పవన్ కల్యాణ్ అంటే భావోద్వేగాల కలబోత. ఎమోషనల్ వ్యక్తి. సమాజం పట్ల, ప్రజల పట్ల ఒక కన్సర్న్ ఉన్న వ్యక్తి. ఆ కన్సర్న్ కోసం తపించిపోయే వ్యక్తి.
సమాజంలో సంస్కరణ కోసమే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన వ్యక్తి. రాజకీయాల్లో, వ్యవస్థలో, నోట్లకు అమ్ముడుపోయే ఓటర్లు ఉండే వ్యవస్థలో మార్పును కోరుకున్న వ్యక్తి. అందుకే ఆయన గత ఎన్నికల్లో నెగ్గలేకపోయారు. కానీ ఆ ప్రయత్నం వృథా పోదు. అమ్ముడుపోయే ఓట్లు- గెలిపించే ప్రతినిధులు- వారి పనితీరు- ఇవన్నీ గమనించే ప్రజల్లో మార్పు వస్తుంది.
ఇదంతా ఒక పార్శ్వం అయితే.. పవన్న కల్యాణ్ లోని మానవత్వం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. చిత్తూరు జిల్లాలో పెద్దపంజాణి మండలం పరిధిలోని గ్రామంలో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం జరిగింది. అమానవీయమైన దుర్గటన ఇది. అయితే ఇలాంటి ఘటన పట్ల రాజకీయ నాయకుల్లో ఒక్క పవన్ కల్యాణ్ మాత్రమే స్పందించారు. తనలోని ఆవేదనను బయటపెడుతూ ఆయన ఒక ప్రెస్ నోట్ విడుదల చేశారు.
ఈ ప్రెస్ నోట్ లో ప్రభుత్వం మీద నిందలు లేవు, రాజకీయ లబ్ధి ఆశించిన తీరు లేదు. దిశ చట్టం ఏమైపోయిందని ప్రభుత్వాన్ని నిలదీస్తున్న తీరు లేదు. చాన్సు దొరికింది వైఎస్సార్ కాంగ్రెస్ ను ఇరుకున పెట్టేద్దాం.. అనే యావ లేదు. అత్యాచారానికి పాల్పడిన నిందితుడు ఏ పార్టీనో వెతికి.. ఆ పార్టీ మీద బురద చల్లుదాం అనే ప్రయత్నం లేదు. కానీ.. పవన్ కల్యాణ్ విడుదల చేసిన ప్రెస్ నోట్ లో పూర్తిగా ఆయన ఆవేదన మాత్రమే ఉంది. ఆయనలోని మానవత్వం మాత్రమే మనకు కనిపిస్తుంది.
మిగిలిన వారిలో ఆ మానవత్వం చచ్చిపోయిందా?
పవన్ కల్యాణ్ రాజకీయాల్లో సక్సెస్ సాధించకపోయి ఉండవచ్చు గాక.. ఆయన మంచి నటుడిగా ఎంతటి ఖ్యాతి సంపాదించుకున్నారో.. అంతకంటె గొప్ప మానవతావాదిగా ఆయనను ఎరిగిన వారు చెబుతుంటారు. పవన్ కల్యాణ్ ఇలాంటి ఘోరమైన దుర్ఘటన పట్ల ఈ రీతిగా స్పందించడం సహజం. కానీ మిగిలిన నాయకులకు ఏమైంది. నాయకుల్లో మానవత్వం మొత్తం చచ్చిపోయిందా?
రాష్ట్రంలో ఎలాంటి దుర్ఘటన జరిగినా.. దాని మీద స్పందిస్తే తమ పాలన మీద మచ్చ పడుతుందని, తమ పాలన వైఫల్యం కింద తయారవుతుందనే భయం అధికార పార్టీలో ఉంటుంది. వారిలో మానవత్వాన్ని (అలాంటిది ఉంటే) ఆ భయం ఒక చిక్కని పొరలా కప్పేస్తుంది. మరి ప్రతిపక్షం ఏమైంది. అదే జిల్లాకు చెందిన చంద్రబాబునాయుడు తన నియోజకవర్గానికి అత్యంత సమీపంలో జరిగిన ఈ దుర్ఘటనపై ఎందుకు స్పందించలేకపోయారు. అమరావతి లేదా రాజకీయ ఉద్యమాలు తప్ప.. ఇలాంటి అమానవీయమైన విషయాలు ఆయనకు పట్టవా?
రాష్ట్రంలో దిశచట్టం చాలా ఆర్భాటంగా తయారుచేశారు. దిశ చట్టం తయారీతోనే.. తమకు ప్రజల్లో మహిళా సంరక్షణకు అవతరించిన వ్యక్తిగా.. అనన్యమైన కీర్తి ప్రతిష్టలు వచ్చేయాలని ప్రభుత్వం భావించింది. ఆ మేరకు ప్రచారం కూడా చేసుకుంది. కానీ.. ఆ దిశచట్టం ఇప్పటిదాకా ఆచరణలోకి రాలేదు. దీన్ని చట్టంగా అనుమతించడం గురించి కేంద్రం లేవనెత్తిన సందేహాలను నివృత్తి చేసి.. సత్వరమే ఈ చట్టాన్ని అమల్లోకి తేవడంపై ప్రభుత్వానికి సీరియస్ నెస్ లేదు. చట్టాలు ఏ రకంగా అమలవుతూ ఉంటాయో మనందరికీ తెలుసు. దిశ చట్టం నిజానికి చాలా పటిష్టంగా చేశారు. కానీ అమలు అయితే కదా ఫలితం.
నేరం చేసే వాళ్లలో భయం పుట్టేలా పోలీసు యంత్రాంగం ఎందుకు వ్యవహరించలేకపోతోంది. రాజకీయంగా చిన్న ప్రభుత్వ వ్యతిరేక గళం వినిపించినా.. పోలీసులు చాలా బాగా అణిచేస్తుంటారు. కానీ.. నేరాలు చేసే వారిలో భయం పుట్టేలా మాత్రం జరుగుతున్న ఘటనలు లేవు. ఆరేళ్ల చిన్నారిపై ఇరవై ఆరేళ్ల పశువు.. అత్యాచారానికి పాల్పడ్డాడు. రాజకీయ నాయకులు చట్టాల సంగతి వదిలేద్దాం. ప్రజా, మహిళా సంఘాలు ఏం చేస్తున్నాయి? ఏం పోరాడుతున్నాయి. ఎక్కడో ఒక చోట ఒక అత్యాచారం జరిగితే.. ఉద్యమాలు రేగితే.. అంటే పాపులర్ అయితే.. దాన్ని అందిపుచ్చుకోడానికి అందరూ తయారవుతారు. మారుమూల గ్రామంలో నిరుపేద కుటుంబంలో ఇలాంటి హేయమైన దుర్ఘటన జరిగితే ఎవరికీ పట్టదు. కన్నీళ్లు కార్చడానికి కూడా వీరికి స్పాన్సరర్లు కావాలా అనే అనుమానం కూడా కలుగుతోంది.
నాయకులు కావచ్చు, సమాజంలోని వ్యక్తులు కావచ్చు.. తమలోని స్పందనలను చంపేసుకోకుండా బతకడం నేర్చుకోవాలి. అందుకే, పవన్ కల్యాణ్ లోని మానవత్వం, స్పందన మరే నాయకుడిలోనూ ఎందుకు కనిపించడం లేదని బాధ కలుగుతుంది.
ఇవీ చదవండి : బాలీవుడ్ లో భావోద్వేగాల కింగ్ ఖాన్ ఇదేం తీర్పు : పశువుకు రాఖీ కడితే మనిషైపోతాడా? మనసును ఊయలలూగించే సమ్మోహన గాయకురాలు జిక్కి.. జయంతి నేడు.. పూజలు చేయిస్తాను.. రాత్రికి రమ్మన్నాడు..
పవన్ కల్యాణ్ విడుదల చేసిన పత్రికా ప్రకటన యథాతథంగా :
ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారామా?
* సమాజం సిగ్గుతో తలవంచాలి
అభం శుభం తెలియని ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం.. ఏమిటీ పశువాంఛ? ఎక్కడికి పోతోంది మన సమాజం? చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలోని రాయలపేటలో నిన్న సాయంత్రం జరిగిన ఈ సంఘటన గురించి వినడానికే జుగుప్స కలుగుతోంది. ఆ పసిదాని పరిస్థితి ఊహించుకుంటే గుండెలు భారంగా మారిపోతున్నాయి. మృగాడి పైశాచికత్వానికి బలైపోయిన ఆ అభాగ్యురాలు ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతోంది. ఆసుపత్రికి వచ్చే సమయానికి అధిక రక్తస్రావం వల్ల ఆ పాప పరిస్థితి దయనీయంగా ఉందని పలమనేరు ప్రభుత్వాసుపత్రి డాక్టర్లు చెబుతున్న వీడియో చూసినప్పుడు కలిగిన ఆవేదన మాటలకు అందనిది. ఆడుకోవడానికి పొరుగింటికి వెళితే 26 ఏళ్ల మానవ మృగం ఆ పసిదానిని కబళించి వేసింది.
ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ లో ఆడపిల్లలపై వరుసగా అకృత్యాలు జరుగుతున్నాయి. మొన్నటికి మొన్న గాజువాకలో 17 ఏళ్ల బాలికను ప్రేమ పేరుతో గొంతు కుత్తుకను ఒక రాక్షసుడు కోసేసి ప్రాణాలు తీశాడు. విజయవాడలో ఇంజనీరింగ్ విద్యార్థిని తేజస్విని ప్రాణాలను ఆమె ఇంట్లోనే ఒక మృగాడు హరించివేశాడు. విజయవాడలోనే ప్రేమించడం లేదని ఒక నర్సును మరో దుర్మార్గుడు పెట్రోల్ పోసి నిప్పంటించాడు. రాష్ట్రంలో ఈ ఏడాదిలో మొదటి ఆరు నెలల్లో 584 అత్యాచారం కేసులు నమోదు అయ్యాయి. నిర్భయ, దిశ వంటి చట్టాలు ఉన్నా ఆడపడుచులపై ఎందుకు దాడులు జరుగుతున్నాయి? ఎప్పుడో పడే శిక్షలకు దుష్టులు భయపడడం లేదా? అందువల్లే నేరం చేయాలంటేనే భయపడే శిక్షలు రావాలి. అవి బహిరంగంగా అమలు కావాలి. దీనిపై మేధావులు, సామాజికవేత్తలు, మహిళా సంఘాలు గళం విప్పాలి. లేని పక్షంలో అమాయకులైన ఆడపిల్లలు బలైపోతూనే వుంటారు. రాయలపేట సంఘటనలో దోషిని కఠినంగా శిక్షించాలి. ఆ బాలిక తల్లిదండ్రులకు తగిన పరిహారం అందించాలి. ఆ పసిబిడ్డ కోలుకునే వరకు ప్రభుత్వం అండగా ఉండాలి.

.
Discussion about this post