జీవులెప్పుడూ సుఖాన్వేషణ వైపే అడుగులు వేస్తూ ఉంటాయి. అలా సుఖాన్వేషణ కోసం వెంపర్లాడే జీవరాసులలో మనిషే కాస్త ముందు వరుసలో ఉంటాడు. ఎందుకంటే బతుకు పోరాటంలో తమకు లభించిన వాటితోనే తృప్తి పడి స్థిమితంగా ఉండిపోతాయి మిగతా జీవరాసులు. అందుకే వాటికి బతుకు గమనంలో ఎదురయ్యే సుఖదుఃఖాలను అవి సమదృష్టితో చూడగలుగుతాయి.
కానీ, మనిషి వ్యక్తిత్వం అందుకు విరుద్ధం. మనిషి మస్తిష్కంలో సంతృప్తికి చోటులేదు. అది ఎప్పుడూ ఏదో కావాలని తహతహలాడుతూ ఉంటుంది. అందుకే మనిషి సుఖానికంటే దుఃఖానికే ఎక్కువ ప్రభావితుడై తల్లడిల్లిపోతున్నాడేగాని సుఖాన్ని తనివితీరా ఆస్వాదించలేకపోతున్నాడు.
ఎవరినుంచో (వ్యక్తులనుంచో), దేనినుంచో(వస్తువులనుంచో) ఏదో పొందాలనే అజ్ఞానపు ఆలోచనే మనిషి అశాంతికి అసలైన కారణం.
పెళ్ళికి ముందు ప్రేమికులుగా ఉన్న సమయంలో ఓ జంట “నీవు లేకపోతే నేను ఒక్క క్షణమైనా ఉండలేను” అని ఇరువురూ ఊసులాడుకుంటూ ఊహలలో తేలియాడుతూ మధుర క్షణాలు గడుపుతారు. తీరా పెళ్ళి అయ్యాక ఒకనొకరు ద్వేషించుకుంటూ ఉంటారు. మరి పెళ్ళికి ముందు వాళ్ళు అనుభవించిన క్షణాలు అన్నీ అభూత కల్పనలే. మాట్లాడుకున్న మాటలన్నీ మాయమాటలే.
భార్యాభర్తల మధ్యనేకాదు వ్యక్తుల మధ్య ఉన్న ఏ బంధమైనా అబద్ధమే, అశాశ్వతమే. మనుషుల మధ్య ఉన్నాయనుకునే ప్రేమ, ఆప్యాయతలన్నీ భ్రమ కలిగించే ఎండమావులే.
మనం రోజూ ఇష్టంగా చూసే టీవీ సరిగా పనిచేయకపోతే రిపేర్ చేయిస్తాం. అప్పటికీ కూడా పనిచేయకపోతే వీధిలోనున్న చెత్తకుండీలోకి విసిరి పారేస్తాం. తర్వాత కొత్తది కొనుక్కుని పాత టీవీని మరచిపోతాం.
అలాగే మన ఇంట్లో మనిషి ఎవరైనా అనారోగ్యానికి గురై మరణిస్తే ఎప్పుడెత్తారు ఈ శవాన్ని అని అడుగుతారు ఇరుగుపొరుగు వారు. రోజు తిరగక ముందే ఎత్తుకెళ్ళి ఏట్లో పడేస్తాం. నెలలు గడిచేకొద్దీ చనిపోయిన వ్యక్తి గురించి క్రమంగా ఆలోచించడం మానేస్తాం. కొన్నాళ్ళకు ఆ మనిషినే మరచిపోతాం.
మరి అప్పటివరకు అపురూపంగా చూసుకున్న వస్తువుల మీద ఉన్న ఇష్టం, మనుషుల మధ్య ఉన్న ప్రేమ, ఆప్యాయతలు ఏమైపోయాయి?
కాబట్టి దేనిమీద, ఎవరిమీద అమితమైన ఇష్టాన్ని, ప్రేమను పెట్టుకోకూడదు. అలాగే ఎవరి నుంచి ఏదీ ఆశించకూడదు. అప్పుడే మనం హాయిగా మనుగడ సాగించగలం.
అలా ఈ సమాజంలో ఉండడం సాధ్యమేనా? అంటే సాధ్యమే. అలా ఉండడానికి సులువైన మార్గం ఏకాంతంగా గడపడమే.
ఏకాంతం అంటే ఒంటరిగా కూర్చుని గడపడం కాదు. అందరిలో ఉంటూనే ఏకాంతాన్ని అనుభవించడం. వస్తువులను ఉపయోగించుకో, కానీ అవి లేకపోతే ఉండలేను అనే స్థితికి రావొద్దు. మనుషులతో మసలుకో, కానీ వాళ్ళతో ఎక్కువగా మమతానురాగాలు పంచుకోకు. వాళ్ళు ప్రేమిస్తే పొంగిపోవద్దు, ద్వేషిస్తే దిగులుపడకు.
ఏది లేకపోయానా నేనుండగలను.
ఎవరు లేకపోయినా నేనుండగలను.
అని తెలిసి అన్నిటితో అందరితో ఉన్నప్పటికీ
అది ఏకాంతమే అవుతుంది.
సెల్ఫోను మన అవసరాలకు వినియోగించుకోవాలి. అంతేగాని దానికి పూర్తిగా అడిట్ కాకూడదు. అది లేకపోయినా ఉండగలిగే
సామర్థ్యాన్ని సాధించాలి. సెల్ఫోనే కాదు ఏ వస్తువు వినియోగంలోనైనా ఇదే సూత్రాన్ని అవలంబించాలి. అలాగే ఎవరిమీదా అపరితమైన ఇష్టాన్ని, ప్రేమను పెంచుకోవద్దు. ఎందుకంటే మీరు ఎక్కువగా ఇష్టపడే వ్యక్తి అకస్మాత్తుగా మిమ్మల్ని ద్వేషించారనుకో అప్పుడు మీరు తట్టుకోలేరు. ఆందోళనకు గురౌతారు.
అందరిలో ఉండు, కానీ అంటీఅంటనట్లు ఉండు. నీ చుట్టూ నీకు వినిపించే మాటలను, అనిపించే ఆలోచనలను ఎప్పటికప్పుడు నీ స్మృతిపథంలోంచి తుడిచివేస్తూ ఉండు. అప్పుడు నీవు అనుభవించే స్థితే ఏకాంతం.
సదా అలాంటి ఏకాంతాన్ని అనుభవిస్తూ ఉండు. కొంతకాలానికి నీవు ఉన్నావనే స్పృహ కూడా నీ అనుభవంలోకి రాదు. ఎప్పుడైతే నీకు ఏదీ అనుభవంలోకి రాదో అప్పుడు నీవు హాయిగా ఉండగలుగుతావు. అలాంటి అనుభవం గాఢనిద్రలో ఉంటుంది. అక్కడా ఎవరూ ఉండరు నీతో సహా. అదే అసలైన ఏకాంతం.
ఒంటరితనం అంటే
తనకెవరూ లేకపోవడం.
ఏకాంతం అంటే
తనకు తానే లేకపోవడం
సదా ఆ స్థితిలో ఉండడమే ఏకాంతం. అందుకే ఏకాంతమే ఏకైక ఆనందం.
…దేవీప్రసాద్ ఒబ్బు
9866251159
.