తప్పొప్పులకు నిర్దిష్టమైన రూపం ఉంటుందా? ఒక సందర్భంలో తప్పు అనిపించినదే, మరో దృష్టికోణం నుంచి చూసినప్పుడు సబబుగా మనకు కనిపిస్తుంది. కొన్ని విషయాల్లో తప్పులను తొందరపడి నిర్ధారించేసి శిక్షలు కూడా వేసేస్తే.. దాని పర్యవసానాలు ఎక్కువమందికి నష్టదాయకంగా మారుతుండవచ్చు. ఇలాంటిదే ఒక సంఘటన కాకినాడలో వెలుగులోకి వచ్చింది. బస్సులో కెపాసిటీకి మించి ఎక్కువ మంది ప్రయాణికులను ఎక్కించారంటూ.. ఒక ప్రయాణికుడు వినియోగదారుల ఫోరంను ఆశ్రయిస్తే.. ఫోరం ఆర్టీసీకి ఏకంగా పదిహేను వేల రూపాయల జరిమానా విధించింది. అయితే ఇలాంటి తీర్పుల పర్యవసానం ఎలా ఉంటుంది.. అనేదే ఇప్పుడు చర్చ.
కాకినాడనుంచి వాడపల్లి వెళ్లడానికి అఖిల్ అనే వ్యక్తి ఆర్టీసీ బస్సు ఎక్కి 85 రూపాయల టికెట్ కొన్నాడు. బస్సు సీటింగ్ కెపాసిటీ 41 మంది. అయితే ఆ బస్సులో 96 మందిని ఎక్కించడం జరిగింది. దీంతో ప్రయాణంలో అసహనానికి గురై అఖిల్ మధ్యలోనే దిగేసి ఆటోలో తిరిగి కాకినాడ వెళ్లిపోయాడు. తర్వాత వినియోగదారుల ఫోరంను ఆశ్రయించాడు. మోటార్ వెహికిల్స్ చట్టాన్ని అతిక్రమించినట్టుగా ఫిర్యాదు చేశాడు. దీనిని సేవాలోపంగానే పరిగణించిన ఫోరం.. పదివేల రూపాయల జరిమానా చెల్లించాలని ఆర్టీసీని ఆదేశిస్తూ, లీగల్ ఖర్చులకు మరో అయిదు వేలు కూడా చెల్లించాలని ఆదేశించింది.
పేద ప్రజలకు రవాణా సదుపాయం కల్పించడంలో ఆర్టీసీ సేవలు విస్మరించలేనివి. ఇలాంటి జరిమానాలు పడితే ఏమవుతుంది? ఆర్టీసీ బస్సుల్లో సీటింగ్ కెపాసిటీకి తగ్గట్టు మాత్రమే ప్రయాణికుల్ని ఎక్కించుకుని, తర్వాత ఎక్కడా బస్సు ఆపకుండా వెళ్లిపోతే.. సామాన్యులకు ఎంత ఇబ్బంది కలుగుతుంది..? ఇలాంటి అంశాలన్నీ పరిగణనలోకి తీసుకోవాలి కదా.. అనే మాట ప్రజల్లో వినవస్తోంది.
అఖిల్ అనే సదరు వ్యక్తికి కష్టం కలిగిన మాట నిజమే. ఫోరం అతనికి న్యాయం చేయదలచుకుంటే.. టికెట్ డబ్బులు తిరిగి ఇవ్వమన్నట్టుగానే.. ఆటో కూడా ఖర్చయింది గనుక.. పరిమితమైన పెనాల్టీతో సరిపెట్టి ఉండాల్సింది. అసలు ఆర్టీసీ బస్సుల్లో సీటింగ్ కెపాసిటీని బట్టి మాత్రమే ప్రజలను ఎక్కించుకుంటే సమాజంలో ప్రజారవాణా వ్యవస్థ మొత్తం అతలాకుతలం అవుతుంది. అప్పుడు షేర్ ఆటోల్లాంటివి చెలరేగుతాయి. వాళ్లలో ఎవ్వరూ కూడా కెపాసిటీని బట్టి ఎక్కించుకోరు. వారి మీద ఫోరంకు వెళ్లే వారు కూడా ఉండరు. కానీ.. ప్రమాదాల అవకాశాలు మాత్రం బాగా పెరుగుతాయి. ఆర్టీసీ సంస్థ ‘బస్సు ప్రయాణం భద్రమైన ప్రయాణం’ అనే నినాదంతోనే పనిచేస్తుంటుంది. ప్రజలకు అలాంటి భద్రతనిచ్చే రవాణా వ్యవస్థ ఇలాంటి తీర్పుల వల్ల అతి జాగ్రత్తలు పాటిస్తే నష్టం ప్రజలకే కదా.
పైగా ప్రభుత్వాలు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలు తీసుకువచ్చిన తర్వాత.. ఆర్టీసీ బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగింది. పని ఉన్నా లేకపోయినా ప్రయాణించే మహిళలు లేరని అనలేం. అయితే.. చిరుద్యోగాలు, చిన్న చిన్న కూలిపనులకు సైతం ఇతర ప్రాంతాలకు వెళ్లే మహిళల సంఖ్య ఇప్పుడు గణనీయంగా పెరిగింది. ఉచిత రవాణా సదుపాయం వారికి ఎంతో మేలు చేస్తోంది. ఇలాంటి పథకాల సైడ్ ఎఫెక్ట్ గా కీలక సమయాల్లో బస్సుల్లో రద్దీ అనూహ్యంగా పెరుగుతోంది కూడా. ఈ అంశాలన్నింటినీ కూడా పరిగణనలోకి తీసుకోవాలి.
ఆ మాటకొస్తే.. ఆర్టీసీ బస్సులలో నిల్చుని ప్రయాణించే వారినే అనుమతించకుండా ఉండాలి. అలాంటి ఏర్పాట్లే లేకుండా బస్సును నడపడం సాధ్యమవుతుంది. రైళ్లలో జనరల్ బోగీల్లో సీటింగ్ కెపాసిటీని బట్టి మాత్రమే మనుషుల్ని ఎక్కించాలనే నిబంధన పెడితే.. 130 కోట్ల మంది జనాభా ఉన్న ఈ దేశంలో పరిణామాలు ఎలా ఉంటాయి?
కేసు చిన్నదే అయినా.. బాధ్యత గల వ్యవస్థలు తీర్పులు చెప్పే ముందు ఇలాంటి అన్ని రకాల పర్యవసానాలను కూడా గమనంలో ఉంచుకుంటే మంచిదనే అభిప్రాయం ప్రజల నుంచి వ్యక్తమవుతోంది. వినియోగదారుల ఫోరం లు ఇచ్చే తీర్పులు.. సేవాలోపాలను సరిదిద్దాలి అంతే తప్ప.. సమూలంగా సేవలను ఉపసంహరించుకునే వాతావరణానికి కారణం కాకూడదు!
.