ప్రతి సంవత్సరం ఏదో ఒక నదికి పుష్కరాలు రావడం… నమ్మకం ఉన్నవాళ్లు సదరు నది ప్రాధాన్యతను బట్టి పుష్కర స్నానం చేయడం అనేది చాలా కాలంగా పరిపాటిగా వస్తోంది. అయితే ఈ ఏడాది తుంగభద్రానది పుష్కరాలు రానున్నాయి. నవంబరు 20 నుండి తుంగభద్రానది పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపధ్యంలో భక్తులు పుష్కర స్నానాలు చేయడానికి తగిన ఏర్పాట్లను చేయడంలో ప్రభుత్వ యంత్రాంగం బిజీగా ఉంటోంది. ప్రత్యేక ఘాట్ లను నిర్మించడం వంటి ఏర్పాట్లలో బిజీగా వుంటోంది. మరోవైపు దేవాదాయ శాఖ వారు మాత్రం అసలు ఈ ఏడాది పుష్కరాలు నిర్వహించకుండా ఉంటే పోతుంది కదా… ! అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చదవండి : మిస్ ఇండియా సినిమా రివ్యూ ఏసీబీకంటె సోషల్ మీడియా బలమైంది! భక్తియుత సంగీతానికి ప్రతీక.. నాగరత్నమ్మ పవన్ గొప్ప మానవతామూర్తి ఎందుకంటే?
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే… ఈ నేపధ్యంలో నలుగురు గుమిగూడి మాట్లాడాలంటే… భయం వేస్తోంది. ఎవరికి కరోనా వుందో… మనల్ని ఎలా కాటు వేస్తుందో… అన్న భయంతో అందరూ మనసులో వణికిపోతున్నారు. తప్పదు కాబట్టి బయటికి వస్తూ… పనులను చేసుకుంటూ పోతున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఎలాగోలా కాలం నెట్టుకొస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పడు తుంగభద్ర నదికి పుష్కరాలు రానున్నాయి.
పుష్కర స్నానం చేయడం వల్ల మనకు పుణ్యలోకాలు వస్తాయని మన నమ్మకం. అంతేకాదు.. పుష్కరాల సమయంలో మన పితృదేవతలకు పిండ ప్రదానాలు చేస్తే వారికి పైలోకంలో కూడా మంచి సద్గతులు లభిస్తాయని మనం నమ్ముతాము.
అందుకే పుష్కరాల సమయంలో పిండప్రదానాలు చేయడానికి బోలెడంతమంది బ్రాహ్మణులు పుష్కర ఘాట్ల వద్ద మనకు దర్శనమిస్తుంటారు. అయితే తాజాగా ప్రస్తుత కరోనా నేపధ్యంలో పుష్కరాలను ఎంతవరకు జాగ్రత్తగా నిర్వహిస్తారు అనేది ప్రశ్నార్ధకంగా కనిపిస్తోంది.
పుష్కరాలకు సాధారణంగానే ఎక్కువమంది జనం రావడం మనకు తెలిసిందే… ఇప్పుడు కూడా కరోనా వల్ల జనం తాకిడి కాస్త తక్కువే అయినా జనం రాకుండా ఉండడం మాత్రం జరగదు. అయితే జనం గుమిగూడితే… అందునా ఇప్పుడు కోవిడ్ రెండవ దశ వ్యాప్తి ఉంటుందని ఒకవైపు శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్న నేపధ్యంలో ఇప్పుడు పుష్కరాలు నిర్వహించడం అవసరమా అని పలువురు సందేహాన్ని, భయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
పుష్కరాల సమయంలో దేవాదాయ శాఖ వారు అవసరమైన ఏర్పాట్లను చేస్తూనే… పుష్కర స్నానాలకు వచ్చే భక్తులను ఎలా నియంత్రించాలా అనే విషయంగా తీవ్ర ఆలోచన చేస్తున్నారు. మరోవైపు మంత్రాలయ మఠం వారు ఇప్పటికే పుష్కర స్నానం చేసుకోవాల్సిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని ఆహ్వానించారు. ఆయన ఎక్కడ స్నానం చేస్తారు అనే విషయం ఇంకా తెలియడం లేదు. మరోవైపు భక్తుల రద్దీని నియంత్రించడానికి స్లాట్ పద్ధతిలో భక్తులు స్నానం చేసుకునే అవకాశం కల్పించడానికి ఏర్పాట్లు చేయాలని దేవాదాయ శాఖ సన్నాహాలు చేస్తోంది. భక్తులు ఆన్ లైన్లో ఒక సమయాన్ని ఎంచుకుని ఆ సమయానికి స్నానం చేయడానికి వచ్చేలా చేస్తే అప్పుడు భక్తుల రద్దీని కాస్త తగ్గించడానికి వీలవుతుందని దేవాదాయ శాఖ అధికారులు భావిస్తున్నారు.
అయితే అందరికీ ఆన్ లైన్లో నమోదు చేసుకోవడానికి వీలు కాదనే విషయం ఇక్కడ అధికారులు గమనించాల్సి ఉంటుంది. అలాంటి వారి పరిస్థితి ఏమిటి అనేది కూడా అధికారులు ఆలోచించాల్సి వుంది. ఇటీవల కర్నూలు జిల్లా దేవరగట్టులో సుమారు 1500 మంది పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేసినాకూడా సుమారు 30 వేలమంది భక్తులను కర్రల సమరం సమయంలో నియంత్రించలేకపోయిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా జిల్లా వాసులు గుర్తు చేస్తున్నారు. అయినా అధికార యంత్రాంగం పుష్కరాల నిర్వహణకు ఏర్పాట్లను మాత్రం ముమ్మరంగా సాగిస్తోంది.ఇప్పుడు ఆలోచించుకోవాల్సింది ప్రజలు… ఈ ఒక్క ఏడాది పుష్కర స్నానం చేయకపోయినంతమాత్రాన పుష్కరుడికి ఎలాంటి కోపం రాదు… ప్రాణాలు ముఖ్యం… సమాజం ముఖ్యం. కొవిడ్ విచ్చలవిడిగా వ్యాపించడానికి మనం స్వయంగా కారకులు కాకుండా ఉండడం ముఖ్యం. పుణ్యం గురించి తర్వాత ఆలోచించుకోవాలి… ప్రాణం పోయిన తర్వాత పుణ్యం వస్తుందో… రాదో… మనకు తెలియదు కదా… అందుకే పుష్కరాలైనా సరే… నియమిత దూరాన్ని పాటిద్దాం… పుష్కరాలకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండి… అందరం ఆరోగ్యంగా ఉందాం…
పెద్ద పెద్ద ఆలయాల పూజలే వర్చువల్ గా చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు.
వర్చువల్ గానే పుష్కరుడిని, తుంగభద్ర నదిని టీవీల్లో దర్శించుకుని తరిస్తే చాలు.
కరోనాను కట్టడి చేయడానికి మనవంతు ప్రయత్నం చేద్దాం…!
.

Discussion about this post