సమాజం ఆధునికం అవుతున్న కొద్దీ.. రకరకాల కొత్త ఆలోచనలే క్రమంగా ఆచారాలుగా స్థిరపడుతున్న రోజులివి. ఎన్నడో శతాబ్దాలకు ముందుగా పుట్టిన ఆచారాలను.. ఇంకా నిష్ఠగా, సనాతనధర్మం ఆనవాళ్లుగా పాటించేవాళ్లుంటే మంచిదే. అలాంటి ఆచరణపరాయణుల్ని అభ్యంతర పెట్టాల్సిన అవసరం లేదు. అలాగని.. సమాజంలో మార్పులకు నిదర్శనంగా వస్తున్న కొత్త పద్ధతులను, చట్టపరంగా వాటికి ఉన్న రక్షణను కూడా తిరస్కరిస్తే ఎలాగ?
హిందూ వివాహాల విషయంలో గుజరాత్ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఇప్పుడు ఇలాంటి అనుమానాలను పుట్టిస్తోంది. హిందువు అయిన ఎవరైనా సరే.. పెళ్లి అంటే.. మూడుముళ్లు వేసి తీరాల్సిందేనని లేకపోతే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నట్టుగా గుజరాత్ హైకోర్టు తీర్పు విచిత్రంగా కనిపిస్తోంది. వివరాల్లోకి వెళితే..
గుజరాత్ లో ఓ దంపతుల పెళ్లి వ్యవహారం కోర్టుకెక్కింది. బ్రిటన్ నివాసి ఒకరు.. పెళ్లి అయినట్లుగా ఓ మహిళ నకిలీ సర్టిఫికెట్ పుట్టించినదంటూ, ఆ పెళ్లిని రద్దు చేయాలని కోర్టుకెళ్లారు. ఆ మహిళ కూడా.. సర్టిఫికెట్ చూపినది గానీ, హిందూ పద్ధతిలో పెళ్లి జరగలేదని కోర్టులో ఒప్పుకుంది. అయితే.. రిజిస్ట్రేషన్ సర్టిఫికెటు ఉంది గనుక.. ఆ పెళ్లిని రద్దు చేయడానికి ఫ్యామిలీకోర్టు సమ్మతించలేదు. సదరు బ్రిటన్ వాసి హైకోర్టును ఆశ్రయించారు. ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు తప్పుబట్టింది. ఆ పెళ్లిని రద్దు చేస్తూ తీర్పు చెప్పింది. ఈ తీర్పు వెలువరించడానికి కారణం.. ఆ మేరేజి రిజిస్ట్రేషన్ సర్టిఫికెటు.. అతను చెబుతున్నట్టుగా నకిలీది అని తేలడమో మరొకటో కాదు. హైకోర్టు వారి అభిప్రాయం ప్రకారం.. మూడుముళ్లు వేయకుండా, ఏడడుగులు నడవకుండా.. అసలు పెళ్లి జరిగినట్టుగా గుర్తించలేం.. అని వారు తేల్చడం విశేషం. అంతమాత్రమే కాదు.. ఈ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యలు ఇంకా విచిత్రంగా ఉన్నాయి.
‘హిందూ సాంప్రదాయంలో వివాహం చాలా పవిత్రమైనది. జీవితాంతం కొనసాగే బంధం. ఓ పురుషుడు ఓ మహిళ పరస్పర గౌరవం, సమానత్వ భావనతో ఒక్కటయ్యే ఆధ్యాత్మిక వేడుక. మూడు ముళ్లు వేసి ఏడడుగులు కలిసి నడవటం వంటి క్రతువులన్నీ పాటిస్తేనే హిందూ వివాహ చట్టం ప్రకారం ఆ జంటకు పెళ్లయినట్టు. కొన్నిచోట్ల పద్ధతుల్లో కొంత మార్పుండవచ్చు. కానీ క్రతువులేవీ జరగకుండా కేవలం రిజిస్ట్రేషన్ చేసుకున్నామంటే హిందు సంప్రదాయంలో చెల్లదు’ అని వారు తేల్చేశారు.
సమాజం మారుతున్న కొద్దీ.. ఆచారాలు అనేవి సమూలంగా మారిపోతూ వస్తున్నాయి. మార్పులు మంచివా చెడ్డవా అనేది వేరే చర్చ. కానీ.. మార్పులను మనం గౌరవించి, ఆమోదించి తీరాల్సిందే. వివాహిత అంటే కాలివేల్లకు మెట్టెలు, నుదుట సిందూరం, చేతినిండా గాజులు, మెడలో మంగళసూత్రం ఇవన్నీ ఒక నిర్వచనంలాగా ఉండేవి. కానీ.. కాలక్రమంలో ఇవేవీ కూడా పాటించకుండా కూడా.. వివాహితలు చాలా హాయిగా, ఎలాంటి పేచీలు తగాదాలు లేకుండా తమ తమ దాంపత్యజీవితాలను కొనసాగిస్తున్నారు.
యువతరం ఆధునికం అవుతున్న కొద్దీ.. ఒకవైపు అత్యంత ఆర్భాటంగా కోట్లరూపాయలు వెచ్చించి పెళ్లి చేసుకోవడం మీద ఎంతగా మోజు పడుతున్నారో.. మరొకవైపు కేవలం రిజిస్ట్రేషన్ మాత్రమే చేసుకుని.. రెండు కుటుంబాలు కలిసి ఓ హోటల్లో భోజనం చేసేసి.. అంతటి ఆ లాంఛనం ముగించి, సంసారం ప్రారంభిస్తున్నవారు కూడా ఉంటున్నారు. వీరందరి పెళ్లిళ్లు చెల్లవని కోర్టువారంటే.. ఇక వివాహ రిజిస్ట్రేషన్ కు విలువేముంటుంది?
సాధారణంగా సాంప్రదాయప్రకారం పెళ్లి చేసుకునే వారు రిజిస్ట్రేషన్ చేసుకోకపోయినా పర్లేదని, కొన్ని ప్రత్యేక అవసరాల్లో మాత్రం తప్పదని చట్టం చెబుతుంది. కానీ రిజిస్ట్రేషన్ చేసుకునే వారికి సాంప్రదాయ పెళ్లి తప్పనిసరి అనడం ఎరగం. కానీ గుజరాత్ హైకోర్టు మాత్రం తమ తాజా తీర్పు ద్వారా.. మొత్తం సామాజిక పోకడల్లో వస్తున్న మార్పులను ప్రశ్నిస్తున్నట్టుగా ఉంది.
మన దేశంలో ఎవరైనా సరే.. ‘తమకు ఏ మతమూ, ఏ కులమూ వర్తించదు’ అని క్లెయిం చేసుకోవడానికి కూడా చట్టం వెసులుబాటు కల్పిస్తుంది. వారు ఏదో ఒక మతంలోనే పుట్టి ఉండవచ్చు. తాజా ఉదాహరణ ప్రకారం.. హిందువుగానే పుట్టిఉండవచ్చు. కానీ.. నేను ఏ మతాన్నీ క్లెయిం చేసుకోను అని చెప్పుకోడానికి వారికి హక్కుంది. అలాంటి వారు రిజిస్ట్రేషన్ పెళ్లి చేసుకుంటే దానిని అంగీకరించకుండా వదిలేస్తారా? లేదా, ఒకవేళ హిందువే అని చెప్పుకున్నప్పటికీ కూడా.. సాంప్రదాయాలు, ఆచారాలు.. వాటి పేరిట జరిగే క్రతువుల మీద నమ్మకం లేక వివాహం రిజిస్ట్రేషన్ తో సరిపెట్టుకుంటే.. అసలు పెళ్లే కానట్టుగా ధ్రువీకరిస్తారా? అనేది తాజా చర్చ.
రాజ్యాంగంలోని 25వ అధికరణ ప్రకారం.. పౌరులు ఏ మతాన్నయినా ఆచరించవచ్చు, ఏ మతాన్నీ పాటించకుండా కూడా ఉండవచ్చు. రాజ్యాంగం కల్పించే ఈ చట్టపరమైన రక్షణ.. మతానికి మాత్రమేనా? ఆచారాలకు, సాంప్రదాయాలకు వర్తించదా? ఒక వ్యక్తి.. తనకు ఆచారాలలో హేతుబద్ధత కనిపించక పాటించకపోతే వారి పెళ్లి చెల్లనట్టేనా? ఆధార్ కార్డు, పాస్ పోర్టు కూడా దేశంలో పౌరసత్వాన్ని ధ్రువీకరించవు- అనే వివాదం రేగుతున్న సమయంలోనే.. పెళ్లి రిజిస్ట్రేషన్ కూడా చెల్లదు అని గుజరాత్ హైకోర్టు తీర్మానిస్తున్నదా? అనేది గమనించాలి.
మారుతున్న కాలంతో పాటు స్మృతులే యుగానికి ఒక తీరుగా మారుతూ వచ్చాయి. రాజ్యాంగాన్ని రూపొందించుకున్న తర్వాత ఇప్పటికి 106 సార్లు మనం దానిని సవరించుకున్నాం. అంటే.. అప్పట్లో మనం అద్భుతం అనుకున్న రాజ్యాంగంలోనే.. కాలాన్ని బట్టి మార్పులు అవసరం అని మనం భావించాం. అలాంటిది.. మూడుముళ్లు వేస్తే మాత్రమే, ఏడడుగులు నడిస్తే మాత్రమే దానిని పెళ్లికింద గుర్తిస్తాం.. కేవలం రిజిస్ట్రేషన్ సర్టిఫికెటు చెల్లుబాటు కాదు అని పేర్కొనడం ఎలా సబబు అనిపించుకుంటుంది?
..కె.ఎ. మునిసురేష్ పిళ్లె
ఎడిటర్, ఆదర్శిని

.