‘నీళ్లు-నిధులు-నియామకాలు’ నినాదంతో పాటు ‘ఆత్మగౌరవం’ అజెండాగా వందల మంది అమరవీరుల త్యాగాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణలో ప్రస్తుత రాజకీయ- ఆర్థిక- సామాజిక పరిస్థితి చూస్తే గుండె తరుక్కుపోతుంది. ప్రజాధనం నీళ్లలా ఖర్చై, నిధులు లేక అప్పుల పాలై, ఒక్క కుటుంబానికి మాత్రమే నియామకాలు పరిమితమైన దుస్థితి.
నిజాం నిరంకుశ పాలనను, దొరల గడీల పాలనను తలపించే కల్వకుంట్ల కుటుంబ పాలనలో అన్ని వర్గాల ఆత్మగౌరవం మంటగలిసింది. ‘తెలంగాణ జాతి పిత’ తానేనని సొంతంగా ప్రకటించుకుని, ‘బంగారు తెలంగాణ’ ఎన్నడో ఏర్పడిపోయిందని నమ్మబలికి, ఇక నిరాఘాటంగా రాష్ట్రాన్ని తామే ఏలేస్తామని భ్రమల్లో బతికిన కేసీఆర్ తప్పులమీద తప్పులు చేసి అనతికాలంలోనే ప్రజాకంటక పాలకుడిగా, నిరంకుశత్వానికి ప్రతీకగా, అహంకారానికి- రాచరికానికి చిహ్నంగా మారారు.
అప్పటికే రాజకీయ బేహారిగా మారిన కేసీఆర్ డబ్బు, అధికారం వాడుకుని విపక్షమన్నదే లేకుండా చేసి, తన ప్రజావ్యతిరేక విధానాలను ప్రశ్నించే గళమే లేదని విర్రవీగుతున్న సమయంలో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్ కుమార్ గత ఏడాది ఆగస్టులో జరిపిన మొదటి విడత ‘ప్రజా సంగ్రామ యాత్ర’ ప్రకంపనలు సృష్టించింది. కేసీఆర్ ప్రభుత్వం మీద ప్రజల్లో గూడుకట్టుకున్నఆగ్రహానికి ఆ యాత్ర అద్దంపట్టింది.
ఈ ఎనిమిదేళ్ల కాలంలో ఏ సమస్యనూ పరిష్కరించని బద్ధకపు దురంహకార ముఖ్యమంత్రి కాస్త ఒళ్ళువంచడానికి బీజేపీ పోరాట పటిమే కారణమన్నది స్పష్టం. జనం సమస్యలతో నానా తంటాలు పడుతున్నా నీరో చక్రవర్తిలాగా జల్సాగా ఫామ్ హౌస్ కు, ప్రగతి భవన్ కు మాత్రమే పరిమితమైన ముఖ్యమంత్రిని ముందుగా ఇందిరా పార్క్ కు ఆ తర్వాత రోడ్ల మీదకు వచ్చేలా చేస్తాననని చెప్పి మరీ చేశారు బండి సంజయ్ కుమార్. ఇందుకు తాజా సాక్ష్యం: మొక్కవోని దీక్షతో రైతులకు బాసటగా నిలిచి బీజేపీ చేసిన నిరసనలకు దిగివచ్చి ఏసంగి వరిని మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే సేకరిస్తుందని ముఖ్యమంత్రి చేసిన ప్రకటన.
అడిగేవాడు లేకపోతే జనాల చెవిలో పువ్వులు పెట్టే అలవాటున్న అయన అంతకుముందు ఉద్యోగ ప్రకటన చేయకపోతే మిలియన్ మార్చ్ కు సిద్ధమని చేసిన హెచ్చరికలతో దిగివచ్చి ఉద్యోగాల కల్పనపై అసెంబ్లీలో నిర్దిష్ట ప్రకటన చేయకతప్పలేదు. కేసీఆర్ ను మొద్దునిద్ర నుంచి లేపిన మొదటి విడత యాత్రలో మహామహులు అమిత్ షా, కిషన్ రెడ్డి, ఫడ్నవీస్, రామన్ సింగ్, స్మృతి ఇరానీ, ప్రకాశ్ జవదేకర్ వంటి జాతీయ స్థాయి నాయకులు పాల్గొని దిగ్విజయం చేశారు. వారు సభల్లో లేవనెత్తిన ప్రశ్నలకు ప్రభుత్వం నుంచి సమాధానాలు లేవు. మొదటి విడతలో బీజేపీకి అందిన పిటిషన్లు చూస్తే కేసీఆర్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకత తెలిసిపోతుంది. ఒక్కొక్క సమస్యను పరిష్కరించుకుంటూ బీజేపీ ముందుకుపోతుంటే పీఠాలు కదిలి కేసీఆర్, కేటీఆర్ బృందం గుండెలు దడదడలాడుతున్నాయి.
దగాపడ్డ తెలంగాణకు భరోసాగా ఉండేందుకు డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ జయంతి అయిన ఈ రోజున (ఏప్రిల్ 14, 2022) జోగులాంబ గద్వాల జిల్లాలోని అమ్మవారి శక్తి పీఠం నుండి ప్రారంభమయ్యే రెండో విడత సంగ్రామ యాత్ర ప్రభుత్వానికి కంటిమీద కునుకులేకుండా చేస్తున్నది. రెండో విడత యాత్ర 31 రోజుల పాటు 387 కిలో మీటర్ల మేర మే 14 వరకూ సాగనుంది. ఆగస్టు 24 న భాగ్యలక్ష్మి ఆలయం దగ్గర ప్రారంభమై 8 జిల్లాలు, 19 శాసనసభ నియోజక వర్గాలు, 6 పార్లమెంటు నియోజక వర్గాల పరిధిలో 36 రోజుల పాటు 438 కిలో మీటర్ల మేర సాగి హుస్నాబాద్ లో ముగిసిన మొదటి యాత్రకు కొనసాగింపు ఈ రెండో యాత్ర. ఒక్క మాటలో చెప్పాలంటే- కేసీఆర్ దారుణ పాలనను బట్టబయలు చేసి ప్రజలను కార్యోన్ముఖులను చేసే ఒక బృహత్ కార్యక్రమం. పాలనపై గుండెలు భగగభగ మండుతున్న ప్రజల ఆగ్రహానికి ఆలంబనగా ఈ యాత్ర చరిత్రలో నిలిచిపోతుంది.
ఇప్పుడు తెలంగాణలో పాలన కుంటుపడింది. సంక్షేమం మరుగున పడిపోయింది. అభివృద్ది కనిపించడం లేదు. పాలన చేతగాక, నాణ్యమైన కేబినెట్ లేక ప్రజాకర్షక పథకాలతో ఖజానాను గుల్ల చేస్తున్నారు. అవినీతి, బంధు ప్రీతి పెరిగిపోయాయి. అధికారుల్లో చలనం లేకుండా చేశారు. ప్రజా ప్రతినిధులను ఉత్సవ విగ్రహాలుగా మార్చేశారు. అధికారాలన్నీ ఒక కుటుంబం దగ్గరే కేంద్రీకృతమయ్యాయి. తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యం కనుమరుగయింది. ప్రజాస్వామ్య వ్యవస్థలను నిర్వీర్యం చేసి, అవినీతి అక్రమాలతో కుటుంబ పాలనను వ్యవస్థీకృతం చేయాలన్న కేసీఆర్ దుష్ట అజెండాకు చరమగీతం పలకడం, మోసపోయిన తెలంగాణకు ఊరట నిచ్చేలా పాలన అందించడం ఇప్పుడు బీజేపీ విహిత కర్తవ్యాలు.
ప్రభుత్వ పథకాల అమలు, మౌలిక సౌకర్యాల గురించి అధ్యయనం చేస్తూనే ప్రజావసరాలు తీర్చే దిశగా సర్కారును ఉరికెత్తించడం ముఖ్యం. టీఆర్ఎస్ సర్కార్ను గద్దెదించి గోల్కొండ కోటపై కాషాయ జెండాను రెపరెపలాడించడమే తమ లక్ష్యమని బండి సంజయ్ ఇప్పటికే ప్రకటించారు. ప్రజాస్వామ్య తెలంగాణ ఏర్పాటు లక్ష్యంగా చంద్రశేఖర్ రావు అవినీతి, అక్రమాల పాలనకు వ్యతిరేకంగా ప్రజా సంగ్రామ పాదయాత్ర సాగుతుందని తెలిపారు. పాదయాత్రలో మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతి, అక్రమాలను ప్రజల సమక్షంలోనే బహిర్గతం చేయబోతున్నారు. వందల మంది బలిదానాలతో ఏర్పడ్డ తెలంగాణలో ఒక కుటుంబం మాత్రమే లాభపడుతున్న వైనాన్ని వివరిస్తారు.
అన్ని రంగాల్లో తెలంగాణాను దెబ్బతీసిన చంద్రశేఖర్ రావు పాలనను, తీరును ప్రజలు అసహ్యించుకుంటున్నారు. అందరిలోనూ నమ్మి మోసపోయామన్న భావనే. దుబ్బాక దెబ్బకు గింగిరాలు తిరిగిన టీఆర్ఎస్ వందల కోట్లు కుమ్మరిస్తే హుజురాబాద్ జీ హుజూర్ అంటుందనుకుంటే విజ్ఞులైన ఓటర్లు కోలుకొని షాక్ ఇచ్చారు. కీలకమైన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో సైతం ప్రభుత్వానికి ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారు. దీంతో ఇంకా రెచ్చిపోయిన ప్రభుత్వం అక్రమాలు, అణచివేతలు పెంచుతూ ప్రజాస్వామ్యానికి పాతరేస్తోంది. కమల వికాసంతో దిక్కుతోచని ప్రభుత్వం దీర్ఘకాలిక పరిష్కారాలు కాకుండా తాయిలాలు, పప్పుబెల్లాల మీద దృష్టి పెట్టింది.
ప్రభుత్వ ప్రజా వ్యతిరేక ధోరణులు, రైతాంగ వ్యతిరేక చర్యలను ఎండగట్టడంతో పాటుగా విద్యుత్ ఛార్జీల పెంపు, భారమైన బస్ ప్రయాణం వంటి ప్రజా సమస్యలు కూడా ఈ పాద యాత్రలో లేవనెత్తబోతున్నారు. రైతులు, నిరుద్యోగులు, విద్యార్దులు, దళితులు, ఉద్యోగులు, పింఛనుదారులు, మహిళలు, ఇతర అన్ని వర్గాల ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యలను లేవనెత్తి ప్రభుత్వ చర్యలను ఎండగట్టేలా పాద యాత్ర సాగిపోనుంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తో పాటు, కేంద్ర మంత్రులు అమిత్ షా, కిషన్ రెడ్డి, స్మృతి ఇరాని, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రాష్ట్ర ఇంచార్జి తరుణ్ ఛుగ్ తో పాటు పలువురు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్టీ జాతీయ నాయకులూ పాల్గొనే రెండో యాత్ర తెరాస పాలనకు మరణ శాసనం అనడంలో సందేహం లేదు.
..పోరెడ్డి కిషోర్ రెడ్డి
రాష్ట్ర అధికార ప్రతినిధి, భారతీయ జనతా పార్టీ, తెలంగాణ

.

Discussion about this post