శ్రీధర్.. పొలిటికల్ కార్టూనిస్టుగా ‘ఈనాడు’లో నాలుగు దశాబ్దాల ఉద్యోగ ప్రస్థానం పూర్తి చేశారన్న కబురు విన్నప్పుడు- అది నాకు చాలా అపురూపంగా అనిపించింది. ఆయనను ఎరిగిన ప్రతి ఒక్కరికీ అది గొప్ప సందర్భమే. ‘నా ఎరికలో శ్రీధర్’ గురించి నాలుగు మాటలు మిత్రులతో పంచుకోవాలనీ అనిపించింది.
చాన్నాళ్లుగా కమ్మేసి ఉన్న జడం వీడి, కొంచెం చైతన్యం పులుముకుని, బహుముఖ ప్రజ్ఞకు విరాడ్రూపమైన శ్రీధర్ గారి గురించి ఏం చెప్పగలనో తేల్చుకునేలోగా.. ఆయన ‘ఈనాడు’ను విడిచిపెట్టారు కూడా. ఈ రెండు సందర్భాల్లోనూ చాలా మంది మిత్రులు శ్రీధర్ గారితో వారివారి అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. అలాంటిదే, నా ప్రయత్నం ఇది!
శ్రీధర్ గారు ఈనాడులో పాకెట్ కార్టూన్లు గీయడం మొదలుపెట్టిన సమయానికి నేను అయిదోతరగతి చదువుతున్నాను. అప్పట్లో మా ఇంటికి ఆంధ్రప్రభ దినపత్రిక వస్తుండేది. పత్రికలు, పుస్తకాలు చదవడం అలవాటే. కార్టూన్లు చూడ్డం కూడా. కానీ, తొలినాళ్లలో ఎరిగిన కార్టూన్లు, కార్టూనిస్టులు వేరు. హైస్కూలు చదివే రోజుల్లో ఇండియనింకూ, క్రోక్విల్ పేనా కొనుక్కుని వాటితో గీతలు గీసే ముచ్చట కలిగిఉన్న వాడికి ఖచ్చితంగా శ్రీధర్ ఒక ఆరాధ్యుడు కావడంలో విశేషం లేదు. అలాంటి పిలగాడికి ఆ గీతను తూకం వేసే దమ్ము, ఆ గీతకు కితాబు ఇచ్చే తాహతు, కనీసం ఆ గీతను శ్లాఘించడానికైనా తగిన స్థాయి ఉంటాయనుకోవడం భ్రమ. నాకు లేవు. ఆ జోలికి వెళ్లడం లేదు.
కార్టూనిస్టుకు ఆవల..
కొందరిని కలవడానికి కూడా మనకు కొన్ని అర్హతలుండాలి. లేకపోయితే అభాసుపాలవుతాం. ఇలాంటి అభిప్రాయం నాకు కలిగించిన పెద్దలు కొందరున్నారు.
నాతో కథాక్షరాలు దిద్దించిన గురువు మధురాంతకం రాజారాం గారిని ఎప్పుడు కలిసినా.. ’నాయనా ఏం రాస్తున్నావు?’ అనే వారు! వృత్తిగతమైన ఆత్మవంచన ఆయన అడిగే ‘రాత’ను సాంతం కబళించేస్తుండగా.. తొలినాళ్లలో రాసిన కథలకంటె అంతకు పూర్వం రాసినవే ఎక్కువ. కానీ, ఆయనను కలవడానికి వెళ్లదలచుకున్నప్పుడు.. ఏదో ఒకటి సగమో, పూర్తిగానో రాసి సిద్ధంగా ఉంచుకునేవాడిని. రాజారాం గారిని కలవడానికి ఉండవలసిన కనీసార్హత- రాయడం. రాస్తూ ఉండడం. అలా నా అర్హతలకు పుటం పెట్టిన మరో వ్యక్తి శ్రీధర్ గారు!
1993లో ఈజెఎస్ విద్యార్థిగా ఆయనను చూశాను. మాకు క్లాసులు తీసుకునే వారు. అప్పట్లో సెలవురోజుల్లో కోఠి బజార్లో ఫ్రెండ్స్తో తిరుగుతూ.. ఆయన ఒక షూ షాపులో కనిపిస్తే.. ‘అదిగో ఆయనే కార్టూనిస్ట్ శ్రీధర్.. మాకు క్లాసులు తీసుకుంటాడు’ అని వాళ్లతో గర్వంగా చెప్పుకున్నాను. అప్పట్లో నేరుగా పరిచయం లేదు. 2001లో హైదరాబాదు వచ్చాక, ఎడిట్ పేజీలో పొలిటికల్ సెటైర్లు రాయడం మొదలయ్యాకే మాట్లాడడం. సెటైర్లలో నా రాత బాగుందని ప్రోత్సహించారు. ఆయన వాత బాగుందని నేను మురిసిపోయాను. అలా కొంత చనువు పెరిగింది. చాలాసార్లు కలుస్తుండేవాడిని.
రాజారాం గారి గురించి చెప్పినట్టే.. శ్రీధర్ గారిని కలవడానికి ఓ కనీసార్హత ఉండాలని నాకు కొంతకాలం తర్వాత అర్థమైంది. ఎప్పుడు ఆయన సీటు వద్దకెళ్లినా, తొలిమాటల్లోనే.. ‘ఏం చదువుతున్నారు?’ అనే ప్రశ్న ఉండేది. ఇలాంటి ప్రశ్న ఒకటి ఉంటుందనే సంగతి కూడా నాకు తెలియదు. పుస్తకాలు చదువుతూ ఉంటే తప్ప.. రాయడానికి మనకు అర్హత ఉండదనేది తెలిసిన నియమమే గానీ.. పాటింపు తక్కువ. శ్రీధర్ గారిని కొన్ని సార్లు కలిసిన తర్వాత.. పుస్తకాలు చదవడం అనేది- ఒక నిత్యవ్యాపకంగా ఉండవలసిన విధి అనే సంగతి బోధపడింది. చదువుతూ ఉండకపోతే ఆయనను కలవలేం అని కూడా తేలిపోయింది. చదివే అలవాటూ పెరిగింది (!?). ఏదో తేలిగ్గా ‘ఫలానా పుస్తకం చదువుతున్నా’ అనేస్తే ఆయన దగ్గర పారదు. ఏ పుస్తకం గురించి మనం చెప్పినా అందులో ఏముందని అడిగేవారు. చాలా సందర్భాల్లో దాన్ని ఆయన అప్పటికే చదివేసిఉండేవారు. దాని గురించి చర్చించేవారు. ఆయన అప్పటికి చదవని పుస్తకం అయితే మరింత లోతుగా అడిగేవారు. చాలా సార్లు తన వద్ద ఉన్న పుస్తకాలు చదవడానికి ఇచ్చేవాళ్లు కూడా. అవి ఎందుకు మంచి పుస్తకాలో, ఎందుకు చదవాలో చెప్పి మరీ ఇచ్చేవాళ్లు!
ఓసారి- గుల్జార్ కథలు తెలుగులో ఉన్న పుస్తకం ఇచ్చారు. 1/8 క్రౌన్ సైజులో చాలా చిన్న పుస్తకం అది. అందులో ఆరే కథలున్నాయి. మొదటి కథ ‘రావి పార్’. దేశవిభజన పరిస్థితుల నాటి అద్భుతమైన కథ. ఆ తర్వాత నేను ‘రాతితయారీ’ కథను రాసిన శైలిమీద దాని ప్రభావం చాలా ఉంది.
‘రాతి తయారీ’ కథ రాశాక తొలుత శ్రీధర్ గారికి పంపాను. కథ రాయడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, గుర్తుంచుకోవాల్సిన బాధ్యత, పాటించాల్సిన విలువల గురించి నాకు ప్రత్యేకంగా చెప్పారు. ఆ మార్పు చేర్పులన్నీ చేశాను. ఆయన చెప్పిన సూచనల్ని మాత్రం.. కథారచనకు విధివిధానాలుగా ఎప్పటికీ గుర్తుంచుకున్నాను.
అందరిలా కాదు, ఇందుకే..
నాకు పరిచితులైన కొందరు ఆర్టిస్టులు ఉన్నారు. కొందరు నిజంగానే ఆర్టిస్టులు. కొందరు అలాంటి పేరు తగిలించబడిన వాళ్లు! చాలా బరువుగా ఆ పేరును మోస్తున్నవాళ్లు. వాళ్లు అప్పటికే ముద్రపడి భుజకీర్తులు తగిలించుకుని ఉన్నవాళ్లు. అయితే, మనం ఎదురుగా కూర్చుని ఉండగా.. పెన్సిలుతో ఒక గీత కూడా గీయరు. గీయడం అనేది వారికి ఒక రహస్యం. చాటుమాటు వ్యవహారం అని వారనుకుంటారేమో నాకు తెలియదు.
శ్రీధర్ గారు అలా కాదు. రాత్రి పది గంటలకు మొదలయ్యే షిఫ్టు డ్యూటీలో ఉండే నేను.. పగటివేళను దొర్లించడానికి హైదరాబాదులో మిత్రులూ లేక ఆఫీసులోనే గడుపుతుండేవాణ్ని. శ్రీధర్ గారు నాకు కొంచెం చనువు ఇచ్చిన తర్వాత, ఆయన ఎదుట అనేక సందర్భాల్లో గంటలు కూర్చుని ఆయన గీయడాన్ని చూస్తూ గడిపాను. ప్రింటింగ్ తర్వాత చాలా పొదుపైన గీతల్లో కనిపించే కార్టూన్ తయారు కావడానికి ఆయన ఎంత సుదీర్ఘమైన శ్రమ చేస్తారో, ఎంత కసరత్తు ఉంటుందో నేను చూశాను. తన గీసే పద్ధతిని రహస్యంగా ఉంచుకోవాలనుకునే బాపతు కాకపోవడం నాకు, అప్పటికి, చిత్రమైన సంగతి.
కబుర్లు బోలెడు దొర్లేవి. ప్రపంచ ప్రఖ్యాత కార్టూనిస్టులు కొందరు ఎలాంటి జీవన శైలిని గడుపుతున్నారో మనం అవాక్కయ్యే వివరాలు చెప్పేవారు. ఆయన ప్రపంచం కేవలం కార్టూన్లే కాదు. చిత్రకళ కూడా. ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారుల పేర్లు అనేకం చెబుతూ.. వారి గీతలో, కుంచెలో, ఎంచుకునే అంశంలో, తీర్చే శైలిలో, రంగుల మేళవింపులో.. ఇలా ఆయా చిత్రాలకు సంబంధించి అనేకానేక కోణాల్లో అనేక మంది చిత్రకారుల్ని పోల్చి, విశ్లేషించేవారు.
గంటలపాటు ఎదురుగా కూర్చున్నంత మాత్రాన ఆయన కార్టూను గీసే సమయాన్ని మనం హరించివేయడం, ఆయన కాలం వృథా చేయడం అనేది ఎప్పటికీ జరగదు. ఆయన బుర్రలో రెండు పార్టిషన్లు ఉంటాయి. రెండు ఆపరేటింగ్ సిస్టమ్ లు కూడా ఉంటాయి. ఒక బుర్ర మనతో మాట్లాడుతూ, ఇతర బాహ్య, ఐహిక వ్యవహారాలను చక్కబెడుతూ ఉంటుంది. రెండోబుర్ర తదేక దీక్షతో కార్టూను గీసుకుంటూ ఉంటుంది. ఈ రెండూ ఏకాంతరంగా కాకుండా, సమాంతరంగా పని చేయడమే విశేషం.
తీరని కోరిక..
సండే మేగజైన్ రీవ్యాంపింగ్ పనిలో భాగంగా సమాంతర డెస్కును లీడ్ చేస్తున్నప్పుడు.. మేగజైన్లో ఉండే కార్టూన్ల పేజీకి ‘శ్రీధర్ ట్యూన్స్/ శ్రీధర్ టూన్స్’ అని పేరు మార్చాలని చాలా ప్రయత్నించాను. కోరిక మనకు ఉంటుంది గానీ.. కార్యరూపం దాల్చాలంటే కసరత్తు చాలా ఉంటుంది. ఆ ఇచ్ఛ తీరలేదు. ఈనాడు కార్టూన్లకు – శ్రీధర్ ఒక పర్యాయపదం అయినప్పుడు.. ఆయన పేరు మీదనే ఆ పేజీ ఫీచర్ ఉండడం సబబు అని నాకు అనిపించింది. మా టీమ్ తయారు చేసిన డమ్మీ ఎడిషన్ల గురించి సమీక్షలు జరిగినప్పుడు.. అలా నామకరణం చేయడం ఎందుకు మంచిదో కూడా వివరించాను. కానీ ప్రతిపాదన పట్టాలెక్కలేదు.
లోపల గిలి మిగిలిపోకుండా..
ఎంతగా ‘ఆవలి’ సంగతులను మాట్లాడుకున్నా.. పొలిటికల్ కార్టూనిస్టుగా శ్రీధర్ గారి గురించి ఒకటి రెండు ముక్కలైనా గుర్తు చేసుకోకపోతే.. ఏ సందర్భానికి ముడిపెట్టి ఇదంతా రాసుకున్నానో దానికి విలువ ఉండదు.
నేను సెటైర్లు రాయడం మొదలయ్యాకే ఆయనతో పరిచయం. దాదాపుగా సెటైర్లు అన్నింటికీ బొమ్మలు వేశారు. సెటైర్లో మనమేదో బాగా రాశామని అనుకుంటే.. ఆ పొగరు మొత్తం ఆయన కార్టూన్ చూడగానే దిగిపోయేది. ‘కార్టూన్ మరింత అదిరిపోయేలా ఉంది కదా- ఇక సెటైర్ ఎవరు చదువుతారు?’ అనే భావన రాసిన నాకే కలిగేది. కార్టూన్ ను మించిన వ్యంగ్యంతో రాయడం ఎటూ మనకు చేతకాదు. కనీసం కార్టూన్ గీయడానికి ఆయన చాలా చాలా ఆలోచించేలా, చిక్కటి అల్లికతో రాయాలన్న కోరిక ఉండేది. అలా ప్రయత్నించిన ప్రతిసారీ.. అంతకంటే గొప్ప కార్టూన్ దానిని తలదన్నుతూ వచ్చేది. ఓడిపోవడంలో ఉండే అసలైన మజా స్వానుభవంలోకి వచ్చేది.
శ్రీధర్ గారి ‘ఈనాడు’ ప్రస్థానానికి నలభయ్యేళ్లు నిండాయంటే.. నాకు మరో సంగతి కూడా గుర్తుకొస్తుంది. నా ప్రస్థానం ముగిసి పదిహేనేళ్లు దాటుతోంది. నాన్న మెడబట్టుకుని గెంటేస్తే.. రోడ్డున పడ్డ బిడ్డలాగా ఉన్నానప్పుడు నేను. ఆయన పాతికేళ్లు పూర్తిచేసిన సందర్భంలో ఈజేఎస్ భవనంలో ఒక చిన్న సత్కారం జరిగింది. నేను హాజరు కాలేకపోయాను. కానీ.. ఛైర్మన్ గారితో, ఈనాడుతో ఉన్న ఆయన అనుబంధాన్ని ఒక కార్టూన్ గా గీసి, సభావేదిక వద్ద పెద్ద పోస్టరు వేయించి ఆయనతో అనుబంధానికి నా మొక్కు చెల్లించుకున్నాను. (ఆ బొమ్మ కూడా ఇక్కడ ఇస్తున్నాను.)
ఈనాడుతో ఆయన అనుబంధం చాలా బలమైంది. కార్టూనిస్టుల ప్రపంచం కనీ వినీ ఎరుగనంత కళ్లు చెదిరే ఆఫర్లు వచ్చినా శ్రీధర్ గారు తోసిపుచ్చారని విన్నాను. ‘అంకెలు మీరే వేసుకోం’డన్న సంతకాలను ఆయన తృణప్రాయంగా భావించారు. అంతటి బలమైన అనుబంధం ఇంత ముక్తసరిగా ముగుస్తుందని ఎవ్వరూ ఎన్నడూ ఊహించలేరు.
దాచుకున్న మాట- తిరిగి చెబుతున్నా..
శ్రీధర్ గారి కార్టూనింగ్ లో నలభయ్యేళ్ల ఈనాడు ప్రస్థానం మాత్రమే ముగిసింది. ఇప్పటి దాకా ‘ఈనాడు కార్టూన్లు’గా మాత్రమే మనకి తెలుసు. ఇక ‘శ్రీధర్’ గానే, ఆయన ప్రజ్ఞ బహుముఖంగా మన అనుభవంలోకి వస్తుందనే ఆశ! విశ్వరూపం దాలుస్తుందనే విశ్వాసం! సరిహద్దులు చెరిపేసుకుంటూ భూమండలం అంతా అది భాసిస్తుంది. మేఘాలను చీల్చుకుంటూ నభోమండలపు అంచులను స్పృశిస్తుంది.
అలాంటి ఆశతో ఒక సంగతి చెప్పాలి.
రెండు దశాబ్దాల కిందట ఆయన నుంచి నేను నేర్చుకున్న ఒక మాట.. ఇప్పుడు ఈ సందర్భం కోసమే ఉన్నట్టుగా, ప్రస్తావనార్హం అవుతుందని అప్పట్లో అనుకోలేదు. 2002 నాటి సంగతి ఇది.
సోమాజీగూడ ఈనాడు ఆఫీసులో శ్రీధర్ గారి టేబుల్పై అద్దం కింద, ఆయన చేతి రాతలోనే హిందీ వాక్యం ఉన్న కాగితం ముక్క చూశాన్నేను. ఆ తర్వాత దాన్ని చాలాసార్లు గుర్తు చేసుకున్నాను. ఆ మాట ఇప్పుడు ఓసారి మళ్లీ గుర్తు చేస్తాను. శ్రీధర్ గారు అప్పటినుంచీ ఆ వాక్యాన్ని ఇప్పటికీ తన టేబుల్ మీద దాచిఉంచుకున్నారో లేదో తెలియదు. కానీ, ఈ సందర్భం కోసమే ఉన్నదా అనిపించే వాక్యం అది.
‘‘వఖ్త్ ఫుర్సత్ హై కహా కామ్ అభీ బాకీ హై
నూరే తౌహీద్ కా ఇత్మామ్ అభీ బాకీ హై’’
విశ్రాంతి తీసుకోడానికి చాలినంత ఖాళీ సమయం లేదు. చేయవలసిన పని చాలా మిగిలే ఉంది. భగవంతుడి దీపం నీ స్పర్శను కోరుతోంది. నీ స్పర్శతో అది సూర్యుడు చిన్నబోయేలా చేస్తుంది!
శ్రీధర్ గారూ.. నలభయ్యేళ్ల ఈనాడు ప్రస్థానం ఇక్కడ ఆగింది. కానీ ఇది విశ్రాంతి కోసం తీసుకున్న విరామం కాదు. చేయవలసిన పని చాలా మిగిలుంది. ప్రపంచం మీ సృష్టి నుంచి చాలా చాలా కోరుకుంటోంది. మీమీద వేయిఆశలతో ప్రపంచం ఎదురుచూస్తోంది. ఇప్పుడు మీమీద చాలా పెద్ద బాధ్యత ఉంది.
శ్రీధర్ గారు ఇన్నాళ్లూ ద్వీపవాసిగానే ఉండిపోయారు. తీరానికి ఆవల ఉన్న ప్రపంచం ఇప్పుడు ఆయనను అక్కున చేర్చుకుంటుంది.
ప్రేమతో మీ
సురేష్ పిళ్లె
నోట్ : ఈనాడు, రామోజీరావు, శ్రీధర్.. ఈ బంధం శాశ్వతం అనే అంతా అనుకున్నారు. అంతిమ శ్వాస మాత్రమే వేరు చేయగలిగిన బంధం ఇది- అనేది అందరి అభిప్రాయం. రామోజీరావు గారే ఎడిటర్గా లేకుండా ‘ఈనాడు’ మిగిలిన తర్వాత, శ్రీధర్ గారు కార్టూనిస్ట్గా లేకుండాపోవడం మరీ నిబిడాశ్చర్యం కలిగించే సంగతి కాదు కదా!!
.