తెలుగు తెరకు కూడా బాగా పరిచయమైన తమిళనటుడు జెమినీ గణేశన్. మన సావిత్రి భర్తగానే కాదు.. అభినయ ప్రావీణ్యం ఉన్న మంచి నటుడిగా వినుతికెక్కినవాడు. ఆయన జయంతి ఈరోజు. ఆ సందర్భంగా.. ఆదర్శిని డాట్ కామ్ అందిస్తున్న ప్రత్యేక కథనం.
రామసామి గణేశన్ అలియాస్ జెమినీ గణేశన్. ఆ పేరు వినగానే మనకి ముందుగా గుర్తొచ్చేది సావిత్రి. తరువాత తను నటించిన రొమాంటిక్ సినిమాలు! అభిమానులు ఆయనని ‘కాదల్ మన్నన్’ (ప్రేమ రారాజు) అని కూడా అంటారు. మహానటి సినిమాలో కూడా సమంతా అంటుంది, ‘ఎంతైనా జెమినీ ఒక చార్మర్ అండీ’ అని. ఆ అందమైన చార్మర్ 1920 నవంబర్ 17న తమిళ నాడు లోని పుదుకొట్టై లో జన్మించాడు.
1920లో రామసామి అయ్యర్-గంగమ్మల్ దంపతులకు పుట్టిన అందగాడే రామసామి గణేశన్. కానీ, గణేశన్ 6వ తరగతి చదువుతున్నప్పుడు వాళ్ల తాతయ్య నారాయణస్వామి చనిపోయారు. కొద్ది రోజుల తరువాత వాళ్ల నాన్న కూడా చనిపోయారు. దీనితో, గణేశన్ తన అమ్మ, నానమ్మతో పాటు మద్రాసులో ఉన్న అత్తమ్మ ముత్తులక్ష్మితో కలిసి ఉండడం మొదలుపెట్టారు. ఆమె వీళ్ల ముగ్గురినీ ఉండనిచ్చినా కూడా, అమ్మ, నానమ్మల్ని ఇద్దరినీ విపరీతంగా అవమానిస్తూ, అతిథులు ఎవరైనా వస్తే వాళ్లతో ఆ ఇద్దరూ మాట్లాడకుండా చేస్తూ వచ్చింది. ఇది నచ్చక అమ్మ, అవ్వ గణేశన్ని అత్త దగ్గర వదిలేసి పుదుకొట్టైకి తిరిగి వచ్చేశారు.
గణేశన్ అత్త దగ్గర ఉండి మంచి విద్యావంతుడిగా ఎదుగుతాడని వాళ్ల ఆశ. అత్త రామకృష్ణ అనుచరురాలు గనుక, గణేశన్ను రామకృష్ణ మిషన్ హోం కు పంపింది. అక్కడ ఉండగా, గణేశన్ యోగా, సంస్కృతం, ఉపనిషత్తులు, వేదాలు, భగవద్గీత నేర్చుకున్నాడు. కానీ, అమ్మను విడిచి పెట్టి ఉండలేక, తిరిగి పుదుకొట్టైకు వెళ్లిపోయాడు. అక్కడే ఉండే హై స్కూలులో చదువుకుని, మహారాజా కాలేజీలో చేరాడు. కానీ గ్రాడ్యుయేషన్ మాత్రం మద్రాసు క్రిస్టియన్ కాలేజీలో పూర్తి చేశాడు.
గణేశన్కు డాక్టర్ అవ్వాలని ఆశ ఉండేది. 1940 ఏప్రిల్లో మామను చూడడానికి తిరుచిరాపల్లి వెళ్లాడు. అక్కడ తన మామ, కూతురు అలమేలును పెళ్లి చేసుకుంటే గ్రాడ్యుయేషన్ తరువాత డాక్టర్ సీట్ ఇప్పిస్తానని చెప్పాడు. గణేశన్ దీనికి వెంటనే ఒప్పుకుని, అదే సంవత్సరం జూన్లో అలమేలు మెడలో తాళి కట్టేశాడు. పెళ్లైన నెలకే అలమేలు నాన్న, అక్క చనిపోయేసరికీ, గణేశన్ కలలు కూలిపోయాయి. ఇంటికి ఉన్న ఒకటే దిక్కు తను. అందుకని, డాక్టర్ అవ్వాలన్న కలను వదిలేసి, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి ఇంటర్వ్యూ అవకాశం వస్తే అలమేలు వద్దంటున్నా డిల్లీ వెళ్లాడు.
డిల్లీలో తన మామ తనని టీచర్ అవ్వమని సలహా ఇచ్చాడు. దాని తర్వాత మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలో గణేశన్ కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ లెక్చరర్గా పనిచేశాడు. 1947లో, జెమినీ స్టూడియోస్లో ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్గా ఉద్యోగం వస్తే అక్కడ పనిచేయడం మొదలుపెట్టాడు. ఇక్కడ పనిచేస్తున్నప్పుడే తన పేరుకి ‘జెమిని’ అనే పేరు జోడించబడింది. ఈ స్టూడియో నుంచే తను తన తెరంగేట్రం చేశాడు. అది 1947లో మిస్ మాలినీ సినిమాలో ఒక చిన్న పాత్ర పోషించడంతో జరిగింది. కానీ, తమిళ చిత్రపరిశ్రమలో అందగాడుగా ముద్ర ఉన్న ఈ రామస్వామి గణేశన్ ఒక విలన్ గా కెరీర్ ప్రారంభించాడంటే నమ్మశక్యం కాదు. అంటే మన మెగాస్టార్ చిరంజీవిలాగా అన్నమాట. చిరంజీవి కూడా విలన్ గా కెరీర్ మొదలెట్టి మెగాస్టార్ అయ్యాడు కదా. జెమినీ గణేశన్ కూడా తాయి ఉల్లం (1953) అనే తమిళ సినిమాలో విలన్ పాత్ర పోషించాకే అందరూ తనని గుర్తించడం మొదలు పెట్టారు.
మనం పోల్ మాంగల్యం (1954) (మహానటి సినిమాలో సావిత్రి చేసే మొదటి తమిళ సినిమా) సినిమాలో హీరో పాత్ర పోషించాక తను ప్రసిద్ధి పొందడం మొదలు పెట్టాడు. ఆ సినిమా తన సినీ జీవితంలో మైలురాయిగా నిలిచింది. అప్పట్నుంచి, తను తమిళ సినిమాలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు.
దాదాపు 50 ఏళ్ల కెరీర్లో జెమినీ చాలా రకాల పాత్రలు పోషించాడు. తమిళ మాయాబజార్లో అభిమన్యు నుంచి కప్పలొట్టియా తమిళన్లో మాదవసామి దాకా రకరకాల పాత్రలు పోషించాడు. అంతే కాదు, 1959లో వచ్చిన కళతూర్ కన్నమ్మలో కూడా నటించాడు. అదే సినిమాలో ఇప్పుడు దేశమంతా తెలిసిన నటుడు, కమల్ హాసన్ కూడా నటించాడు. నిజానికి అది కమల్ హాసన్ మొదటి సినిమా. ఈ సినిమాకి 1961లో ఒక మెరిట్ సర్టిఫికేట్ కూడా వచ్చింది. 1959లో శివాజీ గణేశన్ తో చేసిన సినిమా, వీరపాండియ కట్టబొమ్మన్ 1960లో ఆఫ్రో-ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్కు ఎంచుకోబడింది. అదే సంవత్సరంలో కళ్యాణ పరిసుతో పాటు ఆ సినిమా నేషనల్ ఫిల్మ్ అవార్డ్ కు కూడా ఎంచుకోబడింది. కానీ, ఈ రెండూ కాకుండా, శివాజీ గణేశన్ సినిమా అయిన భాగ పిరివినైతో ఓడిపోయాయి.
1958లో వచ్చిన వంజికొట్టై వాలిబన్ సినిమాను హై-బడ్జెట్తో తీశారు. ఈ సినిమా పెద్ద కమర్షియల్ సక్సెస్ అయింది. 1960లో వచ్చిన చారిత్రక సినిమా అయిన పార్తిన్ కనవుకు బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ కోసం ప్రెసిడెంట్ సిల్వర్ మెడల్ వచ్చింది. ఇవి కాకుండా, జెమినీ గణేశన్ చాలా సినిమాల్లో నటించాడు. తమిళ్ మిస్సమ్మ, స్కూల్ మాస్టర్, శాంతి నిలయం, పున్నాగై, లాంటివి చాలా. సావిత్రితో కలిసి 1962లో నటించిన సినిమా కొంజుం సాలంగై విదేశాలలో కూడా రకరకాల భాషలలో సబ్టైటిల్స్ తో రిలీస్ అయింది. పోలాండ్లో రిలీస్ అయిన మొదటి తమిళ్ సినిమా అది. ఇవి కాకుండా, ఎం.జీ.ఆర్ తో కలిసి నటించిన సినిమా ఒకటే ఒకటి ఉంది… 1966లో వచ్చిన ముగరాశి. ఎం.జీ.ఆర్ అప్పట్లో తన ప్రత్యర్థి నటుడు.
తమిళ్ సినిమాలు మాత్రమే కాదండోయ్!! జెమినీ కొన్ని హిందీ సినిమాల్లో కూడా వచ్చాడు. మామూలుగా ఇప్పుడు హీరోలు, హీరోయిన్లు, చాలా మంది తెలుగు సినిమాలు వదిలేసి హింది సినిమాల కోసం వెళుతున్నా, వాళ్లకి ఎక్కువ అవకాశాలు రావట్లేదు. కానీ అప్పట్లోనే జెమినీ హిందీ సినిమాల రుచి కూడా చూసేశాడు!! మొదటి హిందీ సినిమాగా తను మిస్ మేరీలో నటించాడు. తర్వాత దేవత, రాజ్ తిలక్, నజ్రానా లాంటి సినిమాల్లో నటించాడు. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే, తను నటించిన చాలా హిందీ సినిమాలు తన తమిళ్ సినిమాల రీమేకులే!!
కొన్ని రోజులు అయ్యాక లీడ్ పాత్రలను వదిలేసి చిన్న చిన్న పాత్రలు చేయడం ప్రారంభించాడు. ఆ పాత్రలలో ఒకటి మాత్రం మనందరికీ ఎప్పుడూ గుర్తుండేదే… రుద్రవీణలో చిరంజీవి తండ్రిగా చేసిన పాత్ర. తర్వాత అవ్వై షన్ముగి, ఉన్నై ముడియుం తంబీ లాంటి సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసి, సీరియల్స్ లో కూడా నటించడం మొదలుపెట్టాడు. వేరే సినిమాలలో, తన చివరి ప్రధాన పాత్ర ను ప్రభు దేవా నటించిన నామ్ ఇరువర్ నమక్కు ఇరువర్ సినిమాలో ప్రభు తాతగా నటించాడు.
సినిమాలు కాకుండా, గణేశన్ ఎప్పుడూ రాజకీయాలనుంచి దూరంగానే ఉన్నాడు. వాటి నుంచి ఎంత దూరంగా ఉన్నాడంటే, రాజీవ్ గాంధీ వచ్చి రాజ్యసభ ఎం.పీ అవ్వడానికి అవకాశం ఇచ్చినా కూడా కాదన్నాడు. జెమినీకు చాలా నైపుణ్యాలు ఉండేవి. టెన్నిస్, గోల్ఫ్, బ్యాడ్మింటన్, క్రికెట్…. తను కాలేజీలో ఉన్నప్పుడు క్రికెట్ టీమ్ కెప్టెన్ గా ఉండేవాడట.
జెమినీ గణేశన్ ఇంత మంచివాడు అయి ఉన్నా కూడా, విమర్శలు అనేవి ప్రతి ఒక్క నటుడికీ వచ్చేవే. తను నటించిన చాలా సినిమాలలో అబ్బాయి అమ్మాయిని ముందు కలుస్తాడు కాబట్టి కేవలం ఒకే రకమైన పాత్రలలో నటించడం గురించి విమర్శలు వచ్చాయి. ఇది మాత్రమే కాకుండా, కూతురు రేఖతో ఉన్న శత్రు సంబంధం గురించి కూడా చాలా విమర్శలు వచ్చాయి. రేఖా తండ్రినని తను చిన్నగా ఉన్నప్పటినుంచి ఎప్పుడూ చెప్పలేదు. ఎప్పుడో ఏళ్ల తరువాత రేఖా బాలీవుడ్ సినిమాల్లో అవకాశాల కోసం వెతుక్కుంటున్నప్పుడు తన తండ్రి జెమినీ గణేశన్ అని తను మిగతా వాళ్లకి తెలియజేసింది. మరికొన్ని ఏళ్ల తర్వాత, తను మంచి నటి అయి ఉన్నప్పుడు తన తండ్రి నిర్లక్ష్యం ఇప్పటికీ ఉందని చెప్పింది. 2005లో తండ్రి చనిపోయినప్పుడు అంత్యక్రియులు కు కూడా రేఖ వెళ్లలేదు. ఒకసారి టీవీ ఇంటర్వ్యూ లో రేఖను తండ్రి గురించి అడిగినప్పుడు, ఆమె ఎలాంటి సమాధానమూ ఇవ్వలేదు.
జెమినీ గణేశన్ వ్యక్తిగత జీవితంకి వచ్చేస్తే, ఆయనకి ఏడుగురు కూతుర్లు, ఒక కొడుకు ఉన్నారు. 19 ఏళ్ల వయసులో అలమేలును పెళ్లి చేసుకుని, నలుగురు కూతుర్లు – రేవతి, కమల, జయలక్ష్మి, నారాయణి లను కన్నాడు. వీళ్లలో మొదటి ముగ్గురూ డాక్టర్లు అయితే, నారాయణి మాత్రం టైమ్స్ ఆఫ్ ఇండియా న్యూస్ పేపర్ లో జర్నలిస్టు. తర్వాత, పుష్పవల్లితో హిందీ నటి అయిన రేఖ, కొన్ని తమిళ్ సినిమాల్లో నటించిన రాధ ను కన్నాడు. సావిత్రితో విజయ చాముండేశ్వరి, ఇంక సతీష్ కుమార్ ను కన్నాడు. తన ఆత్మకథలో ‘నేను బాధలో ఉన్న మహిళలలను ఆకర్షించినట్టు ఉన్నాను.’ అని రాశాడు. ‘కాదల్ మన్నన్’ అనే పేరు కూడా అతనికి నచ్చలేదు. ఎందుకంటే, అది తన వ్యక్తిగత జీవితానికి మంచిది కాదు అని తనకు అనిపించేది.
కిడ్నీ, ఆర్గన్స్ ఫెయిల్యూర్ వల్ల చాలా రోజులు అనారోగ్యంతో ఉన్న తర్వాత, 2005 మార్చి 22వ తేదీ కూతుళ్లు, అలమేలు చుట్టూ ఉండగా కాదల్ మన్నన్ చనిపోయాడు. కరుణానిధి, జయలలిత లాంటి ప్రముఖ వ్యక్తులు చాలా మంది అంత్యక్రియులకు వచ్చి, వారి నివాళులు అర్పించారు.
అప్పట్లో తమిళ్ ఇండస్ట్రీ లో మూడే పెద్ద పేర్లు ఉండేవి. ఎం.జీ.ఆర్, శివాజీ గణేశన్. మరి మూడోది?? అవును..! మూడవ పేరు జెమినీ గణేశన్. శివాజీ గణేశన్ ఎక్కువగా ఎమోషనల్ సినిమాల్లో నటించేవాడు. ఎం.జీ.ఆర్ ని ‘యాక్షన్ హీరో’ అనే వాళ్లు. మన జెమినీ గణేశన్ మాత్రం తన ప్రేమికుడి పాత్రలకు ప్రసిద్ధి పొందాడు. తనకి చాలా అవార్డులు వచ్చాయి. 1971లో పద్మశ్రీ కూడా వచ్చింది. అది కాకుండా, 1970లో తమిళ్ నాడు స్టేట్ ఫిల్మ్ అవార్డ్ లో బెస్ట్ యాక్టర్, ఎం.జీ.ఆర్ అవార్డ్, ఫిల్మ్ ఫేర్ వారి బెస్ట్ తమిళ్ ఆక్టర్ అవార్డ్, ఎం.జీ.ఆర్ గోల్డ్ మెడల్, కలైమామణి అవార్డ్ లాంటివి చాలా వచ్చాయి.
తెలుగుదనపు దృక్కోణంలో చెప్పాలంటే.. తమిళ పరిశ్రమకు దొరికిన అక్కినేని నాగేశ్వరరావు- జెమినీ గణేశన్. మన అక్కినేనితో జెమినీ గణేశన్ కు చాలా పోలికలు ఉన్నాయి. ఇద్దరూ ప్రేమ చిత్రాల నటులే. ఇద్దరూ అందివచ్చిన రాజకీయ అవకాశాలను వద్దనుకున్నవాళ్లే. ఇద్దరూ అందగాళ్లే.. ఆ తరం అమ్మాయిల హృదయాల్లో నిలిచిపోయిన వాళ్లే.
అందుకే కాదల్ మన్నన్ జయంతి సందర్భంగా ఆదర్శిని డాట్ కామ్ నివాళులు.
.. ఆదర్శిని శ్రీ
.

Discussion about this post