రాష్ట్ర పురపాలక శాఖా మాత్యులు బొత్స సత్యనారాయణకు బొత్తిగా ఓపిక లేనట్టుంది. ఆయన మాటలు పచ్చి పుండుపై కారం చల్లినట్లున్నాయి. ఉద్యోగ సంఘాలతో సవ్యంగా చర్చలు జరపడానికి అనుకూలమైన వాతావరణం సృష్టించకుండా వారిని మరింత రెచ్చగొడుతున్నారు.
ఇదే కాదు. అమరావతి రైతుల విషయంలో కూడా బొత్స అలాగే మాట్లాడి ప్రభుత్వానికి తలనొప్పి తెచ్చారు. ఉద్యోగుల విషయంలో కూడా అదే తీరుతో వ్యవహరిస్తున్నారు. ‘ఇక వారంతగా వస్తే తప్ప మేం చర్చలకు రాము.. వాళ్లకోసం మేం ఎదురుచూస్తూ కూర్చోవాలా’ అంటూ సాగిన బొత్స మాటలు ఉద్యోగులకు మరింత ఆగ్రహం తెప్పిస్తున్నాయి. ఉద్యమం తీవ్రరూపం దాల్చడానికి కారణం అవుతున్నాయి. ఆయన తీరుమార్చుకుంటేనే ఉద్యోగ సంఘాలు చర్చలకు వెళ్లే అవకాశం ఉంది.
పే రివిజన్ కమిషన్ (పీఆర్సీ) కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ, ఉపాధ్యాయులు ఉద్యమం చేస్తున్న సంగతి తెలిసిందే. వివిధ శాఖల వారు ఈ ఉద్యమానికి మద్దతు తెలుపుతున్నారు. వచ్చే నెల 6వ అర్ధరాత్రి నుంచి వీరంతా సమ్మెకు సిద్దమవుతున్నారు. ఇప్పటికే చాలా వరకు ప్రభుత్వ కార్యకలాపాలు స్తంభించిపోయాయి. ఈ నేపథ్యంలో పీఆర్సీ సాధన సమితితో చర్చలు జరపడానికి ఇటీవల ప్రభుత్వం ఓ కమిటీ నియమించింది. ఈ కమిటీలో బొత్స సత్యనారాయణకు కూడా స్థానం కల్పించారు. ఈ కమిటీలో సభ్యులుగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి, బొత్స సత్యనారాయణ, పేర్ని నాని కలసి శుక్రవారం సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు.
ఈ సందర్భంగా ‘‘ఉద్యోగ సంఘాలతో చర్చించడానికి రకరకాలుగా ప్రయత్నిస్తున్నాం. పీఆర్సీ సాధన సమితిని చర్చలకు రావాలని పిలిచాం. గత ఐదు రోజులుగా చాలా ఎడిమెంట్గా (మొండిగా) వ్యవహరిస్తున్నారు. ఈ మాట అనడానికి కాస్త ఇబ్బంది అయినా తప్పడంలేదు’’ అని మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. ఉద్యోగ సంఘాలు రాజకీయ ఆలోచనలతో ఉద్యమం చేస్తున్నాయా అని మంత్రి వ్యాఖ్యానించారు. ‘‘మేం ఒకటికి రెండు మెట్లు దిగి మాట్లాడతాం అంటే దాన్ని అలుసుగా తీసుకుంటున్నారు. అయితే ప్రభుత్వం మాకు బాధ్యత అప్పగించింది కాబట్టి ఎన్ని మెట్లు అయినా దిగుతాం. ఏదైనా అడిగేటప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని, కొవిడ్ పరిస్థితులను ఉద్యోగులు దృష్టిలో పెట్టుకోవాలి. గతంలో కంటే ఎక్కువగా పీఆర్సీ ఇచ్చాం. ఉద్యోగుల జీతాలు పెరుగుతాయో తగ్గుతాయో ఒకటో తేదీన పే స్లిప్ చూసుకోవాలి. ఒక్కరికి కూడా రూపాయి కూడా తగ్గదు.
ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కారం చర్చల వల్లే దొరుకుతుంది. మేం ఎలాంటి బేషజాలు లేకుండా సోదరభావంతో ఉన్నాం. ఉద్యోగులకు సమస్య అంటే ప్రభుత్వానికి సమస్య ఉన్నట్లే. ఎలాంటి ఘర్షణ వాతావరణానికి తావులేకుండా చర్చలకు ముందుకు రావాలని పీఆర్సీ సాధన సమితిని ఇప్పటివరకు కోరాం. ఇకపై ప్రతిరోజూ సమితి కోసం సచివాలయానికి వచ్చి ఎదురు చూడం. ఎప్పుడైతే ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు చర్చలకు వస్తాం అంటారో అప్పుడే మంత్రుల కమిటీ తిరిగి అందుబాటులోకి వస్తుంది. నాయకత్వాన్ని నిలబెట్టుకోవడానికి పీఆర్సీ సాధన సమితి నేతలు వేస్తున్న ఎత్తుగడలు ఇవి?. వారికి ఏమైనా రహస్య ఎజెండా ఉందా?’’ అంటూ బొత్స వ్యాఖ్యానించారు.
ఉద్యోగులకు రహస్య అజెండా ఏమీ లేదని, ఉండదని అందరికీ తెలిసిన సత్యం. పీఆర్సీ జీవో లను వెనక్కు తీసుకోవాలని.. పాత జీతాలే తమకు ఇవ్వాలని.. ఈ రెండు అమలు చేస్తే తాము చర్చలకు వస్తామని పీఆర్సీ సాధన సమితి నేతలు చెబుతున్నారు. అంతవరకు తాము చర్చలకు రామని వారు మొదటి అంటున్నారు. పీఆర్సీ జీవోలు ఉపసంహరించుకోకుండా.. కొత్త పీఆర్సీ ప్రకారమే జీతాలు ఇస్తామంటూ.. మళ్లీ ఉద్యోగ సంఘాలు మొండిగా వ్యవహరిస్తున్నాయని మంత్రి బొత్స వ్యాఖ్యానించడం ఎంత వరకు సబబు అన్నదే ఉద్యోగుల ప్రశ్న.
ఉద్యోగులను రెచ్చగొట్టడానికే బొత్స ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని పీఆర్సీ సాధన సమితి నేతలు అంటున్నారు. మంత్రి చెప్పినట్లు ప్రభుత్వం ఎక్కడా ఒకటికి రెండు మెట్లు దిగలేదు. కమిటీ సభ్యులు మొదట ఎక్కడ ఉన్నారో.. వారు ఇప్పటికీ అక్కడే ఉన్నారు. ‘‘సందేహాలు తీర్చుతాం’’ అంటున్నారే తప్ప.. జీవో లను ఉపసంహరించుకుంటామని వారు చెప్పడం లేదు. ఆ దిశగా చర్యలు తీసుకోకుండా ఉద్యోగ సంఘాల నేతలు చర్చలకు వస్తారని భావించడం అత్యాశే. అది వారికి కూడా తెలుసు.
‘అగ్గిమీద గుగ్గిలం’ అన్నట్లు బొత్స మాటలు ఉన్నాయి. ప్రభుత్వం మెట్టు దిగకుండా.. మేము సచివాలయంలో చర్చల కోసం వేచి చూస్తున్నామంటే కుదరదు. ఉద్యోగులను రెచ్చగొట్టడం వలన ఉద్యమం మరింత ఉధృతం అయ్యే అవకాశం ఉంది. అందుకు బొత్సతో పాటు కమిటీ సభ్యులు వారి మాట తీరు మార్చుకుంటే మంచిది.
.

Discussion about this post