దక్షిణ కాశీగా ప్రసిద్ధి పొంది.. భక్తకోటిని పునీతులను చేస్తున్న దివ్య క్షేత్రం శ్రీకాళహస్తి. స్వర్ణముఖీ నదీ తీరాన వెలసిన స్వామి స్వయంభువుగా పూజలందుకుంటున్న పుణ్యస్థలం. పరమశివుడు వాయులింగేశ్వర రూపంలో వెలుగొందుతున్న ఏకైక ఆలయం ఇది.
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో స్వయంభువు ఫణి రూప లింగాకారంలో దర్శన మిస్తారు. సృష్టి కర్త మొదలు ఆటవికుడు, సాలీడు, సర్పం, ఏనుగు దాకా ఈ లింగరూప భవుని సేవించి కోర్కెలు ఫలింప చేసుకున్నాయి.
కృతయుగంలో సాలె పురుగు కొండమీద శివలింగానికి చుట్టూ తన దారాలతో అర్చన చేసి పందిళ్లు కట్టింది. పొద్దుటే వాటిపై మంచు బిందువులు పడి… అవి ముత్యాల పందిళ్ల వలె కనిపించేవి. ఒకరోజు సాలీడు భక్తిని పరీక్షించాలని అనుకుంటాడు శివుడు. పక్కనే ఉన్న దీపంతో ఆ సాలీడు నిర్మించిన పందిళ్లు తగలబడి పోయేలా చేస్తాడు. అది చూసి తట్టుకోలేని సాలీడు దీపాన్ని మింగి చనిపోతుంది. అపుడు శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమంటాడు. శివైక్యం కోరుకుంటుందా సాలీడు. పరమేశ్వరుడు అంగీకరిస్తాడు.
అలాగే పాము. అది పాతాళ లోకం నుంచి మణి మాణిక్యాలు తెచ్చి లింగార్చన చేసేది. అది త్రేతాయుగాంతం. ద్వాపరయుగం ప్రవేశించింది. ఆ శివలింగాన్ని పూజించడానికి ఒక ఏనుగు వచ్చింది. అది రోజూ స్వర్ణముఖి నదిలో స్నానం చేసి… మారేడు దళాలు, పూలు తెచ్చేది. శివలింగంపై ఉన్న మణులు తోసివేసి తాను తెచ్చిన పూజా ద్రవ్యాలతో అర్చించేది. ఉదయం వచ్చిన సర్పం ఏనుగు పూజించిన ద్రవ్యాలు తొలగించి మణులతో అర్చన చేసేది. ఇలా కొన్ని రోజులు గడిచాయి.
ఒక రోజు పాము అక్కడే దాగి ఉంది. ఏనుగు వచ్చింది. తొండంతో నీళ్లు తెచ్చి శివలింగంపై పోసి పూలతో పూజించింది. ఇంతలో అక్కడే ఉన్న పాము కోపంతో ఏనుగు తొండంలోకి జొరబడి కుంభస్థలంలోకి చేరింది. ఏనుగు తల తిరిగింది. తన కుంభస్థలాన్ని కొండకు ఢీ కొట్టింది. కుంభస్థలం పగిలి పోయింది. పాము విగతజీవి అయింది. ఏనుగూ మరణించింది. శివుని కటాక్షంతో ఆ రెండు జీవాలూ లింగంలో ఐక్యమయ్యాయి. రుద్రగణంలో చేరి పోయాయి. ఇలా ‘శ్రీ-కాళ-హస్తి’ పేర్లతో శ్రీకాళహస్తిగా స్థిర పడింది. ఆ మూడు జీవాల పేరుతో శివుడు ఇక్కడ శ్రీకాళహస్తీశ్వరునిగా పూజలు అందుకుంటున్నాడు.
శ్రీకాళహస్తీశ్వరస్వామి తన భక్తుల భక్తికి మెచ్చి తనలో కలుపుకొన్న భక్తుల్లో కన్నప్ప (తిన్నడు) అనే భక్తుడు ప్రముఖుడు. శివుని మీద భక్తితో తన రెండు కళ్లనూ త్యాగం చేసిన భక్తుడు కన్నప్ప. అందుకే అతనికి స్వామి సన్నిధిలో శాశ్వతంగా కొలువు లభించింది. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ప్రతి యేటా జరిగే మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రథమ పూజ భక్తకన్నప్పకే జరుగుతుంది. నిత్య పూజల్లోనూ ముందు నైవేద్యాదులు జరగడం ఆ భక్తుని గొప్పతనం తెలియచేస్తుంది.
శ్రీకాళహస్తి క్షేత్రంలో మొదటి రెండు గాలిగోపురాలు దాటగానే పాతాళ వినాయక స్వామి స్థానం ఉంది. అటుపై కొన్ని అడుగుల దూరంలోనే పుష్టి వినాయకుడు ఉంటాడు. జ్ఞానాంబిక ఆజ్ఞచే అతడక్కడ ఉన్నాడు. ప్రధాన ఆలయంలోకి వెళ్లాక కూడా ముందుగా మనం వినాయకుని చూసే ముందుకు సాగుతాం. అయితే పాతాళ వినాయకుని మాత్రం భక్తులు తిరిగి వచ్చేటపుడు ప్రత్యేకంగా సందర్శిస్తారు. సుమారు 35 అడుగుల లోతులో ఈ స్వామి స్థిరుడై ఉన్నాడు. పాతాళ వినాయక స్వామికి కట్టేన మెట్లు, మండపం అవచి తిప్పయశెట్టి అనే రత్న వ్యాపారి అని… ఇతడు శ్రీనాథకవికి మిత్రుడని చెబుతుంటారు.
శ్రీకాళహస్తీశ్వర క్షేత్రంలో సురుచిర సుందరుడై.. శాంతి సముద్రంలా భాసిస్తున్న దక్షిణామూర్తి దివ్యమూర్తి. భక్తులను మొట్టమొదట ముగ్దులను చేస్తారు. ఎందుకంటే దక్షిణామూర్తి సింహద్వారంలో అడుగు పెట్టగానే ముందు దర్శనమిస్తాడు. పుత్రులను పోగొట్టుకుని వికలమైన మనస్సుతో వచ్చి.. మహేశ్వరుని మనశ్శాంతి కోసం.. బ్రహ్మ విద్యకోసం ప్రార్థిస్తే.. స్వామి గురు రూపంతో విద్యోపదేశం కోసం వచ్చి.. మర్రి చెట్టు కింద ప్రశాంతంగా ఇలా వెలిశాడు. ఇలా స్వామి వెలసిన క్షేత్రాలు అరుదని చెబుతారు. అనేక విధాల మనశ్శాంతి కరువై యాత్రలకూ వచ్చే భక్తులకు ఈ స్వామి దర్శనం ఒక వరం.
శ్రీకాళహస్తి క్షేత్రం తిరుపతికి 38కిలోమీటర్ల దూరంలో ఉంది. శ్రీకాళహస్తీశ్వర ఆలయం రాహు-కేతు సర్పదోష నివారణ పూజలకు ఖ్యాతి గాంచింది. ఇక్కడ రాహు-కేతువులు ఉండటం వలన గ్రహణ సమయాల్లో సైతం గుడి తెరిచే ఉంటుంది. ఈ క్షేత్రంలో ముక్కంటి నవగ్రహ కవచాన్ని నిత్యం ధరించి ఉంటాడు. అందుకే ఆయనకు గ్రహణ దోషాలు కలగవు. గ్రహణ సమయంలో ఇక్కడ సర్వాభిషేకాలు చేస్తారు. శ్రీకాళహస్తీశ్వరుని శిరస్సు భాగాన సర్పాకారం… మధ్యలో ఏనుగు దంతాలు… అడుగు భాగంలో సాలీడు చిహ్నాలు కనిపిస్తుంటాయి.
..వలిపి శ్రీరాములు
.

Discussion about this post