భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్ కుమార్ గారు అలంపూర్ జోగులాంబ శక్తిపీఠం సాక్షిగా, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి రోజు (ఏప్రిల్ 14, 2022) ఆరంభించిన రెండో విడత ‘ప్రజా సంగ్రామ యాత్ర’ పాలక పార్టీలో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. 31 రోజుల పాటు 385 కిలోమీటర్ల మేర సాగే ఈ యాత్రతో అధికార పార్టీ నేతల్లో గుబులు మొదలయ్యింది.
‘గీ పాదయాత్రలు ఓల్డ్ ఫ్యాషన్’ అని కొట్టిపారేసిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుకు ఈ యాత్రకు లభిస్తున్న విశేష ప్రజాస్పందన నోరుపెగలకుండా చేస్తే, వారి కుమారుడు, తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు ను నిస్పృహకు గురిచేసి నోటొకొచ్చినట్లు వాగేలా చేస్తోంది. కేటీఆర్ లేఖాస్త్రాలు, పిచ్చి ప్రేలాపనలు, అధికార పార్టీ నాయకుల కువిమర్శలు, తెరాస శ్రేణుల దాడుల నడుమ రైతులు, నిరుద్యోగులు, దళితులు, పీడిత-తాడిత సబ్బండ వర్గాలకు బాసటగా నిలుస్తూ యాత్ర జోరుగా సాగుతోంది.
ద్విగుణీకృత సమరోత్సాహంతో బీజేపీ నాయకులు, కార్యకర్తలు దూసుకుపోతున్న తీరు, రోజురోజుకూ పెరుగుతున్న జనాదరణ ఎనలేని ఉత్తేజాన్ని ఇస్తోంది. ఇది చూస్తే–అసమర్థ, అవినీతి, కుటుంబ గడీ పాలనకు చరమగీతం పాడి, బీజేపీ నేతృత్వంలో ప్రజాస్వామ్య తెలంగాణ సాధించుకునే రోజులు దగ్గరపడ్డాయని అనిపిస్తుంది. ఈ సందర్భంగా గ్రామాల్లో ‘జనం గోస- బీజేపీ భరోసా’ పేరిట నిర్వహించిన కార్యక్రమంలో ప్రజలు తమ కష్టాలను నేతలతో పంచుకున్నారు.
నిజానికి సంగ్రామ యాత్ర రెండు అద్భుతమైన విజయాలతో మొదలయ్యింది. ఒకటి, వరి ధాన్యం కొనుగోలు విషయంలో లేనిపోని హడావుడి చేసి రాజకీయ ప్రయోజనం కోసం తంటాలు పడుతున్న కేసీఆర్ మెడలు వంచి చివరి గింజ వరకూ కొంటానని చెప్పేలా చేయడంలో బీజేపీ విజయం సాధించింది. రెండోది, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి విగ్రహానికి ఎన్నడూ పూలదండ వేయని కేసీఆర్ సంజయ్ గారు డిమాండ్ చేసిన కొద్ది గంటల వ్యవధిలోనే ప్రగతి భవన్ లో నివాళులు అర్పించడం. ఈ క్రమంలో చెప్పుకోవడానికి ముచ్చటగా మూడో అంశం కూడా ఉంది. హుజురాబాద్ ఉప ఎన్నిక సమయంలో ఎన్నికల కమిషన్ పై దుమ్మెత్తి పోయడానికి అక్టోబర్ 24, 2021 న హడావుడిగా పార్టీ ప్లీనరీ నిర్వహించిన కేసీఆర్ ఏప్రిల్ 27, 2022 న పార్టీ 21 వ వ్యవస్థాపక దినోత్సవాన్ని నిర్వహించేందుకు సమాయత్తమయ్యారు. ఇంతవరకూ నాయకులను, కార్యకర్తలను కూరలో కరివేపాకులా వాడుకున్న పార్టీ వారికి మర్యాదలు చేయడానికి కారణం- అసంతృప్తి బుజ్జగింపో, వలసల భయమో మనం అర్థం చేసుకోవచ్చు.
ప్రజా సంగ్రామ యాత్ర
మొదటివారం దృశ్యమాలిక (ఈ వీడియోలో చూడండి)
యాత్ర ఇట్లా మొదలయ్యిందో లేదో కేటీఆర్ బండి సంజయ్ గారి మీదకు ఒక లేఖాస్త్రం సంధించి తనలో అభద్రతను బయటపెట్టుకున్నారు. పాలమూరులో యాత్ర మొదలవుతుంది కాబట్టి ‘పాలమూరుకు బీజేపీ ద్రోహం చేసింది’ అన్న కలర్ వచ్చేలా అయన అవాకులు చవాకులు పేలారు. వారం రోజుల యాత్ర తర్వాత రుణమాఫీ, కౌలు రైతుల వెతల మీద సంజయ్ జీ ముఖ్యమంత్రికి ఒక బహిరంగ లేఖ రాశారు. విజ్ఞత, విషయం పరిజ్ఞానం, ప్రజల సమస్యలపై చిత్తశుద్ధి, మంచీ మర్యాద వంటి విషయాల్లో తెరాస, బీజేపీ సంప్రదాయాలు అర్థంచేసుకోవాలంటే కేటీఆర్ లేఖను సంజయ్ గారి లేఖతో పోల్చుకుంటే తెలిసిపోతుంది.
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర ఇన్ ఛార్జ్ తరుణ్ చుగ్ జీ అన్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని మూగ చెవిటి ప్రభుత్వానికి కనువిప్పుకలిగేలా మహా సంగ్రామ యాత్ర మొదలయ్యింది. అవినీతి, వారసత్వ ప్రభుత్వాన్ని కొనసాగిస్తున్న కేసీఆర్ లంకను బీజేపీ కార్యకర్తలు దహనం చేయడం ఖాయమని అయన చెప్పారు.
తొలిరోజు (ఏప్రిల్ 14, 2022)
అలంపూర్ నుండి ఇమామ్ పూర్ వరకు మేమందరం నాలుగు కిలో మీటర్ల మేర యాత్రలో పాల్గొన్నప్పుడే అర్థమయ్యింది.. ప్రజల్లో తెరాస ప్రభుత్వంపై వ్యతిరేకత ఎంత గూడుకట్టుకుని ఉందో. సమరశంఖం మోగించిన మొదటిరోజు బహిరంగ సభలో ప్రసంగిస్తూ-ధాన్యం కొనబోనని భీష్మించుకు కూర్చున్న ముఖ్యమంత్రి మెడలు వంచి ఆయనతోనే ధాన్యం కొనిపిస్తున్నామని సంజయ్ గారు చెప్పారు. ‘వరివేస్తే ఉరే’ అని రైతులను దగా చేసిన అయన పాపం పండిందన్నారు. కేసిఆర్ గడిలో బందీ అయిన తెలంగాణ విముక్తే ఈ యాత్ర లక్ష్యమని స్పష్టం చేసారు.
బీజేపీ ఓ బీ సీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె. లక్ష్మణ్ గారు మాట్లాడుతూ-రాజ్యాంగాన్ని మార్చాలంటూ అంబేద్కర్ ను కేసీఆర్ అవమానిస్తున్నారని చెప్పారు. కేసీఆర్ ది ‘జూటా మాటల సర్కార్’ అనీ, తాను దత్తత తీసుకున్న పాలమూరును ఘోరంగా వంచించిన ఘనుడు కేసీఆర్ అని పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డి.కె అరుణ గారు అన్నారు. ఎర్రటి ఎండలో, కార్యకర్తలు జేజెమ్మ గా పిలుచుకునే అరుణ గారి ఉత్సాహం యాత్రలో కార్యకర్తలలో జోష్ నింపుతోంది. కేసీఆర్ డబ్బు సంచులకు, మద్యం సీసాలకు, కుట్రలకు, నియంతృత్వ పాలనకు చరమగీతమే ఈ పాదయాత్ర అని ఎంఎల్ఏ ఈటెల రాజేందర్ అన్నారు.
కేసీఆర్ నయ వంచక పాలనలో వివిధ వర్గాల ప్రజలు పడుతున్న ఇబ్బందులను మాజీ ఎం పీలు విజయశాంతి, జితేందర్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి గార్లు వివరించారు. అవినీతి సీఎం ను ఇంటిపంపాలని, కమిషన్ల కోసమే ప్రాజెక్టులు తప్ప రైతులకు మేలు చేయాలన్న చిత్తశుద్ధి లేదని వెంకట స్వామి గారు అన్నారు. రాష్ట్ర అప్పులు 60 వేల కోట్ల నుంచి ఐదు లక్షల కోట్లకు తీసుకెళ్లిన ఘనత కేసీఆర్ దన్నారు. సంగ్రామ యాత్రకు ఇన్ ఛార్జ్ గా పార్టీ ఉపాధ్యక్షుడు డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డి, సహ ఇన్ చార్జిలుగా తూళ్ల వీరేందర్ గౌడ్, లంకల దీపక్ రెడ్డి, కుమ్మరి శంకర్ వ్యవహరిస్తున్నారు.
రెండో రోజు (ఏప్రిల్ 15, 2022)
ఇమామ్ పూర్ నుండి బైరాపూర్, లింగనవాయి, ఉండవెల్లి, చిన్న ఆముదాలపాడు. తక్కశిల, ప్రాగటూరు వరకూ యాత్ర సాగింది. లింగనవాయి గ్రామంలో రచ్చబండ ఏర్పాటు చేసి ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. 1200 మంది బలిదానాలతో ఏర్పడిన తెలంగాణ కేసీఆర్ కుటుంబం చేతిలో ఎలా బందీ అయిందీ కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి గారు యాత్రలో పాల్గొని వివరించారు. ఉద్యోగాలు లేక నిరుద్యోగులు,ఇండ్లు లేక పేదలు, కనీస సౌకర్యాలు లేక ప్రజలు అల్లల్లాడుతుంటే రాష్ట్రంలో బాగుపడింది కేవలం కేసీఆర్ కుటుంబ సభ్యులే అని కిషన్ రెడ్డి గారు అన్నారు. తెరాస నేతలు లిక్కర్, భూమి, ఇసుక, డ్రగ్ మాఫియాగా మారి జలగల రూపంలో ప్రజల రక్తాన్ని పీలుస్తున్నరని విమర్శించారు. ఆర్డీఎస్ పథకాన్ని పునరుద్దరించలేదు గానీ గోదావరి జలాలను కాళేశ్వరం ద్వారా తన ఫామ్ హౌస్ కు కేసీఆర్ తరలించుకున్నారని ఆరోపించారు.
పెను భారంగా మారిన కరెంటు చార్జీలపై కదం తొక్కాలని అయన పిలుపునిచ్చారు. వ్యవసాయానికి ఉచిత కరెంటు ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం గృహ విద్యుత్ చార్జీలు పెంచి సామాన్యులపై రూ 6,000 కోట్ల భారం మోపిందని సంజయ్ గారు ధ్వజమెత్తారు. పల్లెల అభివృద్ధికి ఆర్థిక సంఘం ద్వారా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంటే, వాటిని ఖర్చు చేసి రాష్ట్ర ప్రభుత్వం కుప్పలు చెప్పుకుంటోందని అన్నారు.
మూడో రోజు (ఏప్రిల్ 16, 2022)
యాత్ర ఉండవల్లి మండలం కంచుపాడు నుంచి ప్రారంభమై తక్కశిల, ప్రాగాటూరు, మార మునగాల, చండూరు వరకు సాగింది. అధికార పార్టీ నేతల దౌర్జన్యాలు, అక్రమ కేసులు భరించలేక మెదక్ జిల్లా రామాయంపేట లో తల్లీ కొడుకుల ఆత్మహత్య, ఖమ్మంలో పదహారు కేసులు పెట్టి రౌడీ షీట్ ఓపెన్ అయిన కార్యకర్త బలవన్మరణం వార్తలు నేతల మనసులను కలచివేశాయి. తెరాస సర్కార్ తమను ప్రశ్నించి, విమర్శించిన వారిపై వేధింపులకు పాల్పడి ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్నదని సంజయ్ గారు మండి పడ్డారు.
పెద్ద సంఖ్యలో రైతులను కలిసిన ఆయన ఉచిత కరెంట్ అంతా బోగస్ అన్నారు. పవర్ కంపెనీలకు ఇవ్వాల్సిన సబ్సిడీ పైసలు ఒక్క పైసా ఇవ్వలేదని, అవి ఇచ్చేది రాబోయే బీజేపీ ప్రభుత్వమేనని చెప్పారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాడ్ చేశారు. కేసీఆర్ పాలన అన్ని రంగాల్లో విఫలమైందన్నారు. యాత్రలో భాగంగా రచ్చ బండ నిర్వహించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు, విన్నపాలు స్వీకరించారు.
నాల్గో రోజు (ఏప్రిల్ 17, 2022)
యాత్ర చండూరు క్రాస్ రోడ్డు నుండి ప్రారంభమై జల్లాపూర్, బోరవెల్లలి, నారాయణపురం మీదుగా సాగింది. రుణ మాఫీ కాని, దళిత బంధు రాని, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు లేని ఊళ్లు ఉన్నాయి గానీ, కెసిఎఆర్ పెట్టిన మద్యం షాపులు లేని ఊరంటూ లేదని సంజయ్ గారు ధ్వజమెత్తారు. ఖమ్మంలో బలవన్మరణం పొందిన సాయి గణేష్ మరణ వాంగ్మూలం ఆధారంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తో పాటు పోలీసు అధికారులు, తెరాస గూండాలపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేసారు.
అలంపూర్ నియోజకవర్గంలో చుక్కనీరు లేక బీడుబారిన పొలాలను చూస్తే గుండె తరుక్కుపోతున్నదని, తలాపునే తుంగభద్రా నీళ్లున్నా వాడుకోలేని దుస్థితికి కారణం ప్రభుత్వమని చెప్పారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక రాజోలి బండ డైవెర్షన్ కాల్వ ద్వారా 15.6 టీ ఎం సీ ల నీరు వచ్చేలా చేస్తామని, అలంపూర్ లో లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం లక్ష కోట్లు ఖర్చు చేసి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన ఫార్మ్ హౌస్ కు గోదావరి నీళ్లు తెచ్చుకున్న ఘనుడు కేసీఆర్ అని చెప్పారు.
ఆర్డీఎస్ సెంటిమెంటు ను ఉపయోగించుకొని అధికారంలోకి వచ్చిన కేసీఆర్ జిల్లా సాగునీటి సమస్యను గాలికొదిలలేశాడని సంజయ్ గారు చెప్పారు. జిల్లాను దత్తత తీసుకొని ఒరగబెట్టింది ఏమిటో చెప్పాలని ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పేదలు ఏలే పాలన కోసం బీజేపీ పోరాటం చేస్తుందన్నారు. రాబోయే ఎన్నికల నాటికి ప్రజలు బాగా ఆలోచించి మెరుగైన పాలన కోసం ఓటు వేయాలని కోరారు. బోరవెల్లిలో ‘ప్రజల గోడు-బీజేపీ భరోసా కార్యక్రమం’ నిర్వహించి స్దానికుల ను సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
ఐదో రోజు (ఏప్రిల్ 18, 2022)
పాదయాత్ర వేముల, బట్ల దిన్నె, షాబాద్ మీదుగా ఉదండాపూర్ వరకు సాగింది. అప్పటికే యాత్రకు లభిస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక తెరాస శ్రేణులు రెండు సార్లు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తెరాస గూండాలు బీజేపీ నేతలకు చెందిన ఆరు కార్లు ధ్వంసం చేసి, ఫ్లెక్సీలకు నిప్పంటించారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. ఎన్ని అడ్డంకులు సృష్టించినా బరాబర్ గా యాత్ర సాగిస్తానని సంజయ్ గారు స్పష్టం చేశారు. ‘ఆరు నెలల్లో కేసీఆర్ ఖేల్ ఖతం కాబోతున్నది,’ అని ఆయన అన్నారు.
బీజేపీ అధికారంలోకి వచ్చాక నకిలీ విత్తనాలు అమ్మితే బొక్కలో వేస్తామని, ఆర్డీఎస్ ద్వారా గద్వాల జిల్లా రైతులకు నీళ్లిస్తామని హామీ ఇచ్చారు. యాత్రపై దాడిని బీజేపీ నేతలు గట్టిగా ఖండించారు. ముఖ్యమంత్రి ప్రోద్భలం, మంత్రి కేటీఆర్ డైరెక్షన్ లోనే పథకం ప్రకారం యాత్రపై దాడులు చేస్తున్నారని ఎం ఎల్ ఏ రాజాసింగ్, ఎంపీ సోయం బాబూరావు, మాజీ ఎం పీ విజయశాంతి హైదరాబాద్ లో ఆరోపించారు.
ఆరో రోజు (ఏప్రిల్ 19, 2022)
ఎల్కూర్, నెడిపల్లి, చెర్లగార్లపాడు మీదుగా ఎద్దుల గూడెం వరకు 13 కిలో మీటర్ల మేర పాద యాత్ర సాగింది. ఐదో రోజు యాత్రపై జరిగిన దాడికి నిరసన వెల్లువెత్తింది. దాడులకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు, జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహించాలని సంజయ్ గారు టెలి కాన్ఫరెన్స్ లో శ్రేణులకు పిలుపునిచ్చారు. ఎల్కూర్ లో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ కేసీఆర్ కు మందులో సోడా కలిపిన వారందరూ కేబినెట్ లో మంత్రులయ్యారని ఎద్దేవా చేసారు. ధనిక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణాలో ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వలేని దుస్థితి ఏర్పడిందని చెప్పారు.
పాలమూరు ప్రజల కష్టాలను కేసీఆర్ పట్టించుకోవడం లేదనీ, రాష్ట్రంలో ఎన్ని పరిశ్రమలు స్ధాపించారో, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. తెరాస పాలనలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పాలన కుంటుపడిందని, పాలమూరు నుంచి వలసలు కొనసాగుతునే ఉన్నాయనీ, కరవు పరిస్దితుల్లో పెద్దగా మార్పేమి లేదని డీకే అరుణ గారు చెప్పారు. కేంద్ర ప్రభుత్వ పథకాలైన ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి ఆవాస్ యోజనతో పాటు అనేక పథకాలను రాష్ట్రంలో అమలు జరపడం లేదెందుకని ప్రశ్నించారు.
ఏడో రోజు (ఏప్రిల్ 20, 2022)
పాద యాత్ర మల్దకల్ నుండి ప్రారంభమై సద్దలోని పల్లె, అమరాయి, పెద్దపల్లి కురవాయిపల్లి, పరిమల నుంచి గద్వాల శివారు వరకూ వరకు సాగింది. ఆరు రోజుల పాదయాత్రకు లభిస్తున్న అద్భుత ప్రజాదరణకు బుర్ర తిరిగిన తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వరంగల్లో ఒక బహిరంగ సభ పెట్టి ప్రధానమంత్రి మోదీ, హోమ్ మంత్రి అమిత్ షా మీద పరుషంగా మాట్లాడారు. కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ జీ పాదయాత్రలో పాల్గొని అమరవాయిలో ప్రసంగిస్తూ- మాటిమాటికీ పాలమూరు, రంగారెడ్డికి జాతీయ హోదా ఎందుకు ఇవ్వడం లేదంటున్న తెరాస ప్రభుత్వం గాలి తీశారు.
ప్రభుత్వం ఆ ప్రాజెక్టు డీపీఆర్ ను ఎందుకు సమర్పించండంలేదని అయన ప్రశ్నించారు. కృష్ణా నదిలో రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 811 టీ ఎం సీ ల నీటి వాటా ఉంటే, అందులో తెలంగాణా కు 299 టీ ఎం సీ లు సరిపోతాయని అంగీకరించి పాలమూరు ప్రజల హక్కులను కేసీఈఆర్ కాలరాశారని ఆరోపించారు. హత్యలు, ఆత్మహత్యలు, అత్యాచారాలు-ఈ దాష్టీకాలు ఇంకెన్నాళ్లు? అని ప్రశ్నిస్తూ బీజేపీ నాయకులూ నల్ల మాస్కులు ధరించి గద్వాల్ జిలా మల్దకల్లో ప్రజాసంగ్రామ యాత్ర శిబిరం వద్ద డీకే అరుణ తదితర నేతలతో కలిసి బండి సంజయ్ నిరసన దీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా సంజయ్ గారు మాట్లాడుతూ-ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్ దాష్టీకానికి బలైన సాయి గణేష్ మృతిపై సీబీఐ చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. నిజాం కాలంలో అరాచకాలు, అత్యాచారాలు మనం చూడలేదు కాబట్టే తెరాస నాయకులు మనకు నిజాం చరిత్రను ఇప్పుడు చూపెడుతున్నారని చెప్పారు.
లింగం బావి పునరుద్ధరుణకు హామీ
పాదయాత్ర రెండో రోజున మేము లింగన్నవాయి గ్రామం మీదుగా జన స్వాగతం మధ్య ముందుకు పోయాము. ఆ గ్రామానికి ఆ పేరు రావడానికి కారణం, అక్కడ విశాలమైన బావి ఉండి, అందులో శివ లింగం ఉండడం. ఆ బావి, దాని దగ్గర ఉన్న గుడి దుస్థితి చూస్తే గుండె తరుక్కుపోయింది. “ఇది వందల ఏళ్ల కిందట నిర్మించిన బావి. అందులోని శివ లింగం ఎప్పుడూ నీటిలో మునిగిపోయి ఉంటుంది,” అని గ్రామస్థుడు రవి నాతో చెప్పాడు. గ్రామాల పునరుద్ధరణలో ఇలాంటి బావులను, పవిత్ర క్షేత్రాలను భాగం చేయకపోతే ఎలా?
చూడముచ్చటైన ఆ బావి ని ఎవ్వరూ పట్టించుకోక పోవడంతో చెత్తా చెదారం, మురికి నీరు అందులో చేరాయి. పవ్రితమైన ఇలాంటి ఆధ్యాత్మిక ప్రాంతాల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే లింగం బావిని పునరుద్ధరించి, వేలాది భక్తులు తరలి వచ్చేలా ‘టెంపుల్ టూరిజం’ ను అభివృద్ధి చేస్తామని సంజయ్ అభయం ఇచ్చారు. నల్ల సోమనాద్రి పాలించిన ఈ ప్రాంతంలో చారిత్రక లింగం బావిలో పాటు సోమంద్రి కోట, ఆలయాలు ఉన్నాయి.
ముఖ్యమంత్రికి సంజయ్ లేఖ
ఏ గ్రామానికి వెళ్ళినా వందలాది మంది రైతులు తన వద్దకు వచ్చి రైతురుణమాఫీ జరుగలేదని తమ గోడు వెళ్ళబోసుకుంటున్న తీరును సంజయ్ గారు ముఖ్యమంత్రికి ఏప్రిల్ 21, 2022 న రాసిన లేఖలో పేర్కొన్నారు. “2018 ఎన్నికల సమయంలో లక్ష రూపాయల వరకు రైతులకు వున్న కూడా బకాయిలను రద్దు చేస్తామని టీఆర్ఎస్ హామీ ఇచ్చింది. ఈ నాలుగేండ్ల కాలంలో 20,164.20 కోట్లు కేటాయించినట్లు గొప్పలు చెప్పినా అందులో ప్రభుత్వం విడుదల చేసింది కేవలం 1,144.38 కోట్లు మాత్రమే. దీనివల్ల 5.66 లక్షల మంది రైతులకు రుణమాఫీ జరగగా దాదాపు 31 లక్షల మంది రైతులు రుణమాఫీ కోసం ఎదురుచూస్తున్నారు,” అని పేర్కొన్నారు.
25 వేల లోపు రుణమాఫీ కావాల్సిన రైతులు 2.96 లక్షలు ఉండగా వారికి రుణమాఫీ కావాల్సింది రూ.408.30 కోట్లు, 25 వేల నుండి 50 వేల లోపు రుణమాఫీ కావాల్సిన రైతులు 5.72 లక్షలు ఉండగా వారికి రుణమాఫీ కావాల్సింది రూ.1,790 కోట్లు, 50 వేల నుంచి 75 వేల లోపు రుణమాఫీ కావాల్సిన రైతులు 7 లక్షల మంది ఉండగా వారికి రుణమాఫీ కావాల్సింది రూ.4 వేల కోట్లు, 75 వేల నుండి ఒక లక్ష వరకు రుణమాఫీ కావాల్సిన రైతులు 21 లక్షలమంది ఉండగా వారికి రుణమాఫీ కావాల్సిది రూ.13 వేల కోట్లు. మొత్తంగా 36.68 లక్షలమంది రైతులకు 19,198.38 కోట్లు ప్రభుత్వం రుణమాఫీ చేయాల్సింది ఉంది.
50 వేల లోపు రుణమాఫీ కావాల్సిన రెండు లక్షలమంది రైతులకు సంబంధించిన రూ.857కోట్ల బిల్లులు ప్రభుత్వానికి సమర్పించినా ఆర్థికశాఖ పెండింగ్ లో పెట్టడం వల్ల రైతాంగం అనేక ఇబ్బందులు పడుతున్నారని సంజయ్ గారు తెలియజేసారు. రాష్ట్ర ప్రభుత్వం బ్యాంక్ ఉన్నతాధికారులతో మాట్లాడి సంక్షేమపథకాల డబ్బును రుణమాఫీ బకాయిలకు జమచేసుకోకుండా ఆదేశించాలని వారిని కోరాలని చెప్పారు. రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై రైతు సంఘాలతో, అన్ని రాజకీయపార్టీలతో వెంటనే ఒక అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని బిజెపి తరుపున సంజయ్ గారు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
మండే ఎండను లెక్కచేయకుండా ఉత్సాహంగా సాగుతూ మొదటివారమే ప్రజలలో ఎనలేని ఉత్తేజం కలిగించి, పాలకుల మొద్దు నిద్రలేపిందీ సంగ్రామ యాత్ర అనడంలో సందేహం లేదు. ప్రజల సమస్యలు ఏ మాత్రం పట్టని అధికార గణానికి భిన్నంగా గోస వినడానికి బీజేపీ నేతలు కలిసి రావడంతో కర్షక, శ్రామిక, ఉద్యోగులు, అన్ని వర్గాల ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.
..పోరెడ్డి కిషోర్ రెడ్డి
రచయిత బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి

.

Discussion about this post