మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు కలిపి పట్టభద్రుల నియోజకవర్గానికి జరగబోతున్న ఎన్నికల టీఆర్ఎస్లో గుబులు పుట్టిస్తున్నట్టుగా కనిపిస్తోంది. అధికార పార్టీలో భయం పుట్టడానికి అనేక కారణాలు ఉన్నాయి. మొదటి కారణం- ఇది సిటింగ్ బీజేపీ సీటు కావడం. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అంతగా బలంగా లేని కాలంలోనే.. ఈ సీటును ఆ పార్టీ తరఫున రామచందర్ రావు గెలుచుకున్నారు. ఇప్పుడు కూడా ఆ పార్టీ తరఫున ఆయనే తలపడుతున్నారు. ఇది పార్టీపరంగా బీజేపీకి ఈ మూడు జిల్లాల్లో ఉన్న బలమేమో అనుకునే భయం కాగా.. రెండోది ఆయన న్యాయవాది కావడం. రామచందర్ రావు న్యాయవాది కావడం వల్ల.. ఆ వర్గం ఓట్లు ఆయన పరమైతే.. మళ్లీ ఓటమి తప్పదనే భయం వారిలో ఉంది. వీటన్నింటినీ మించిన మూడో కారణం.. పెద్దపల్లిలో అడ్వకేట్ వామన్ రావు దంపతుల హత్య!
వామన్ రావు దంపతులను నడిరోడ్డుమీద పట్టపగలు అందరూ చూస్తుండగానే అత్యంత కిరాతకంగా హత్య చేసిన వైనం యావత్ సమాజాన్ని నిర్ఘాంత పరచింది. అయితే ఈ విషయంలో పోలీసు దర్యాప్తు ఇప్పటిదాకా నత్తనడకన నడుస్తూ.. అనేక అనుమానాలకు తావిస్తోంది. పైగా ఈ హత్యవెనుక తెరాస నాయకులు ఉన్నారనే ఆరోపణలు పాలకపక్షానికి ఇబ్బందికరం. అలాంటి విమర్శలు వచ్చిన తర్వాత.. సదరు నాయకుడిని పార్టీనుంచి సస్పెండ్ చేశారు గానీ.. ఆ ఒక్క చర్యతో న్యాయవాదుల సమాజంలో నమ్మకాన్ని పొందలేకపోయారు. పైగా.. పోలీసు దర్యాప్తు దోషులను, వారి వెనుక ఉన్న సూత్రధారులను ఇప్పటిదాకా తేల్చకపోవడం వలన.. టీఆర్ఎస్ ప్రభుత్వంపై న్యాయవాదులు భగ్గుమంటున్నారు.
ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో తెలంగాణ భవన్లో న్యాయవాదులతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు సమావేశం పెట్టుకున్నారు. న్యాయవాదుల్లో తమ పార్టీ పట్ల నమ్మకం కలిగించేందుకు ప్రయత్నించారు. అయితే.. ఆయన వారికి ఎలాంటి స్పష్టమైన హామీని కూడా ఇవ్వలేకపోయారు. వామన్ రావు దంపతుల కిరాతక హత్య జరిగిన నాటినుంచి.. న్యాయవాదులంతా.. తమ రక్షణకోసం ప్రత్యేక చట్టం కావాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్ దిశగా కేటీఆర్ ఏమీ చెప్పలేకపోవడం గమనార్హం. ఇతర రాష్ట్రాల్లో ఇందుకోసం ఎలాంటి చట్టాలున్నాయో పరిశీలిద్దాం.. ఈ చట్టం తెచ్చేందుకు ప్రయత్నిస్తాం.. వంటి కంటి తుడుపు మాటలు తప్ప.. కేటీఆర్ చెప్పిందేమీ లేదు. తెలంగాణ సాధనకోసం న్యాయవాదులు చాలా పనిచేశారు.. వారి పోరాటాల ఫలితం ఉంది.. వంటి ఆయన చెప్పిన పడికట్టు మాటలు ఓట్లు రాలుస్తాయనుకుంటే భ్రమ.
కనీసం వామన్ రావు దంపతుల హత్య కేసును త్వరగా తేల్చి.. అడ్వకేట్ల జోలికి వెళ్లాలంటే.. ఎవరైనా భయపడేలా సూత్రధారులతో సహా వారికి శిక్ష పడేలా చేస్తే తప్ప.. అడ్వకేట్ల సమాజం.. టీఆర్ఎస్ను నమ్ముతుందని అనుకోవడం భ్రమ. మరి ఆ దిశగా ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో చూడాలి.
.

Discussion about this post