దక్షిణకాశి శ్రీకాళహస్తిని సద్యోముక్తి క్షేత్రం అంటారు. ఇక్కడ అడుగుపెడితేనే మోక్షం సిద్ధిస్తుందని శివపురాణం చెబుతుంది. అలాంటి శ్రీకాళహస్తి క్షేత్రస్ఫూర్తి మూర్తీభవించినట్లుగా.. తాను రాజకీయాలలో అడుగుపెట్టడమే.. ప్రగతి బాటగా.. సర్వతోముఖాభివృద్ధికి పర్యాయపదంగా రూపుదిద్దుకున్న నిత్యసేవాభిలాషి శ్రీ బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి.
రాష్ట్రంలోనే పేరెన్నికగన్న శ్రీకాళహస్తి నియోజకవర్గం.. ఇవాళ అనుభవిస్తున్న అనేకానేక అభివృద్ధి ఫలాలకు మూలపురుషుడు గోపాలన్న. అయిదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, సుదీర్ఘకాలం తన రాజకీయ జీవన ప్రస్థానాన్ని యావత్ రాష్ట్రానికి, ప్రత్యేకించి శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలకు ఇతోధికంగా అంకితం చేసిన మహామనీషి శ్రీ బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి గారు. మంచి మనిషి, సేవాపరాయణుడు, గోపాలన్న 73వ జన్మదినం.. ఏప్రిల్ 15. నియోజకవర్గ అభిమానుల సమక్షంలో పుట్టినరోజు వేడుక జరుపుకున్న గోపాలకృష్ణారెడ్డి అంతలోనే కన్నుమూశారు.
రాజకీయ కుటుంబంలోనే జననం

శ్రీకాళహస్తి ఎమ్మెల్యేగా సేవలందించిన ఊరందూరు గ్రామానికి చెందిన గంగసుబ్బరామిరెడ్డి, విశాలక్ష్మి దంపతులకు 1949 ఏప్రిల్ 15న బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు జన్మించారు. న్యాయవిద్య అభ్యసించిన ఆయన వ్యాపారరంగంలోనే స్థిరపడ్డారు. తెలుగునాట రాజకీయ దిగ్దంతులైన కర్నూలు జిల్లాకు చెందిన పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి- లక్ష్మీదేవిల కుమార్తె బృందమ్మతో ఆయనకు వివాహం అయింది.
ఆ దంపతులకు ఇద్దరు పిల్లలు పద్మరేఖ, సుధీర్ రెడ్డి కలిగారు. కూతురు పద్మరేఖ, అల్లుడు గంగాభవన్ రెడ్డి! అక్షయ్ వారి కుమారుడు. కొడుకు సుధీర్ రెడ్డి, కోడలు రిషిత. వారికి ఇద్దరు కుమార్తెలు.. అనిక, సవిక! మానవీయ బంధాల విలువ తెలిసిన బొజ్జల వారిది ఇప్పటికీ అయిదు తరాలుగా ఉమ్మడి కుటుంబం. ఆయన తమ్ముడు హరినాధ రెడ్డి కూడా మండల రాజకీయాల్లో కీలకంగా సేవలందించారు.
రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబమే అయినప్పటికీ, గోపాలకృష్ణారెడ్డి తనంతగా రాజకీయ మార్గాన్ని ఎంచుకోలేదు. ఆయనలోని నిజాయితీ, నిష్కళంక వ్యక్తిత్వం తెలుసుకుని, ఆకర్షితులైన తెలుగుదేశం అధినేత నందమూరి తారక రామారావు గారు ఎమ్మెల్యేగా పోటీచేసేందుకు అవకాశం ఇచ్చినా.. సున్నితంగా గోపాలకృష్ణారెడ్డి తిరస్కరించారు.
అయితే బొజ్జలను దూరం చేసుకోలేకపోయిన ఎన్టీఆర్ 1987 శ్రీకాళహస్తీశ్వరాలయ ట్రస్టుబోర్డు ఛైర్మన్ చేశారు. ఆ రకంగా గోపాలన్న తొలి అడుగు, ముక్కంటి సేవ కోసమే పడింది. జ్ఞానప్రసూనాంబ, శ్రీకాళహస్తీశ్వరుల ఆలయాభివృద్ధికి ఆయన అహరహమూ తన శక్తియుక్తులన్నీ వెచ్చించి పనిచేశారు. రాహుక్షేత్రమైన శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజలకు ఇప్పటి వైభవ స్థితి ఏర్పడిందంటే.. అది గోపాలకృష్ణారెడ్డి కృషి ఫలితమే.
ఎన్టీఆర్ ప్రత్యేకఆహ్వానంతో రాజకీయాల్లోకి
1989 ఎన్నికల సమయానికి.. శ్రీకాళహస్తిలో బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తప్ప మరొకరు విజయం సాధించే అవకాశమే లేదనే పరిస్థితిని గమనించిన రామారావు గారు.. పార్టీ అవసరాలకోసం తప్పదన్నట్లుగానే గోపాలకృష్ణారెడ్డికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. సుదీర్ఘమైన రాజకీయ ప్రస్థానంలో ఆ విజయం పునాదిగా.. ఆయన అయిదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆచంద్రతారార్కమూ శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలు తన సేవలను, తన పేరును గుర్తుంచుకోగలిగే స్థాయిలో పనిచేశారు.

మంత్రిగా సుదీర్ఘకాలం పనిచేసి.. ఏ శాఖను నిర్వహించినా.. రోల్ మోడల్గా అందరూ గుర్తుంచుకునేలా సేవలందించారు. ఇరిగేషన్, ఆర్అండ్బీ, ఐటీ డ్వాక్రా, అటవీ శాఖలను ఆయన ఎంతో సమర్థంగా నిర్వహించారు. హైదరాబాదు నగరం ఇవాళ ఐటీ పరిశ్రమకు స్వర్గధామంలా విలసిల్లుతున్నదంటే.. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కృషి ఎంతో ఉన్నదో, అప్పటి ఐటీ మంత్రిగా గోపాలకృష్ణారెడ్డి పాత్ర కూడా అంతే ఉంది.
తెలుగుదేశం పార్టీని కాపాడుకోవడానికి వ్యూహాత్మక ఎత్తుగడగా జరిగిన వైస్రాయి ఉదంతంలో గోపాలకృష్ణారెడ్డి పాత్ర కీలకం. ఎమ్మెల్యేల సమీకరణ దగ్గరినుంచి వైస్రాయి హోటల్లో కట్టుదిట్టమైన ఏర్పాట్ల వరకు అన్నీ తానే అయి చక్రం తిప్పిన గోపాలన్న, ముఖ్యమంత్రి చంద్రబాబుకు సన్నిహితులయ్యారు. ఆయన వద్ద తిరుగులేని నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. పార్టీలో కేసీఆర్, తుమ్మల నాగేశ్వరరావు, మండవ వెంకటేశ్వరరావులతో ఆత్మీయంగా మెలిగేవారు. 2003 అక్టోబరు 1న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారి వెంట తిరుమలకు వెళుతూ అలిపిరి వద్ద బాంబు పేలుడులో తీవ్రంగా గాయపడిన గోపాలకృష్ణారెడ్డి నియోజకవర్గ ప్రజల ప్రేమాభిమానాలు, శ్రీకాళహస్తీశ్వరుని ఆశీస్సులతో మృత్యుంజయుడిగా తిరిగివచ్చి.. సుదీర్ఘ ప్రజాజీవితాన్ని గడిపారు.
రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడిన తొలి ప్రభుత్వంలో అటవీశాఖ మంత్రిగా పనిచేసిన గోపాలకృష్ణారెడ్డి 2017 తర్వాత అనారోగ్య కారణాల రీత్యా.. రాజకీయంగా నెమ్మదించారు. 2019 ఎన్నికల సమయానికి.. శ్రీకాళహస్తి నియోజకవర్గం అభివృద్ధి పరంగా అత్యున్నతమైన ఎప్పటికీ వైభవ స్థితిలో ఉండాలనే తన స్వప్నాన్ని ముందుకు తీసుకువెళ్లే బాధ్యతను కొడుకు బొజ్జల సుధీర్ రెడ్డి భుజస్కంధాలపై ఉంచి విశ్రాంతి తీసుకుంటున్నారు.
శ్రీకాళహస్తి పురోభివృద్ధిలో గోపాలన్న ముద్ర శాశ్వతం
శ్రీకాళహస్తి నియోజకవర్గం వ్యాప్తంగా ఇవాళ ఉన్న ఆధునిక అభివృద్ధి స్వరూపం యావత్తూ కేవలం బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి గారి కృషి అంటే అతిశయోక్తి కాదు. శ్రీకాళహస్తీశ్వరాలయాన్ని దేశవ్యాప్తంగా ప్రధాన ఆలయాల సరసకు తీసుకువెళ్లడంతోనే ఆయన కృషి ప్రారంభం అయింది. ఒకప్పట్లో ఏడాది మొత్తానికి లక్షల్లో మాత్రమే ఆదాయం ఉన్న ఆలయం, ఇవాళ ఏటా వందల కోట్ల రాబడిని ఆర్జిస్తున్నదంటే అది గోపాలన్న కృషి. రాహుకేతు పూజలకు ఇప్పటి వైభవస్థితిని తీసుకువచ్చింది

ఆయనే. ఆలయ ఛైర్మన్ గానే ప్రస్థానం ప్రారంభించినందున ఏర్పడిన అవగాహనతో ఎమ్మెల్యే, మంత్రి అయిన తర్వాత కూడా ఆయన ఆలయ కీలక ప్రగతికి సూత్రధారి అయ్యారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో చెరువులు, కాలువలు పటిష్టం చేయడం, ఊరూరా ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణం, గ్రామీణ రోడ్ల నిర్మాణం, ఎస్సీ ఎస్టీ కాలనీల్లో అభవృద్ధి, కొత్త సబ్ స్టేషన్ల ఏర్పాటు ద్వారా.. విద్యుత్తు కొరత తీర్చడం ఇవన్నీ ఆయన కృషి ఫలితాలు. స్వయంగా తమ కుటుంబం తరఫున, కొడుకు సుధీర్ రెడ్డి పూనుకోవడంతో కొంత విరాళాలను కూడా కలిపి నియోజకవర్గంలో 70 పంచాయతీల్లో మినరల్ వాటర్ ప్లాంటు ఏర్పాటు చేయించిన ఔదార్యం ఆయన సొంతం.
శ్రీకాళహస్తి నియోజకవర్గం మొత్తం ఇవాళ ఒక పారిశ్రామిక కేంద్రంగా విలసిల్లుతున్నదంటే, నియోజకవర్గంలో నిరుద్యోగం అనే పదమే వినిపించడం లేదంటే.. అది గోపాలకృష్ణారెడ్డి గారి కృషే.
అంతర్జాతీయ విమానాశ్రయం, ఐఐటీ- ఐసర్ వంటి అత్యున్నత విద్యాసంస్థలు నియోజకవర్గంలో కొలువుదీరాయి. రాష్ట్రంలో ఎండోమెంట్స్ శాఖకు అనుబంధమైన ఏకైక ఇంజినీరింగ్ కాలేజీగా స్కిట్ ఏర్పాటు కావడం ఆయన కృషి ఫలితమే.
అన్నీ ఇన్నీ అని లెక్కచెప్పలేనంత ప్రగతి
విద్యారంగం విషయానికి వస్తే.. ప్రతి పాఠశాలలోనూ డిజిటల్ క్లాస్ రూములు ఏర్పాటు అయినా, మరుగుదొడ్ల వసతులు ఏర్పడినా, గురుకుల పాఠశాలకు 5 కోట్ల నిధులు వచ్చినా, పీజీ పాలిటెక్నిక్ నర్సింగ్ కోర్సులు మంజూరైనా అన్నీ గోపాలన్న చలవే.
పారిశ్రామికంగా జిల్లాలోనే ఎక్కడా లేనంత అభివృద్ధి శ్రీకాళహస్తిలోనే కనిపిస్తున్నదంటే గోపాలన్న కష్టమే. ఏపీఐఐసీ ద్వారా నిధులు భూములు అభివృద్ధి చేసి.. TCL,TCS, Dixon, Kajaria, Greenply, Rockmen, Sudasomani, Kalahasti pipes, coco cola, Vishnu chemicals, celcone, prakash frames పరిశ్రమలను తీసుకవచ్చారు.
రైతులకోసం విద్యుత్తు కొరత తెలియకుండా 15 సబ్ స్టేషన్లు మంజూరు చేయించారు. జన్మభూమి ద్వారా చెరువులను అద్భుతంగా తయారు చేయించారు. చెక్ డ్యాంలు నిర్మింపజేశారు. రైతులకోసం శ్రీకాళహస్తిలో ఏర్పాటు అయిన రైతుబజార్ ఒక విప్లవం.
గ్రామీణ రోడ్లపై ఎంతో శ్రద్ధ పెట్టారు. తన నియోజకవర్గంలో ఒక రోడ్డును ఆర్అండ్బీ పరిధిలోకి తేవడానికి ఎంతో ప్రయత్నించిన గోపాలన్న, తాను ఆశాఖకు మంత్రి కాగానే జిల్లాలో 400 కిలోమీటర్ల రోడ్లను ఆర్అండ్బీ కిందికి తెచ్చారు. ఆ రోడ్లతో ఇతర గ్రామాలను అనుసంధానించారు. ప్రతిగ్రామంలో సిమెంటు రోడ్లు, నీటి ట్యాంకులు ఏర్పాటయ్యాయి. లెక్కకు మిక్కిలిగా నియోజకవర్గంలో వేల సంఖ్యలో పక్కాఇళ్లు మంజూరు చేయించారు.
ఇదీ చదవండి :
మాజీమంత్రి బొజ్జల గోపాల కృష్ణారెడ్డి కన్నుమూత
శ్రీకాళహస్తి మునిసిపాలిటీ పరిధిలో అభివృద్ధి సామాన్యమైనది కాదు. హరితాభివృద్ధి పథకం ద్వారా బోడికొండల్లాగా ఉన్న పట్టణ పరిధిలోని కొండలను అడవుల్లాగా తయారు చేయించారు. పార్కులు ఏర్పాటు చేయించారు. వంద పడకల ఆస్పత్రికి అదనంగా మరో వందపడకలతో పాటు డయాలసిస్ కేంద్రం ఏర్పాటుచేయించారు. మూడు బ్రిడ్జిలను నిర్మించారు. భరద్వాజ తీర్థాన్ని సుందరీకరించారు.
ముస్లింల కోసం యాభై కోట్ల విలువైన షాదీ మహళ్లు, ఈద్గాలను నిర్మించారు. తొండమనాడులోని వెంకటేశ్వర ఆలయాన్ని టీటీడీతో అనుసంధానించి.. అభివృద్ధికి పునాది వేశారు. పట్టణంలో శాంతి భద్రతలను అదుపులో ఉంచడం గోపాలన్న చేసిన అద్భుతాలలో ఒకటి. రాజకీయాలకు తావులేకుండా శాంతిని కాపాడారు.
అయిదుసార్లు గెలిచిన ఎమ్మెల్యేగా.. ఆయన చేసిన సేవలను శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలు తరతరాలకూ గుర్తుంచుకుంటారు. శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలను, లెక్కకు మిక్కిలిగా ఉన్న అభిమానులను విషాదంలో ముంచి శాశ్వతంగా సెలవు తీసుకున్న గోపాలన్న మృతికి ‘ఆదర్శిని’ ప్రగాఢం సంతాపం తెలియజేస్తోంది.
.. సంపాదకుడు

.
Discussion about this post