జగమెరిగిన జర్నలిస్టుగా, రచయితగా, పాత్రికేయ గురువుగా సుప్రసిద్ధులు డాక్టర్ గోవిందరాజు చక్రధర్. జర్నలిజంలో సుదీర్ఘ, బహుముఖ ప్రస్థానం ఆయనది. కొండను అద్దంలో చూపినట్టుగా.. సుదీర్ఘ జీవితాన్ని సంక్షిప్తంగా వివరించే చిన్న ఆత్మకథ లాంటిది ఈ వ్యాసం. ఆదర్శిని పాఠకుల కోసం..
నేను పుట్టి పెరిగిన గుంటూరులో అరవై, డెబ్భయిలలో నెలకొన్న వాతావరణమే అక్షరాలతో బంధాన్ని, అనుబంధాన్ని ఏర్పరచింది.
అప్పట్లో మధ్యతరగతి ఇళ్లలో పఠనాభిలాష వెల్లివిరిసేది. ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక, యువ, జ్యోతి, జయశ్రీ, తరుణి వంటి పత్రికలను చదువుతుండేవారు. ఆంధ్రప్రభ వీక్లీలో బాపు బొమ్మలతో కథలు వచ్చేవి. యద్దనపూడి సులోచనారాణి, కౌసల్యాదేవి, రంగనాయకమ్మ, లత వంటి రచయిత్రులతోపాటు చలం, కొడవగంటి కుటుంబ రావు, కొమ్మూరి వేణుగోపాలరావు వంటి రచయితలూ విరివిగా రాస్తుండేవారు. కొమ్మూరి సాంబశివరావు, గిరిజశ్రీ భగవాన్, మధుబాబు వంటివారు సమాంతరంగా డిటెక్టివ్ నవలలు రాసేవారు. డిటెక్టివ్ కథలకోసం అపరాధ పరిశోధన అనే పేరుతో మంత్లీ కూడా వస్తుండేది. విజయవాడ పబ్లిషర్లు వేరుగా నవలలను పుస్తకాలుగా ప్రచురిస్తుండేవారు.
ప్రతి వీధిలో అద్దెపుస్తకాల షాపులు ఉండేవి. ఇవి తక్కువ ధరలకు పుస్తకాలను సర్క్యులేట్ చేస్తూ పఠనాసక్తులను తీరుస్తుండేవి. ఎం.ఎన్.రావు సారధ్యంలోని.. ఎం.శేషాచలం అండ్ కో (ఎమెస్కో) ప్రచురణ సంస్థ పాకెట్ సైజులో గ్లాసీ పేపర్పై చలం, బలివాడ కాంతారావు వంటివారి నవలలను, ప్రాచీన కావ్యాలను బాపు కవర్ పేజీ బొమ్మలతో చౌకగా రూ.2 కే అందించేది. ఇంటింటా గ్రంథాలయం పేరుతో ఎమెస్కో సంస్థ పథకాన్ని ప్రవేశపెట్టి దిగ్విజయంగా అమలు చేసింది. దీపావళికి యువ, జ్యోతి, ఆంధ్రప్రభ వీక్లీ ఎక్కువ పేజీలతో కునేగా సెంటు పరిమళాలతో ప్రత్యేక సంచికలు వెలువరించేవి. వీటికోసం కథల పోటీలు నిర్వహించేవారు. బాపు, చంద్ర, బాలి గీసిన వర్ణ చిత్రాలతో ముస్తాబయి ఇవి పండగ సందడిని రెట్టింపు చేసేవి.
కిళ్లీ బడ్డీలు కూడా వార, మాస, దిన పత్రికలతో, నవలలతో కనువిందు చేసేవి. అరసం, విరసం ఉద్యమాలూ జోరుగా సాగేవి. శ్రీశ్రీ మహాప్రస్థానం యువతకు నిత్య పారాయణ గ్రంథం. ఆరుద్ర సినీవాలి, త్వమేవాహం, కూనలమ్మ పదాలు, దాశరథి, సి.నారాయణరెడ్డి కవిత్వాలు పోటాపోటీగా చదివించేవి. ఎక్కడ చూసినా సాహిత్య చర్చలు, కవితా సమ్మేళనాలే. ఈ వాతావరణం రాయాలన్న ఆసక్తికి చిన్నతనాన్నే బీజం వేసింది.
కుటుంబ వాతావరణం..
మా నాన్న వెంకటేశ్వరరావు చందమామ, సోవియట్ భూమి పత్రికలను తెప్పిస్తుండేవారు. చందమామను చేతిలోకి తీసుకుని ఏకబిగిన పూర్తిచేసేవాణ్ని. నా మాతామహులు చింతలపూడి నారాయణరావు, గుంటూరులో ర్యాలీస్ ఇండియాకి ఏజెంటుగా ఉండేవారు. ఆయనకు ఏడుగురు కుమార్తెలు. ఒక కుమారుడు. చివరి పిన్ని రాజేశ్వరి, ‘సుచరిత’ కలం పేరుతో ఆంధ్రప్రభ, యువకు పుంఖాను పుంఖాలుగా కథలు రాస్తుండేవారు. రచనా వ్యాసంగంలోకి ప్రవేశించటానికి ఆవిడే స్ఫూర్తి. ఎనిమిదో తరగతిలోనే స్కూలు మేగజీన్కు కథ రాశాను. ఆ తర్వాత ఇక విరామం లేకుండా ఇన్నేళ్లుగా రాస్తూనే ఉన్నాను. మా తాతగారి ఆఫీసు పనులకోసం పీరోజీ అనే బంట్రోతు పనిచేస్తుండేవాడు. మధ్యాహ్నం భోజనాలు పూర్తి చేసుకుని అందరూ కునుకు తీసేవేళ నేను నెమ్మదిగా పీరోజీ దగ్గరకు చేరి కథలు చెప్పమనేవాణ్ని. ఎన్నో కథలు ఆసక్తిగా వింటూ ఉండేవాణ్ని. నా ఊహల రెక్కలకు పీరోజీ కథలు బలాన్నిచ్చాయి.

డాక్టర్ పరుచూరి రాజారావు డెర్మటాలజిస్టు. ఆయన ఇల్లు సాహిత్య చర్చలకు కేంద్రంగా ఉండేది. సాయంకాలం కాగానే యువ రచయితలు చేరేవారు. నేనూ ఆ సమావేశాల్లో పాల్గొంటూ ఉండేవాణ్ని. బల్గేరియా కవిత పేరిట తెలుగులో అనువాద కవితలను సంకలనంగా ప్రచురించారు. పెనుగొండ లక్ష్మీనారాయణ ప్రోత్సహించి నాచేత ఒక కవితను అనువదింపచేసి ఈ సంకలనంలో ప్రచురించారు. బల్గేరియా రాయబారి ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఆయన చేతుల మీదుగా పుస్తకాన్ని అందుకున్నాను.
గుంటూరులో సాహిత్య వాతావరణంతోపాటు ప్రాంతీయ గ్రంథాలయం కూడా నన్ను మలచడంలో ముఖ్య భూమిక పోషించింది. ఈ లైబ్రరీలో విశ్వరచన దగ్గరనుంచి పలు రకాల పత్రికలు వస్తుండేవి. గ్రంథాలయ వారోత్సవాలను పండగలా జరిపేవారు. గిరిధర రావు అనే లైబ్రేరియన్ కలివిడిగా స్నేహపాత్రంగా ఉంటూ ప్రోత్సహించేవారు. వారోత్సవాల్లో భాగంగా నిర్వహించే వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లో చురుగ్గా పాల్గొనేవాణ్ని. భావి జీవిత గమనానికి ఇలా పునాది పడింది.
రచయితగా..
హైస్కూలు స్థాయిలోనే పరీక్షలు పూర్తవటం ఆలస్యం.. కాగితాలు తెచ్చుకుని రాయటం మొదలుపెట్టేవాణ్ని. ఇలా కొన్ని కథలు సిద్ధం చేసి ఎంతో ఆశగా ఎమెస్కో వారికి పంపగా అవి వెంటనే వెనక్కి వచ్చాయి. విజయవాడలో రేడియో కేంద్రం వారికి ఏవో రాస్తుండేవాణ్ని.
ఆంధ్రజ్యోతి వీక్లీ ఎడిటర్ గా పురాణం సుబ్రహ్మణ్య శర్మ ఉండేవారు. పురాణం సీత పేరుతో ఇల్లాలి ముచ్చట్లు రాసేవారు. ఆ బాణీలో నేనూ- అమ్మ గోవిందరాజు రుక్మిణి పేరుతో శ్రీమతి- శ్రీవారు, శ్రీవారి చొక్కా జేబు వంటి స్కెచ్ లు రాసి పంపిస్తే ప్రచురిస్తుండేవారు. ఆంధ్రజ్యోతి డైలీ ఆదివారం అనుబంధంలో కూడా ఈ తరహా రచనలు అనేకం చేశాను. వివిధ పత్రికల సండే సప్లిమెంట్స్ కు కవర్ స్టోరీలు రాసేవాణ్ని. ఒకేవారం రెండు పత్రికల్లోనూ నా కవర్ స్టోరీలు ఉండేవి.
అక్షరం మీద పెంచుకున్న ప్రేమే నన్ను జర్నలిజం వైపు మళ్లించింది. ఈనాడులో సబ్ ఎడిటర్ గా చేశాను. బయట పత్రికలకు రాయకూడదన్న నిబంధన ఉన్నా రాయాలన్న కాంక్ష గాఢంగా ఉండటంతో అమ్మ పేరుతోనే రచనా వ్యాసంగాన్ని కొనసాగించాను. ఈనాడులో ఉన్నపుడే 1988లో ‘మీరూ జర్నలిస్ట్ కావచ్చు’ అనే పుస్తకం రాశాను. ఇది విశేష ఆదరణ పొంది రీప్రింట్ చేయాల్సి వచ్చింది. ఈ పుస్తకం చదివే జర్నలిజంలో ప్రవేశించామని చెప్పేవారు ఆ తర్వాత కొందరు మిత్రులు. రాంభట్ల కృష్ణమూర్తి, రామోజీరావు, ఎ.బి.కె.ప్రసాద్, చేకూరి రామారావు వంటి హేమాహేమీలను ఇంటర్వ్యూ చేసి రెండవ భాగంలో చేర్చాను. ఈ రూపేణా తెలుగులో మీడియా స్టడీస్ కు ఆనాడే శ్రీకారం చుట్టినట్లయింది. మద్రాసు అరసం వారి కథల పోటీలో మొదటి బహుమతి పొందాను. ఈనాడులో ఉండగానే రాసిన ‘సుఖజీవనం’ పుస్తకానికి కేంద్ర ప్రభుత్వ మానవ వనరుల మంత్రిత్వ శాఖ వారి జాతీయ అవార్డు లభించింది. ఈనాడు మేగజిన్లోనూ విపులలోనూ కొన్ని కథలు రాశాను.
ఈనాడు, ఉదయం తర్వాత రచన జర్నలిజం కళాశాల ప్రిన్సిపాల్గా బాధ్యతలు చేపట్టి పన్నెండేళ్లు కొనసాగాను. ఇది పూర్తిగా నా అభిరుచికి తగిన ఉద్యోగం. రెగ్యులర్ క్లాసులతోబాటు, మీడియాపై ప్రముఖులతో సదస్సులూ నిర్వహించేవాణ్ని. సదస్సు పత్రాలన్నింటినీ పుస్తకంగా వెలువరించేవాణ్ని. ‘తెలుగు పత్రికా రంగం నిన్న-నేడు-రేపు’, ‘జన మాధ్యమాలు – సామాజిక బాధ్యత’ వంటి పుస్తకాలను రచన తరపున వెలుగులోకి తెచ్చాను. జి.యస్.వరదాచారి ఆంధ్రభూమి దినపత్రికలో దిద్దుబాటు శీర్షికన వారం వారం రాసిన వ్యాసాలను అదే పేరుతో ప్రచురించాను.
ఉదయం పత్రికలో అప్పుడు – ఇప్పుడు కాలమ్ కింద జి.కృష్ణ రాసిన వ్యాసాల్లో కొన్నింటిని అదే పేరుతో పుస్తకంగా తెచ్చాను. పొత్తూరి వెంకటేశ్వరరావు గారి రేడియో ప్రసంగాలను నాటి పత్రికల మేటి విలువలు పేరుతో గ్రంథస్థం చేశాను. రచన విద్యార్ధుల కోసం పాఠ్యప్రణాళికకు అనుగుణంగా మొత్తం 18 పుస్తకాలను రూపొందించి అందుబాటులోకి తెచ్చాను.
రచనలో ఉన్నప్పుడే మీడియా హౌస్ పబ్లికేషన్స్ పేరుతో ప్రచురణ సంస్థను స్థాపించి జర్నలిస్టులకోసం, ప్రచారం పొందడం ఎలా? అనువదించడం ఎలా? హౌస్ జర్నల్స్ రూపకల్పన, టీవీ జర్నలిజం అనే పుస్తకాలు కూడా రాశాను. వీటిలోనూ ఆయా రంగాల ప్రముఖులను ఇంటర్వ్యూలు చేసి అనుబంధంగా చేర్చాను.
ప్రసిద్ధ ఎడిటర్ గోవిందు రామశాస్త్రి (గోరాశాస్త్రి)పై సాహిత్య అకాడెమి కోసం మోనోగ్రాఫ్ రాసే అవకాశం లభించింది. 2019లో గోరాశాస్త్రి శతజయంతి సందర్భంగా రెండవసారి ముద్రించారు. భారత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు దీన్ని ఆవిష్కరించారు. ఆత్మీయులు డాక్టర్ కాకాని చక్రపాణితో కలిసి ది ఘోస్ట్, గోరంత దీపం నవలలు రాశాను. జాగృతి వీక్లీ, ఆంధ్రప్రభ వీక్లీలో ఇవి ధారావాహికగా ప్రచురితమయ్యాయి. ఆ తర్వాత పుస్తకాలుగా తెచ్చాం. మీడియా విషయాలను విశ్లేషిస్తూ మనభూమి సహా వివిధ పత్రికల్లో రాస్తూ వస్తున్న వ్యాసాలను మీడియా సంగతులుగా వెలువరించాను.
EXCLUSIVE ARTICLES
‘సుభాషితం’ సంస్కృతశ్లోకాలకు భావవివరణల వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు బీరక రవి ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు డాక్టర్ ఎస్ రాము ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సంపాదకుడు సురేష్ పిళ్లె వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
‘తెలుగు సామెతలు’, ‘అక్కినేని నాగేశ్వరరావు జీవితమే వ్యక్తిత్వ వికాస గ్రంథం’ పుస్తకాలు నాకు సంతృప్తినిచ్చాయి. రెండేళ్లు పరిశ్రమించి 2020లో వెలువరించిన ‘రామోజీరావు ఉన్నది ఉన్నట్టు’ కూడా పాఠకాదరణ పొందింది. సామాజిక సమీక్షలు వచ్చాయి. ప్రజా సంబంధాల గురువు డాక్టర్ సి.వి.నరసింహారెడ్డి జీవిత కథను కూడా రాశాను. సమాచార శాఖ వారికోసం రైతు బజార్లు వంటి అంశాలపై కొన్ని బుక్ లెట్స్ రూపొందించాను. ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడెమీ కోసం విలేకరి వ్యక్తిత్వ వికాసం అనే చిరు పుస్తకాన్ని రాశాను.
కవిత, కథ, నవల, వ్యాసం, రేడియో ప్రసంగాలు, పాఠాలు, రేడియో జింగిల్స్, పిల్లల నాటికలు, పత్రికలకు వ్యాపార ప్రకటనలు, సన్మాన పత్రాలు సహా అన్ని ప్రక్రియల్లో రాశానన్న సంతృప్తి ఉంది. (రెండో భాగం ఉంది)
.. డాక్టర్ గోవిందరాజు చక్రధర్
సీనియర్ పాత్రికేయులు, జర్నలిజం గురువు

.

Discussion about this post