హరి ఓం!
మహాభారతంలో శ్రీకృష్ణ భగవానుడు, పాండవుల మొదటి సమాగమం పాంచాల రాజ్యం కాంపిల్య నగరంలో ద్రౌపది స్వయంవరంలోనే కనబడుతుంది. వ్యాసుడు పాండవుల వైపు నుంచి కథ చెప్పడం వలన మనకు ఆ సన్నివేశంలోనే దర్శనిమిస్తారు స్వామి. ఆర్తితో ఎల్లకాలం ప్రేమించే, ప్రార్ధించే పాండవులను అడుగడుగునా కాపాడుతూ వచ్చాడు స్వామి. ద్రౌపది స్వయంవరం నుండి హస్తినాపురం వచ్చిన పాండవులకు ఎందుకూ పనికిరాని భూమి ఖాండవ ప్రస్థం పాండవులను పాలించుకోమని ధృతరాష్ట్రుడు ఇస్తాడు. అప్పుడు భగవానుడే కొండంత అండ. దేవ శిల్పి విశ్వకర్మ చేత మహాద్భుతమైన ఇంద్రప్రస్థ నగరాన్ని పాండవులకు నిర్మింపచేసి ఇస్తాడు.

చాగంటి ప్రసాద్
డైరెక్టర్ లిపి ఎపిక్స్ ప్రైవేటు లిమిటెడ్ , హైదరాబాద్, 9000206163
తనకి ఆప్తుడు అయిన అర్జునుణ్ణి ఖాండవ వనవిహారం అనే సాకుతో వెంట తీసుకువెళ్ళి దహన సమయంలో అగ్నిదేవుడు, ఇంద్రాది దేవతల అనుగ్రహంతో మహిమాన్వితమైన అస్త్రాలు లభించేలా చేస్తాడు స్వామి. దానికి కారణం ఆయనికి తెలుసు. రాబోయే మహా యుద్దంలో అర్జునుడిని శక్తివంతుడిని చెయ్యాలి. భీష్మ, ద్రోణ, కర్ణాదులను జయించాలంటే అర్జునుడు బలోపేతం అవ్వాలి.
అలాగే, రాజసూయ యాగం చేయించి పాండవులు మహాబలవంతులు అనే హెచ్చరిక పంపించేలా చేస్తాడు. ఆ యాగానికి ముందు పాండవ సోదరుల జైత్ర యాత్ర వలన ఇంద్రప్రస్థానికి రాజులిచ్చిన కానుకలు, ధనంతో కోశాగారం నిండింది. అపరిమితమైన సంపదలు కలిగాయి. సైన్యం సమకూరింది. వీళ్ళ శక్తీ తెలిసిన చక్రవర్తులు రాబోయే యుద్ధానికి ఏడు అక్షోహిణుల సైన్యం వచ్చి చేరడానికి దోహదపడింది. ఇదంతా గోపాలుడి ఉపాయం.
అలాగే దగ్గరుండి భీముడితో జరాసంధుడిని వధింపచేయిస్తాడు. రాజసూయ యాగంలో పాండవులు అగ్రపూజ స్వామికి చేసిన ఘట్టంలో శిశుపాల వధ జరగాలి, లేకపోతే దుర్యోధనుడి కన్నా బలవంతుడైన జరాసంధుడికి శిశుపాలుడు కలిస్తే ధూర్తులైన కౌరవులు మరింత బలపడతారు. అదీగాక, మల్లయుద్ధంలో జరాసంధుణ్ణి భీముని చేత సంహరింప చేయిస్తే తూర్పు దేశాలలో ఎవ్వరూ పాండవులకి అడ్డు ఉండరు అని శ్రీకృష్ణుని ఆలోచన. ముందు చూపు గల స్వామి ప్రణాళిక ఇది.
ద్రౌపది ఆర్తితో `ఆర్తత్రాయపరాయణా కాపాడు` అని ప్రార్థన చేస్తే, ఆమె మానం కాపాడి, తనను మనసా వాచా నమ్ముకున్న వారిని ఎల్లవేళల రక్షిస్తాను అని చెప్పకనే చెప్పాడు స్వామి.
అరణ్యవాసం చేస్తున్న పాండవులకు దుర్వాసుడి నుంచి వచ్చిన అనుకోని ఆపదను తొలగించుకోవడానికి గిన్నెలో అడుగంటిన మెతుకు తిని, దుర్వాసుడి ఉదరం నిండేలా చేసి ఆయన శాపం తగలకుండా పాండవులను కాపాడిన దామోదరుడు మన స్వామి.
స్వామివారు పాండవులను ఎంతగా ప్రేమించాడో, పాండవులు కూడా అంతకన్నా ఎక్కువగా ఆయనను గురువుగా, హితుడు, స్నేహితుడు, ఆత్మబంధువు, బహిప్రాణంగా ప్రేమించారు. వేల సంఖ్యలో ఉన్న నారాయణ గోపాలుర సైన్యాన్ని కాదని, ఆయుధం పట్టను, యుద్ధం చెయ్యనూ అని చెప్పిన కృష్ణుడే తమ పక్షాన ఉండాలని రథ సారధిగా ఉండమని ప్రార్థించి తన యుద్ధాన్ని సాగించాడు, విజయం సాధించాడు, భగవద్గీత ఉపదేశం పొంది తన జీవనగీతను మార్చుకున్నాడు అర్జునుడు.
ధర్మాన్ని కాపాడడం, యుద్ధం ఆపడం, అనే రెండు బరువైన బాధ్యతలు తన భుజస్కందాల మీద వేసుకుని, సంధికోసం భగవానుడు పాండవులు ఇచ్చిన సందేశాలు మోసుకుని హస్తినాపుర కురు సభలో అడుగు పెట్టాడు. విదురుడు శ్రీకృష్ణుడిని రాయబారానికి వెళ్ళవద్దని, అవమానాలు పొందవద్దని సలహా ఇచ్చినప్పుడు `శక్తిలోపం లేకుండా ధర్మకార్యానికి మనిషి ప్రయత్నించాలి. ఒకవేళ పూర్తి చేయలేక, ఫలం పొందక పోయినా, పుణ్యాన్ని తప్పక పొందుతాడు అని కృష్ణుడు అంటాడు.
ఆయన అనుక్షణం తన వాళ్ళ కోసం తపన పడ్డాడు. కురు సభలో అవమానాలు భరించాడు. యుద్ధం ఆపాలని ఎంతో ప్రయత్నించాడు. అది విఫలం అయినా ఆగలేదు, మరో ప్రయత్నం చేసాడు. ఎవరిని చూసుకుని యుద్ధానికి దుర్యోధనుడు కాలు దువ్వుతున్నాడో, ఆ కర్ణుడిని కూడా పాండవుల వైపుకి తిప్పుకుని యుద్ధం ఆపాలి అని ప్రయత్నించాడు.
కురుక్షేత్ర యుద్ధంలో అడుగడుగునా వాళ్లకు ప్రాణరక్షకుడు అయ్యాడు, విజయం సిద్ధింప చేసాడు. మామూలు రథ సారధిగా ప్రవర్తిస్తూ, నరుడైన అర్జునుడికి మనోధైర్యాన్ని కలిగించడానికి, గీతాచార్యుడిగా మారి ఆద్యంతం తానే నిండి ఉన్నాన్నని, చేసేవాడిని, చేయించే వాడిని నేనే అని విశ్వరూప దర్శనం కలిగించి ఆర్జునుడిని కర్తవ్యోన్ముఖుడిని చేసిన భగవానుడు, కురుక్షేత్రంలో మహోన్నత విజయాన్ని కూడా అందించాడు. భీష్మాచార్యుడి మేధస్సునుండి రాజధర్మ సూక్ష్మాలు, ముక్తినొసగే విష్ణు సహస్రనామాలు ధర్మరాజు ద్వారా మానవాళికి అందజేసేలా చేసాడు.
గాంధారి కోపగ్ని జ్వాలలు పాండవులను దహించకుండా అడ్డుపడి ఆమె కోపాగ్నినుండి పుట్టిన శాపాన్ని నవ్వుతూ స్వీకరించాడు పరంధాముడు. అశ్వత్థామ విద్వేషాగ్నులకు అడ్డుపడి పరీక్షిత్తుకి జీవం పోసి పాండవవంశాన్ని నిలబెట్టాడు.
యతో ధర్మస్తతః కృష్ణో యతో కృష్ణస్తతో జయః” ధర్మం ఎటువైపు ఉంటె అటువైపు శ్రీకృష్ణుడు ఉంటాడు. అక్కడే విజయం ఉంటుంది, అందుకే పాండవుల ధర్మనిరతికి ఆయన వాళ్ళ పక్కనే ఉన్నాడు. వాళ్ళు కూడా భగవంతుడిని చూసారు, కొలిచారు. ప్రేమించారు. ఆర్తితో ఆరాధించారు. నారాయణుడి స్వరూపాన్ని తెలుసుకున్నారు, అందుకే విజయం సాధించారు. మనం కూడా గీతలో చెప్పినట్టుగా
పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్ఛతి |
తదహం భక్త్యుపహృతమ్ అశ్నామి ప్రయతాత్మనః ||
(ఎవరైతే భక్తితో నాకు ఆకును (పత్రం), పువ్వును (పుష్పం), పండును (ఫలం) లేదా నీటిని (తోయం) సమర్పిస్తారో, పరిశుద్ధమైన మనసుతో భక్తిపూర్వకంగా సమర్పించిన ఆ చిన్న కానుకను నేను ప్రీతితో స్వీకరిస్తాను (అరగిస్తాను)
ఆయన్ని పూజిద్దాం, స్వామిని అక్కున చేర్చుకుందాం, ఆర్తితో ప్రార్థిద్దాం, జీవితాల్ని శ్రీకృష్ణమయం చేసుకుందాం. నందకులంలో గోపాలుడు తర తమ బేధాలు లేకుండా విహరించాడో, అందర్నీ ప్రేమించాడో అలాగే మనమందరం కూడా ఆయన్ని అనుసరిద్దాం
జై శ్రీకృష్ణ, నమో భగవతో వాసుదేవాయా. అందరికి శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు.
.