తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీవేదాంత దేశికర్ ఆలయంలో గురువారం సాత్తుమొర జరిగింది. నవంబరు 2న ప్రారంభమైన శ్రీవేదాంత దేశికర్ సాలకట్ల ఉత్సవాలు ముగిశాయి. శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఘంటా స్వరూపులు శ్రీవేదాంతదేశికర్. వీరి జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ ఉత్సవం నిర్వహిస్తారు.
ఈ సందర్భంగా ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీగోవిందరాజస్వామివారిని శ్రీవేదాంత దేశికర్ ఆలయానికి వేంచేపు చేసి స్నపన తిరుమంజనం నిర్వహించారు. సాయంత్రం సాత్తుమొర, ఆస్థానం నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయం నుంచి తీసుకొచ్చిన అప్పా పడిని శ్రీ వేదాంత దేశికర్ వారికి సమర్పించారు.
శ్రీవేంకటేశ్వరస్వామివారు జన్మించిన భాద్రపద మాసం శ్రవణ నక్షత్రంలోనే శ్రీవేదాంత దేశికర్ సుమారు 750 సంవత్సరాల క్రితం కాంచీపురంలోని తూప్పుల్ అగ్రహారంలో పుట్టారు. ఈయన స్వామివారిని కీర్తిస్తూ దయా శతకం అనే స్తోత్రం రచించారు. శ్రీవారి సుప్రభాతం రచించిన శ్రీ ప్రతివాద భయంకర అణ్ణన్కు శ్రీ వేదాంత దేశికర్ గురువర్యులు.
ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేకశ్రేణి డెప్యూటీ ఈవో శ్రీ రాజేంద్రుడు, ఏఈవో శ్రీ రవికుమార్రెడ్డి, సూపరింటెండెంట్ శ్రీ వెంకటాద్రి, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ ధనుంజయ్ పాల్గొన్నారు.
.
Discussion about this post