గతంలో సంసారం ‘చీకట్లోనే’ జరిగేది, జీవితాలు వెలుగులో ఉండేవి. నేడు సంసారం వెలుగులోకి వచ్చి జీవితాలు చీకట్లో మగ్గుతున్నాయి.
నాడు కొందరికే మందు, విందు అలవాటు. నేడు కొందరే వీటికి దూరం.
నాడు కష్టమొస్తే, కుటుంబంలోని పెద్దలు ధైర్యం చెప్పేవారు. నేడు కొన్ని కుటుంబాలలో కలహాలకు పెద్దలే కారణమౌతున్నారు.
నాడు తినడానికి శ్రమించి సంపాదించే వాళ్ళం. నేడు కదలకుండా కూర్చుని సంపాదిస్తూ, తిన్నది అరగడానికి వాకింగుకు శ్రమిస్తున్నాం.
నాడు పండ్లు, పాలు తిని బలంగా బోలెడు మంది సంతానాన్ని కని పోషించాము. ఇప్పుడు సంసారం చేయడానికే మందులు మింగుతున్నారు. ఇంక పిల్లలెక్కడ? అందుకేగా అన్ని చోట్లా సంతాన సాఫల్యకేంద్రాలు.
గతంలో అందరూ హార్డవేర్ ఇంజనీర్లే. మనసు మాత్రం సాఫ్టు.ఇప్పుడు అంతా ‘సాప్ట్ వేర్ ఇంజనీర్లే’. మనసు మాత్రం హార్డు.
అప్పుడు వైద్యుడు ఇల్లిల్లూ తిరిగి వైద్యం చేసేవాడు.
అమృతాంజనానికే జబ్బులు తగ్గేవి! ఇప్పుడు తలకాయనొప్పికే ఇళ్ళమ్ముకునేంత ఖర్చు ఔతోంది!!
నాడు దొంగలు ‘నట్టింట్లో’ పడి దోచుకెళ్ళేవారు,
నేడు దొంగలు దొరల్లాగా ‘నెట్ ఇంట్లో’ దోచేస్తున్నారు.
ఒకప్పుడు చదువులేనోడు దొంగగా మారేవాడు గతిలేక.
ఇప్పుడు దొంగతనాలు చేయడానికే కొత్త కోర్సులు చదువుతున్నారు సైబరు నేరగాళ్ళు.
అప్పుడు అప్పు చేయాలంటే తప్పు చేసినట్లు బాధపడే వాళ్ళం. ఇప్పుడు క్రెడిటు కార్డు మీద అప్పుతో కొనుక్కోడమే క్రెడిటు గా ఫీలౌతున్నాం.
ఒకప్పుడు పాలు, పెరుగు అమ్మి, సొమ్ము చేయలేక తాగేవాళ్ళం. ఇప్పుడు రెడీ మేడు చపాతీలు , పొంగలి, దాంట్లోకి కూరతో సహా కొనుక్కొచ్చుకొని తింటున్నాం.
చైనా నుండి ఒకనాడు పింగాణీ వస్తువు లొచ్చేవి. నేడు తినే కంచం నుంచి దాంట్లోకి ప్లాస్టిక్ బియ్యంతో సహా అక్కడి నుంచే.
ఇది మనం సాధించిన పురోగతా?
లేక మనకు మనం తెచ్చుకున్న అధోగతా?
… దేవీప్రసాద్ ఒబ్బు
9866251159

.