మానవ సంబంధాలకు, సెంటిమెంట్కు ప్రాధాన్యం ఇవ్వడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ రూటే సెపరేటు. తనతో అనుబంధం ఉన్నవారితో ఆయన ఎంత నిరహంకారంగా ప్రవర్తిస్తారో అందరికీ తెలుసు. కేసీఆర్ మరోసారి అలాంటి మానవ సంబంధాలు, సెంటిమెంటుకే ప్రాధాన్యం ఇచ్చారు. నాగార్జునసాగర్ ఉపఎన్నికలో పార్టీ అభ్యర్థిగా మరణించిన ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కొడుకుకే టికెట్ ప్రకటించారు. తెరాస అభ్యర్థిగా నోముల భగత్ కుమార్.. బరిలో తలపడబోతున్నాడు.
ప్రజాప్రతినిధి మరణిస్తే.. ఉప ఎన్నికలో వారి కుటుంబ సభ్యులకే టికెట్ ఇవ్వడం చాలా సాధారణంగా జరుగుతూ ఉండే సంగతి. గతంలో దుబ్బాక ఎమ్మెల్యే మరణించిన సందర్భంలోనూ కేసీఆర్ ఇదే సూత్రాన్ని ఫాలో అయ్యారు. ఆయన భార్యకు టికెట్ ఇచ్చారు. అయితే ఫలితం నిరాశపరచింది. అక్కడ బీజేపీ ఘనవిజయం సాధించింది. రఘునందన్ రావు టీఆర్ఎస్ అభ్యర్థిని మట్టి కరపించారు.
ఇప్పుడు సాగర్ ఉపఎన్నిక జరుగుతోంది. నోముల నరసింహయ్య ఎమ్మెల్యేగా మరణించడంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. దుబ్బాకలో పనిచేయని సెంటిమెంటును బూచిగాచూపిస్తూ.. నోముల కుటుంబం నుంచి కాకుండా.. తాము దక్కించుకోవడానికి అనేకమంది ప్రయత్నాలు సాగించారు. దుబ్బాకలో సెంటిమెంట్ ఓడిపోయిన విషయాన్ని కూడా కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లారు. కానీ కేసీఆర్ అవన్నీ పట్టించుకోలేదు. నోముల కుమారుడు భగత్ కుమార్కే టికెట్ కట్టబెట్టారు.
తెలంగాణ భవన్లో తెరాస అధినేత, సీఎం కేసీఆర్ నోముల భగత్కు బిఫారం ఆందజేశారు. ఉప ఎన్నికలో పార్టీ ప్రచారం కోసం రూ.28లక్షల చెక్ కూడా అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి జగదీశిరెడ్డి, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, ఎమ్మెల్సీలు శేరి సుభాష్ రెడ్డి పల్లా రాజేశ్వరరెడ్డి నాగార్జున సాగర్ తెరాస నేతలు పాల్గొన్నారు. మంగళవారం ఉదయం భగత్ నామినేషన్ దాఖలు చేయనున్నారు
వారి ఆశలు ఫలించలేదు
సాగర్ టికెట్ కోసం పలువురు నేతలు విస్తృతంగా ప్రయత్నించారు. ఎమ్మెల్సీ చిన్నపరెడ్డి, కోటిరెడ్డి గురవయ్యయాదవ్, రంజిత్ యాదవ్. బాలరాజూదవ్ టికెట్ ఆశించారు. అందరి పేర్లతో సర్వేలు చేయించిన సీఎం కేసీఆర్ ఫైనల్ గా నోముల భగత్ వైపు మొగ్గారు. పార్టీ నేతలతో పాటు ఇన్ఛార్జులు, ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఎమ్మెల్యేల అభిప్రాయాలను కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది.
Discussion about this post