తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని నవంబరు 29వ తేదీన వర్చువల్ విధానంలో జరుగనున్న లక్షకుంకుమార్చన సేవ కోసం ఆన్లైన్లో టికెట్లు అందుబాటులో ఉన్నాయి. కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని ఆలయంలో ఏకాంతంగా నిర్వహించనున్న విషయం తెలిసిందే.
ఈ సేవా టికెట్ ధరను రూ.1,116/-గా టిటిడి నిర్ణయించింది. ఈ టికెట్ బుక్ చేసుకున్న గృహస్తులు 90 రోజుల్లోపు రూ.100/- ప్రత్యేక ప్రవేశదర్శన క్యూలైన్లో ఉచితంగా అమ్మవారిని దర్శించుకోవచ్చు.
దర్శన సమయంలో గృహస్తులకు ఉత్తరీయం, రవిక, అక్షింతలు అందిస్తారు. www.tirupatibalaji.ap.gov.in వెబ్సైట్ ద్వారా వర్చువల్ సేవా టికెట్లు బుక్ చేసుకోవచ్చు.
నవంబరు 23న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో నవంబరు 23వ తేదీ మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఏకాంతంగా జరగనుంది. ప్రతి ఏడాదీ బ్రహ్మోత్సవాల ముందు వచ్చే మంగళవారం ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ.
ఇందులో భాగంగా ఉదయం 6 నుండి 9 గంటల వరకు ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. అనంతరం భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు.
.

Discussion about this post