ఒక రంగంలో ఉన్నత స్థానాలకు వెళ్లిన తర్వాత.. సర్వజనామోదయోగ్యమైన మనిషి ఎవ్వరూ ఉండరు. కానీ సర్వధా- తిరస్కరించవలసిన మనిషి కూడా ఎవ్వరూ ఉండరు! ప్రత్యేకించి రాజకీయాల్లో ఉండే వాళ్లను ఒక వర్గం ఎంతగా అభిమానిస్తారో.. మరొకవర్గం అంతగానూ ద్వేషిస్తుంటారు. నిత్యసత్యమైన సిద్ధాంతం ఇది! సార్వజనీనమైన సిద్ధాంతం ఇది! కానీ ప్రతి మనిషిలోనూ, ప్రతి నాయకుడిలోనూ.. ఈ సిద్ధాంతానికి అతీతమైన కొన్ని లక్షణాలు తప్పకుండా ఉంటాయి!!
రాజకీయాల్లో అనల్పమైన ప్రజాదరణతో, ఎంతో మంది ప్రేమను దక్కించుకుని ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన తర్వాత.. దానికి తగ్గట్టుగానే ద్వేషించేవాళ్లూ పెరుగుతూ ఉంటారు. వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడిగా అనల్పమైన ప్రజాదరణను మూటగట్టుకుని సీఎం పీఠాన్ని అధిష్టించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి కూడా అంతే! ప్రేమించే వాళ్లలాగానే.. ద్వేషించేవాళ్లూ దండిగానే ఉన్నారు. అయితే.. శత్రువులు అయినా సరే.. తప్పు పట్టలేని, అభినందించదగిన, ఆయననుంచి నేర్చుకోవాల్సిన లక్షణాలు కొన్ని జగన్లో ఉన్నాయి!
ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టిన రోజు. ఇవాళ ఆయన 49 సంవత్సరాలు పూర్తిచేసుకుని 50వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా.. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. శత్రువులు కూడా ఆయనను చూసి నేర్చుకోదగిన కొన్ని లక్షణాలను తెలియజెప్పే ప్రయత్న చేస్తోంది ‘ఆదర్శిని’. నవరత్నాలను తన పరిపాలనకు ఆత్మగా ఎంచుకున్న ముఖ్యమంత్రి నుంచి నేర్చుకోదగిన నవరత్నాల వంటి లక్షణాలివి.
1. వ్యాయామానికి ప్రాధాన్యం:
జగన్మోహన్ రెడ్డి వ్యాయామానికి చాలా ప్రాధాన్యం ఇస్తారు. భూమి బద్ధలైనా సరే.. ప్రతిరోజూ ఉదయం ఒక గంటసేపు విధిగా వ్యాయామం చేయాల్సిందే. ఎంతగా పనుల ఒత్తిడి, ఎన్ని అవాంతరాలు ఉన్నప్పటికీ.. ఆయన వ్యాయామం విడిచిపెట్టరు. కుటుంబసభ్యులందరికీ ఈ అలవాటు ఉంది. అందరూ విధిగా వ్యాయామం చేస్తారు.
2. మితాహారం:
జగన్ ఆహారం విషయంలో చాలా అదుపుగా ఉంటారు. ఎంత రుచికరమైన వంటకాలను వడ్డించినా, ఎన్ని ఎక్కువ రకాలు వడ్డించినా ఆయన చాలా మితంగా మాత్రమే తింటారు. ఉదయం బ్రేక్ఫాస్ట్ చేసే అలవాటు లేదు. అలాగే రాత్రి పొద్దుపోయిన తర్వాత భోజనం చేయడం కూడా అలవాటు లేదు. తినే వేళల్లో మాత్రమే, అదికూడా అతి తక్కువగానే తీసుకుంటారు.
నాన్వెజ్లో చికెన్కు నో : జగన్మోహన్ రెడ్డి మాంసాహారంలో అన్ని రకాల వంటకాలను తినడానికి ఇష్టపడతారు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ చికెన్ మాత్రం తీసుకోరు. జగన్ చికెన్ తినకపోవడం వెనుక ఒక కథ ఉంది. 1996 పార్లమెంటు ఎన్నికల్లో వైఎస్ రాజశేఖరరెడ్డి కడప నుంచి ఎంపీగా పోటీచేశారు. ఆ ఎన్నిక చాలా హోరాహోరీగా సాగింది. ఆ సమయంలో కడప జిల్లాకు ఉమేష్ చంద్ర ఎస్పీగా ఉన్నారు. అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబునాయుడు.. వైఎస్ను ఓడించడానికి ప్రభుత్వ యంత్రాంగాన్నంతా మోహరించారు. అయినా వైఎస్ విజయం సాధించారు.
ఎన్నికల్లో ఫలితం వచ్చి తాను నెగ్గిన తర్వాత అదే సాయంత్రం ప్రెస్ మీట్ లో వైఎస్ రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో నేను ప్రత్యర్థితో మాత్రమే కాదు, ఎస్పీ ఉమేష్ చంద్ర, ఈనాడు దినపత్రికతో కూడా తలపడాల్సి వచ్చింది అని కామెంట్ చేశారంటే ఆ ఎన్నిక తీవ్రత అర్థం చేసుకోవచ్చు. ఆ ఎన్నికల సమయంలో పరిస్థితి క్లిష్టంగా ఉండడంతో- ఆ ఎన్నికలో తన తండ్రి నెగ్గితే గనుక.. తనకు ఇష్టమైన చికెన్ తినడం మానేస్తానని జగన్మోహన్ రెడ్డి మొక్కుకున్నారని అంటారు. అది నిజమో కాదో తెలియదు గానీ.. జగన్మోహన్ రెడ్డి చికెన్ ముట్టుకోరు. (చికెన్ మానేయడం నేర్చుకోదగిన లక్షణం అని కాదుగానీ.. ఎంతో ఇష్టమైన వంట అయినా.. అవసరం వస్తే విడిచిపెట్టేయగలగడం మాత్రం తప్పకుండా నేర్చుకోవాల్సినదే)
3. గ్రీన్ టీ :
ఆరోగ్యం పట్ల స్పృహ ఉండే చాలా మంది గ్రీన్ టీ తాగడం మామూలే. సీఎం జగన్ కూడా గ్రీన్ టీ మాత్రమే తాగుతారు. పాలతో చేసిన టీ, కాఫీలు పుచ్చుకోరు. అయితే ఏదో అందరూ తాగినట్టుగా కప్ లలో తాగేంత మోతాదు కాదు. బీర్ మగ్ కంటె సైజులో కొంచెం పెద్దదిగా ఉండే గాజు మగ్లో ఆయన గ్రీన్ టీ తాగుతారు. ఆ సమయానికి తనకు అతిథులు ఉంటే.. వారికి గ్రీన్ టీతో పాటు సాధారణ టీ, కాఫీలు ఆఫర్ చేస్తారు. తాను మాత్రం గ్రీన్ టీ తాగుతారు.
4. మితనిద్ర :
చాలా మితంగా నిద్రపోతారు. రోజుకు ఎనిమిది గంటలు ఆరోగ్యకరమైన నిద్ర అని పలువురు చెబుతూ ఉంటారు గానీ జగన్మోహన్ రెడ్డి అంతకంటె తక్కువ సమయం నిద్రకు కేటాయిస్తారు.
5. ఖాళీగా ఉండరు :
‘నిర్వ్యాపారత్వం మృత్యులక్షణం’ అంటారు పెద్దలు. పనిలేకుండా ఖాళీగా ఉంటే చచ్చిపోయిన వాడితో సమానం అంటారు. జగన్కు కూడా ఖాళీగా ఉండడం ఇష్టం ఉండదు. అలాగని.. పొద్దస్తమానమూ.. ప్రభుత్వ పనులు, అధికార్లతో సమావేశాలు అని కూడా కాదు. ఈ పనుల ఒత్తిడిలో అంతో ఇంతో ఖాళీ దొరికితే పుస్తకాలు చదవడం, సినిమాలు చూడడం చేస్తారు.
6. కుటుంబానికి తగిన సమయం :
రాజకీయ జీవితానికి కేటాయించిన దానితో సమానంగా కుటుంబానికి కూడా సమయం కేటాయించాలని జగన్మోహన్ రెడ్డి అనుకుంటారు. కుటుంబసభ్యులతో తగిన సమయం గడుపుతారు. ప్రస్తుతం పిల్లలు చెంత లేకపోయినప్పటికీ.. గతంలో పిల్లలతో గడపడాన్ని కూడా ఆయన ఎక్కువగా ఇష్టపడేవారు.
7. సాధారణ వస్త్రధారణ :
జగన్మోహన్ రెడ్డి చాలా సాధారణమైన వస్త్రధారణనే ఇష్టపడతారు. సాధారణంగా అందరూ ధరించే చొక్కా కంటె ఆయన ధరించే చొక్కా పొడవు కాస్త ఎక్కువగా ఉంటుంది. అయితే అది అమెరికన్ పద్ధతి అని అంటుంటారు.
EXCLUSIVE ARTICLES
సీనియర్ జర్నలిస్టు గోవిందరాజు చక్రధర్ వ్యాసాల ప్రత్యేకపేజీ కోసం క్లిక్ చేయండి
‘సుభాషితం’ సంస్కృతశ్లోకాలకు భావవివరణల వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు బీరక రవి ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు డాక్టర్ ఎస్ రాము ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
దేవీప్రసాద్ ఒబ్బు లోపలిమాట వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సంపాదకుడు సురేష్ పిళ్లె వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
వైఎస్సార్ మరణించినప్పుడు.. వస్త్రధారణలో ఆయనను అనుకరించే ప్రయత్నం చేశారు. వైఎస్ తరహాలో ధోవతి కట్టు జోలికి వెళ్లకపోయినప్పటికీ.. లాల్చీ తరహాలో రెండు బటన్లు మాత్రమే ఉండే ఖద్దరు పొడుగు చేతుల చొక్కా ధరించే వారు. తర్వాత శైలి మార్చారు. నిలువుగీతల చొక్కాలు అలవాటుగా చేసుకున్నారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత.. కేవలం తెల్లచొక్కాలు మాత్రమే ధరిస్తున్నారు. ఆయన కేవలం కుట్టించిన చొక్కాలను మాత్రమే వేసుకుంటారు. రెడీమేడ్ వాడరు. అనంతపురం జిల్లా రాయదుర్గం ప్రాంతంలోని టైలరు వద్ద చొక్కా, ప్యాంటులు కుట్టిస్తారని అంటుంటారు.
8. పాత్రికేయుల మిత్రుడు :
వైఎస్ జగన్మోహన్ రెడ్డి- ఈనాడు, ఆంధ్రజ్యోతి సంస్థల మీద పదేపదే విమర్శలు చేస్తూ ఉండడం అందరికీ తెలుసు. చాలా కార్యక్రమాలకు ఆ పత్రికల వారిని పిలకుండా నడిపించడం కూడా జరుగుతూ ఉంటుంది. అయితే.. జగన్ ఆ సంస్థలను ఎంతగా దూషించినప్పటికీ.. ఆ సంస్థలకు చెందిన విలేకర్లతో స్నేహపూర్వకంగానే ఉంటారు. తన మీద నెగటివ్ వార్త రాసిన తర్వాత ఆ రిపోర్టరు కనిపించినా కూడా.. కోపంగా కాకుండా.. ఎప్పటిలాగా స్నేహపూర్వకంగానే.. వారి పేరుకు ‘అన్నా’ అనే తనకు అలవాటైన పిలుపు జోడించి పలకరిస్తారు.
9. మద్యానికి దూరం :
జగన్మోహన్ రెడ్డి మద్యం సేవించరు. ఆయనకు అలవాటు లేదు. రాజకీయ నాయకుల్లో ఈ అలవాటు చాలా సాధారణంగా ఉండేదే అయినప్పటికీ.. జగన్కు లేదు. పార్టీ డ్రింకింగ్ అంటూ మర్యాద కోసం తాగడం కూడా జగన్కు అలవాటు లేదు. ఇక్కడ ఉన్నప్పుడు మాత్రమే కాదు.. విదేశాలకు వెళ్లినప్పుడు, తన గౌరవార్థం అక్కడి వారు విందులు ఏర్పాటు చేసినప్పుడు- అక్కడ మద్యం సేవించడం సాంప్రదాయమే అయినప్పటికీ జగన్ మాత్రం మద్యం ముట్టుకోరు.
ఒక ప్రముఖుడిని ఇతరత్రా అందరూ అభిమానించినప్పటికీ.. ఆయన రంగంలో ఆయనను చూసి అసూయ పడేవారు, ఓర్వలేని వారు ఏదో ఒక మాట అంటూనే ఉంటారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత.. ద్వేషించే వారూ పెరగడం వింత కాదు. అయితే.. ఈ వ్యాసంలో పేర్కొన్న లక్షణాలు అందరూ అనుసరించదగినవి. ఈ లక్షణాల్లో దాదాపు అన్నీ అందరూ పాటించదగినవి. రాజకీయాల్లో ఉన్నవారు.. ప్రత్యేకించి కొన్ని లక్షణాలను విధిగా అనుసరించాలి. ఆ రకంగా తన అలవాట్లు వ్యక్తిత్వంలోని కొన్ని లక్షణాల విషయంలో జగన్మోహన్ రెడ్డి- రోల్ మోడల్ అనే చెప్పాలి.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, ‘ఆదర్శిని’ పుట్టినరోజు శుభాకాంక్షలు!
.. కె.ఎ. మునిసురేష్ పిళ్లె
సంపాదకుడు
.