నలభయ్యేళ్ల కెరీర్.. ఒక జీవితంపై వేయగలిగిన బలమైన ముద్రనుంచి జారుకుని.. కొత్త రూపంలోకి పరివర్తనం చెందడం అంత సులువైన విషయం కాదు. కానీ.. కార్టూనిస్టు శ్రీధర్ అలాంటి సాహసం చేస్తున్నారు. విశ్లేషకుడు శ్రీధర్ గా ఆయన మారనున్నారు. కార్టూన్ల రూపంలో ఇన్నాళ్లు చేసింది కూడా అదే కావచ్చు. కానీ.. కేవలం చురుక్కు మనిపించే వ్యంగ్యరేఖ, గీత చురుక్కు మాత్రమే కాదు.. ఇప్పుడు మరింత విరాట్ రూపంలో ఆయన విశ్లేషణా శక్తి, సత్య వాక్కు ఇప్పుడు వ్యక్తం కానుంది.
కార్టూనిస్టు శ్రీధర్ గా ఈనాడు ముద్రతో ఉన్నంత కాలమూ.. ఆయన మొహం కూడా చాలా మందికి తెలియదు. నలభయ్యేళ్ల సుదీర్ఘ కార్టూనింగ్ ప్రస్థానం తరువాత.. ఆయన ఉద్యోగానికి రాజీనామా చేసినప్పుడు కూడా.. ఇంటర్నెట్ లో దొరికే ఎంతో పాత ఫోటోలతోనే ఆ వార్తను చాలా మంది అందించారు. అంతగా ఆయన తెరవెనుక వ్యక్తిగానే ఇన్నాళ్లూ ఉండిపోయారు. అయితే.. ఇప్పుడు ఆయన ప్రతివారం ప్రేక్షకుల ముందుకు రానున్నారు. సమకాలీన వార్తా విశ్లేషణలతో ప్రేక్షకులకు కనిపించనున్నారు.
ఈనాడు ద్వారా శ్రీధర్ కేవలం రాజకీయ కార్టూనిస్టుగా మాత్రమే అందరికీ తెలుసు. అడపాదడపా సంపాదకీయం పేజీలో వ్యంగ్య రచనలు చేసే రచయితగా కూడా తెలుసు. అయితే, ఆయన తనలో ఉన్న లోతైన రాజకీయ అవగాహనను, విశ్లేషణ సామర్థ్యాన్ని ప్రపంచానికి తెలియజెప్పడానికి మలిదశ ప్రస్థానాన్ని బాటగా తీర్చుకున్నట్లుగా కనిపిస్తోంది.
‘అంతరార్థం’ పేరుతో ఒక యూట్యూబ్ ఛానెల్ ఉంది. ఆర్థిక, సామాజిక రంగాల విశ్లేషకులు పిఎస్ఎం రావు.. ఈ చానెల్ నిర్వాహకులు. ఆ ఛానెల్ ద్వారానే శ్రీధర్.. వారం వారం తన రాజకీయ విశ్లేషణలను కూడా అందించనున్నారు.
ఉద్యోగానికి రాజీనామా చేసిన తర్వాత.. ఆయన ప్రస్థానం గురించి.. ఇంటర్నెట్ నిండుగా రకరకాల ఊహాగానాలు వచ్చాయి. అవన్నీ చూసి తాను నవ్వుకున్నానని చెప్పిన శ్రీధర్.. తానేం చేయబోతున్నానో తానే చెబుతానంటూ అంతరార్థం యూట్యూబ్ ఛానెల్ ద్వారా తొలి వీడియోను విడుదల చేశారు. ఇదే వీడియోలోనే అనేక సమకాలీన రాజకీయ అంశాలపై తన విలువైన అభిప్రాయాలను కూడా వెల్లడించారు. ప్రపంచస్థాయి అంశాలు అనేకం అందులో ఉన్నాయి. బ్రిక్స్ దేశాల చేసిన తీర్మానాల దగ్గరినుంచి, ఆఫ్గన్ పరిణామలు, రైతుల పోరాటం పట్ల మోడీ సర్కారు- హర్యానా సర్కారు వ్యవహరిస్తున్న తీరు, గుజరాత్ లో సీఎం మార్పు, రాహుల్ గాంధీ అనితరసాధ్యమైన ఫిట్ నెస్ వంటి విషయాలతో పాటు అనేక అంశాలను ఆయన తొలి వీడియోలో చర్చించారు. ఇదే తరహాలో ప్రతివారం ఆయన ఓ విశ్లేషణలతో కూడిన వీడియో విడుదల చేయబోతున్నారని తెలుస్తోంది.
ఇది కూడా చదవండి :
సురేష్ పిళ్లె : కార్టూనిస్ట్ శ్రీధర్.. తీరానికి ఆవల
లోతైన, నిష్పాక్షికమైన రాజకీయ విశ్లేషణలకు వీక్షకుల్లో ఎప్పుడూ గౌరవం ఉంటుంది. ప్రొఫెసర్ నాగేశ్వర్ వంటి వారు.. ఈ దిశగా అద్భుతాలు సృష్టిస్తున్నారు. అలాంటి వారు అనేకులు ఉన్నారు. ఇప్పుడు శ్రీధర్ కూడా జత కలిశారు. కార్టూనిస్టుగా నలభయ్యేళ్ల పాటు యావత్ ప్రపంచంలోని రాజకీయాలనే గమనిస్తూ వచ్చిన శ్రీధర్.. ‘ఇప్పుడు రాజకీయాలను వదలి మరొక పని ఎలా చేయగలను’ అనే తానే చెప్పుకుంటున్నారు. ‘జీనా యహాఁ మర్నా యహాఁ..’ అని కూడా పేర్కొన్నారు. ఆయన సునిశితమైన పరిశీలన, సాధికారమైన విశ్లేషణ ప్రజలకు రుజుమార్గంలో సరైన చైతన్యం కలిగించగలిగితే అంతకంటె మంచి ఏముంటుంది?
‘వారం వారం శ్రీధర్’ తొలి ఎపిసోడ్ చూడండి :
.
Discussion about this post