు అయినా ఊరూపేరూ లేని అనామక పార్టీలో విలీనం అవుతున్నారు. ఆ పార్టీ ఎన్డీయేకు మద్దతిస్తుంది. రెండు మూడేళ్లు గడిచిన తర్వాత ఆ పార్టీ పూర్తిగా బిజెపిలోనే విలీనం అవుతుంది.
ప్రజాస్వామ్యంలో కుటిల రాజకీయాలను పరిహరించడానికి ఫిరాయింపుల నిరోధక చట్టం వంటివి వచ్చాయి. దానికి విరుగుడుగా ఇలాంటి అనంతకోటి ఉపాయాలు తయారవుతున్నాయి. ఈ కొత్త కుట్ర బాగా పాపులర్ అయితే.. జాతీయ స్థాయిలో ఆర్థికంగా బాగా బలమైన పార్టీలు.. చిన్న రాష్ట్రాలలో చిన్న చిన్న పార్టీలను కబళించేసి.. ఆయా ప్రాంతాల్లో అధికారం హస్తగతం చేసుకోవడానికి రాజమార్గం ఏర్పడుతుంది.

.
Discussion about this post