ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కాకపుట్టిస్తున్నాయి. ఆయన వ్యాఖ్యల దరిమిలా జనసేన పార్టీ వారు ఏపీలో పలుచోట్ల పోలీసు కేసులు పెట్టారు. పవన్ కల్యాణ్ ఈ వ్యాఖ్యల్ని చాలా సీరియస్ గా తీసుకున్నట్టు వార్తలు వచ్చాయి. ఈలోగా ప్రొఫెసర్ నాగేశ్వర్ తన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకున్నారు కూడా. నిజానికి అక్కడితో వివాదం సమసిపోయి ఉంటే మరో రకంగా ఉండేది.
కానీ.. తదనంతర పరిణామాల్లో ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి తెలంగాణలో తమ పార్టీ కార్యకర్తల సమావేశం భారీ స్థాయిలో నిర్వహించాలని అనుకోవడం, అందుకు రంగం సిద్ధం చేసుకున్న తరువాత పోలీసులు అనుమతి నిరాకరించడం, జనసేన పార్టీ తరఫున హైకోర్టును ఆశ్రయించడం ఇత్యాది పరిణామాలు మరింతగా కాక పుట్టిస్తున్నాయి. ప్రొ. నాగేశ్వర్ ఉదంతంతో ముడిపెట్టి.. పోలీసులు జనసేన సమావేశానికి అనుమతి నిరాకరించడం ఇందులో హైలైట్! ఇదంతా ఒక ఎత్తు అయితే.. ప్రొ నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యలు, చెప్పిన సంగతులే గనుక వివాదానికి కారణం అనుకుంటే.. ఆ వ్యాఖ్యలకు అందరికంటె ముందుగా సిగ్గుపడవలసిన, అందరికంటె ముందుగా వాటిని ఖండించాల్సిన భారతీయ జనతా పార్టీ మాత్రం మౌనంగా అన్ని పరిణామాలను గమనిస్తోంది. వారి వ్యూహాత్మక మౌనం వెనుక మర్మమే ఎవ్వరికీ బోధపడ్డం లేదు.
2024 ఎన్నికలకు పూర్వం.. జనసేన అధినేత పవన్ కల్యాణ్, ఆపార్టీ కీలక నాయకుడు నాదెండ్ల మనోహర్ కలసి ఢిల్లీ వెళ్లి అమిత్ షాతో భేటీ అయ్యారు. తెలుగుదేశం పార్టీని కూడా ఎన్డీయే జట్టులోకి తీసుకుని, ఏపీలో కలిసిపోటీచేయాల్సిన అవసరాన్ని వారు అమిత్ షాతో చర్చించారు. ఈ సందర్భంగా అమిత్ షా మాత్రం.. చంద్రబాబు తమకు ఇన్స్టంట్ ఫ్రెండ్ అని, జగన్ పర్మినెంట్ ఫ్రెండ్ అని వ్యాఖ్యానించినట్టుగా నాగేశ్వర్ టీవీ షోలో వెల్లడించారు. నిజానికి ఈ వ్యాఖ్యల వల్ల నష్టం ఎవరికి? ఈ వ్యాఖ్యల వల్ల బాధపడాల్సింది ఎవరు? ఏ రకంగా చూసినా సరే.. తెలుగుదేశం, బిజెపి మాత్రమే మనకు సమాధానంగా కనిపిస్తాయి.
ఎన్డీయే కూటమిలో ప్రస్తుతం రెండో అతిపెద్ద పార్టీగా తెలుగుదేశం ఉండవచ్చు గాక.. కానీ.. తెలుగుదేశం అధినేతను భారతీయ జనతా పార్టీ తొలినుంచి కూడా నమ్మడం లేదు, ఆయనను తాత్కాలిక స్నేహితుడిగా మాత్రమే పరిగణిస్తోంది.. అనే మాట తెలుగుదేశం వారికి అవమానకరం. ఈ వ్యాఖ్యలను ఆ పార్టీ ఖండించి ఉండాలి. అలా ఎక్కడా జరగలేదు. అదే సమయంలో బిజెపి ఈ వ్యాఖ్యల విషయంలో మరింతగా సిగ్గుపడాలి. ఎందుకంటే.. అమిత్ షా ఈ మాటలు అనే ఉంటే గనుక.. అందుకు ఆ పార్టీ సిగ్గుపడాలి. బిజెపి అవకాశవాద వైఖరికి ఇది నిదర్శనం అవుతుంది. జగన్ తమకు శాశ్వత మిత్రుడు గనుక.. ఆయన మీద ఎన్నీ సీబీఐ కేసులు, ఈడీ కేసులు ఉన్నాసరే వాటి విషయం తేల్చకుండా, బిజెపి సర్కారు కాపాడుకుంటూ వస్తోందని, వివేకా హత్య విషయంలో కూడా ఎటూ తేలకుండా జగన్ కోరిక మేరకు కమలసర్కారు నడుచుకుంటున్నదని ప్రజలు అనుమానించే ప్రమాదం ఉంటుంది. అందువల్ల బిజెపి ముందుగా ఈ వ్యాఖ్యలను ఖండించి ఉండాలి. అయితే అలా జరగలేదు.
అందరికంటె ముందు.. అమిత్ షా చెప్పినట్టుగా ప్రచారంలోకి వచ్చిన మాటల గురించి జనసేన నాయకులు స్పందించారు. వారు నాగేశ్వర్ పై కేసులు పెట్టారు. బహుశా అమిత్ షాతో జరిగిన సమావేశంలోని సంగతులు బయటకు లీక్ అయినందుకు తమ మీద షా ఆగ్రహిస్తారని వారు భయపడ్డారేమో తెలియదు. అంతే తప్ప.. ఎవరైతే ఈ మాటలను ఖండించి తమ పరువు కాపాడుకోవాల్సి ఉన్నదో వారు మాత్రం స్పందించలేదు. ఈ మౌనం వెనుక మర్మం ఎవ్వరికీ బోధపడ్డం లేదు.
జగన్మోహన్ రెడ్డి పట్ల బిజెపిలో ఉన్న ప్రేమ గురించి ప్రజల్లో అనుమానాలు పుట్టినా సరే.. వాటిని నివృత్తి చేయాలని కమలదళం భావించడం లేదా? జగన్ తమకు శాశ్వత మిత్రుడు అని వారు పరోక్షంగా ఒప్పుకుంటున్నారా? అనే అంశాల్లో స్పష్టత రావడం లేదు. మొత్తానికి జనసేన పోలీసు కేసుల పెట్టడం ద్వారా భారతీయ జనతా పార్టీ విశ్వసనీయతను ప్రశ్నార్థకం చేసిందనే అభిప్రాయాలు ప్రజల్లో వ్యక్తం అవుతున్నాయి.
..మైనంపాటి
.
Discussion about this post