కరోనా తర్వాతి వాతావరణంలో మీడియారంగం మొత్తం కుదేలైంది. ఈనాడు సంస్థ కూడా ఇబ్బందులు పడింది. సంస్థకు భారం పెరిగింది. సుదీర్ఘకాలం భారం మోసిన తరువాత, భారాన్ని తగ్గించుకోవడానికి అనేక విమర్శలను ఎదుర్కొంటూనే రకరకాల మార్గాలను అనుసరించింది. ఎట్టకేలకు.. ఉద్యోగులకు వీఆర్ఎస్ ఇవ్వడానికి నిర్ణయించుకుంది. అయితే వారు చేసిన ప్రతిపాదనలకు, వారు ఊహించిన స్పందన మాత్రం ఉద్యోగుల నుంచి రావడం లేదు.!
కరోనా దెబ్బకి రూపురేఖలు మొత్తం మారిపోయిన వ్యాపారాలు/పరిశ్రమల్లో మీడియా కూడా ఒకటి. అందులోనూ ప్రింట్ మీడియాలో వచ్చిన మార్పులు చాలా ఎక్కువ. ఆధునిక సాంకేతికత ఎన్ని కొత్త పుంతలు తొక్కుతున్నప్పటికీ.. ప్రింట్ మాధ్యంలోని పత్రికలు సజీవంగానే ఎప్పటిలాగానే మనగలుగుతుంటాయనే ఒకప్పటి అభిప్రాయాలకు కాలం చెల్లేలా చేసింది కరోనా.
తెలుగు పత్రికారంగానికి సంబంధించినంతవరకు ఆధునిక తరానికి బాటలు తీర్చినది ‘ఈనాడు’! ఇప్పుడు కరోనానంతర పరిణామాల్లో మారుతున్న పోకడలకి, పత్రికల ప్రాబల్యం, పత్రికల కండబలం సన్నగిల్లడానికి కూడా దార్లు వేసినది ఈనాడే. జిల్లా వార్తల కోసం మినీ ఎడిషన్లను తీసుకువచ్చి.. దేశంలోనే ఒక విప్లవాత్మక ప్రింట్ మీడియా ట్రెండ్ కు రామోజీరావు శ్రీకారం చుట్టారు. స్థానిక వార్తలు, ప్రధాన వార్తలు.. వేర్వేరు పత్రికలలో చదవడం ఒక సంస్కృతి అయిపోయింది. సాక్షి వంటి పత్రికలు ఈనాడుకు భిన్నంగా రావడానికి ప్రయత్నించి, జిల్లా వార్తల్ని కూడా మెయిన్ ఎడిషన్లో ఇచ్చి.. జనాన్ని మెప్పించలేక అయిష్టంగా, అనివార్యంగా ఈనాడు బాట అనుసరించాయి.
అయితే రోజులు మారాయి. జిల్లా వార్తలకు ప్రత్యేకించిన రామోజీ మానసపుత్రికలు– మినీ ఎడిషన్లు ఇప్పుడు చరిత్రలో భాగం అయ్యాయి. మెయిన్ ఎడిషన్ కూడా బాగా చిక్కిపోయింది. పాఠకుల్లో నిర్దిష్ట, పరిమిత వర్గాలకు ఉద్దేశించిన ఫీచర్లు అన్నీ ఇప్పుడు కేవలం వెబ్, ఈ పేపర్ ఎడిషన్ లకు మాత్రమే పరిమితం అవుతున్నాయి. ఈ పరిణామాలన్నింటినీ కాలానుగుణమైన మార్పుల్లో భాగంగా మనం అర్థం చేసుకోవచ్చు.
మినీ ఎడిషనే లేకుండాపోయిన తర్వాత, మెయిన్ కూడా పేజీలు తగ్గిన తర్వాత.. సహజంగానే ఇదివరకటి స్థాయిలో సంఖ్యాపరంగా సిబ్బంది అవసరం బాగా తగ్గుతుంది. అదనంగా ఉన్న సిబ్బంది సంస్థకు తలకు మించిన భారం అవుతారు. ఈ విషయంలో సూటిగా వ్యవహరించలేక.. లేఆఫ్ లు, బలవంతపు సెలవులు వంటి రకరకాల మార్గాల్లో సిబ్బందిని వదిలించేసుకునేందుకు అనేక చిత్ర విచిత్ర మార్గాలు తొక్కిన ఈనాడు, కొన్నింటి విషయంలో స్పష్టంగా వ్యవహరించకపోవడం వలన బాగా విమర్శలకు కూడా గురైంది.
సిబ్బందిని తగ్గించుకోవడం అనివార్యం. అయితే అందుకు అనుసరించిన పద్ధతులే రకరకాలు. ఏదెలా ఉన్నప్పటికీ.. మెషిన్ సెక్షన్ లో ప్రతి యూనిట్ లోనూ రెండు మెషిన్ లు ఆపరేట్ చేయడానికి (మెయిన్, మినీ పత్రికలకు విడివిడి మెషిన్లు) ఉన్న సిబ్బందికి, చాలినంత పని ఇప్పుడు లేదు. ఇప్పుడు ఒకే మెషిన్ నడుస్తోంది. అందువల్ల సిబ్బందిని తగ్గించదలచుకున్నారు. ఇది చాలా సహేతుకం అనిపిస్తుంది. మెషిన్ సెక్షన్ సిబ్బందికి వీఆర్ఎస్ ప్రతిపాదనలు పెట్టారు.
ప్రతిపాదన ఏంటి? ఏమైంది?
ఉభయ తెలుగురాష్ట్రాల్లో కలిపి మెషిన్ సెక్షన్లో ఈనాడుకు సుమారు 600 మంది సాధారణ సిబ్బంది ఉన్నారు. (సీనియర్, ఇంజినీర్ స్థాయుల వారికి వీఆర్ఎస్ ప్రస్తుతానికి లేదు). వీఆర్ఎస్ ద్వారా కనీసం 200 మందిని తగ్గించుకోవాలనేది సంస్థ లక్ష్యం. సర్వీసుకాలంలో ఏడాదికి ఒక నెల వేతనం చొప్పున, 53 ఏళ్ల వయసు దాటిన వారికైతే మిగిలిఉన్న సర్వీసుకాలానికి ఏడాదికి మూడు నెలల వేతనం వంతున చెల్లించడానికి సంస్థ ప్రతిపాదించింది. అయితే ఉద్యోగులకు మాత్రం ఇది గొప్ప, ఆకర్షణీయమైన డీల్ కాదని అనిపించింది.
ఈ ప్రతిపాదన ప్రకారం 53 ఏళ్లకంటె దిగువన ఉన్న వారికి ఎక్కువ మొత్తం, 53 ఏళ్లు దాటిన వారికి తక్కువ మొత్తం వచ్చే అవకాశం ఉంది. ఆ నేపథ్యంలో 53 దాటిన వారు ఎవ్వరూ వీఆర్ఎస్ కు సుముఖంగా లేరు. సర్వీసు కాలానికి 30 రోజుల వేతనం ప్రతిపాదన కాకుండా, 45 రోజుల ప్రతిపాదన వస్తే ఎక్కువ మంది ఒప్పుకునే అవకాశం ఉందనేది ఒక అభిప్రాయం. పైగా సిబ్బంది మరో విషయంలోనూ భయపడ్డారు.
ఇవి కూడా చదవండి :
జన్మదిన ప్రత్యేకం : షట్ సత్ గుణ సంపన్నుడు నరేంద్ర మోడీ
ఈనాడు కార్టూనిస్ట్ శ్రీధర్ :: నాణేనికి ఆవలి వైపు..!
కొత్త వ్యాపకం వెతుక్కున్న కార్టూనిస్ట్ శ్రీధర్
వీఆర్ఎస్ ప్రతిపాదనను అధికారికంగా నోటీసు బోర్డులో పెట్టాలనేది ఉద్యోగుల డిమాండ్. అలా నోటీసుబోర్డులో పెడితే.. లేబర్ లా వర్తిస్తుందని, దానికి అనుగుణంగా చేయాల్సివస్తుందని.. ఆ చికాకులు ఏవీ లేకుండా మౌఖిక ప్రతిపాదనతోనే వారిని రాజీనామాలు చేయించి.. సొమ్ము చెల్లించాలనేది సంస్థ ఆలోచన. నోటీసుబోర్డులో పెడితే.. చాలాకాలంగా పెండింగ్ లో ఉన్న డీఏ చెల్లింపుల వ్యవహారం కూడా తెరమీదకు వస్తుందని ఆలోచిస్తున్నారు. నోటీసుబోర్డు వరకు వెళితే.. సంస్థ నుంచి పొందే సొమ్ము ఉద్యోగుల హక్కుగా ఉంటుంది. మౌఖిక ప్రతిపాదనకు ఒప్పుకుని రాజీనామా చేస్తే.. వారికి యిచ్చే మొత్తం సంస్థ యొక్క ఔదార్యంగా ఉంటుంది.
నిజం చెప్పాలంటే ‘ముట్టగల సొమ్ము ఎంత’ అనే విషయంలో ఏకాభిప్రాయం కుదిరి, పేచీ లేనప్పుడు అది హక్కుగా దక్కినా, ఔదార్యంగా పుచ్చుకున్నా పట్టించుకోనక్కర్లేదు. కానీ వారు ప్రతిపాదించిన మొత్తాలకే సిబ్బంది పెద్దగా స్పందించలేదు.
200 మందినైనా తగ్గించాలని సంస్థ అనుకుని, సెప్టెంబరు 20వ తేదీలోగా తమ అభిప్రాయం చెప్పాలని ప్రతిపాదిస్తే.. ఇప్పటిదాకా 10-20 మందికి మించి స్పందించలేదు. దీంతో సంస్థ పునరాలోచనలో పడింది. టర్మ్స్ అండ్ కండిషన్స్ మారే అవకాశం కూడా కనిపిస్తోంది.
మిగిలిన విభాగాల పరిస్థితి ఏంటి?
ఈనాడు దినపత్రిక ఎడిషన్ కుంచించుకుపోయి అన్ని విభాగాల మీద కూడా పని భారం తగ్గిన తర్వాత.. ఉద్యోగుల భారం సంస్థకు పెరిగినట్టే. మెషిన్ సెక్షన్లో విజయవంతంగా ఈ అనధికార వీఆర్ఎస్ అమలు అయితే గనుక.. ఒక్కటొక్కటిగా డెస్కుల్లోని జర్నలిస్టుల నుంచి, చివరికి ఎడ్మినిస్ట్రేషన్ లోని ఉద్యోగుల వరకు అందరికీ వర్తింపజేయాలని సంస్థ భావించింది. అయితే తొలి అడుగులోనే అనుకున్న దానికి భిన్నంగా స్పందనలు వస్తుండగా.. ఏం చేయాలా అనే పునరాలోచనలో ఉన్నారు.
మీనమేషాలు ఎందుకు?
పని తగ్గిన తర్వాత.. ఉద్యోగులను తగ్గించుకోవడం అనివార్యం. ఆ విషయంలో ఈనాడు ఇప్పటికే చాలా ఆలస్యం చేసిందని అనిపిస్తుంది. నిజానికి కరోనా అనంతర పరిణామాల వలన మాత్రమే కాకపోయినప్పటికీ.. వీఆర్ఎస్ అందుకుని, ఇతరత్రా స్థిరపడాలని ఉద్యోగుల్లోనూ చాలా మంది కుతూహలంగానే ఉన్నారు. కానీ వారి ఆశలకు, సంస్థ ప్రతిపాదనలకు మధ్య పొంతన కుదరడం లేదు. చాలా కాలంగా.. ఈనాడులో వీఆర్ఎస్ ఉంటుందనే మాట వినిపిస్తూనే ఉంది. కరోనాకు ముందు కాలంనుంచి ఇది వినవస్తోంది. ఇప్పుడు కరోనా తర్వాత.. కళ్లముందే ఉద్యోగుల్లో చాలా మంది పనిలేకుండా కూర్చుంటుండగా.. సంస్థ మీద ఒత్తిడి పెరిగి ప్రతిపాదనలదాకా వచ్చింది. వీఆర్ఎస్ డీల్ లో మార్పులు జరిగితే తప్ప.. సిబ్బంది ఉత్సాహంగా రాజీనామాలు చేయకపోవచ్చు.
జాగు చేసే కొద్దీ సంస్థకు నష్టం..
ఉద్యోగులకు పనిలేదని, వారిని వదిలించుకోవాలని ఒకసారి సంస్థ నిర్ణయించిన తర్వాత.. ఎంత త్వరగా వదిలించుకుంటే అంత మంచిది. ఆ సంగతి సంస్థకు స్వానుభవంలో ఉన్నదే. ఆధునిక సాంకేతికత- ప్రింటింగ్ ఇండస్ట్రీ రూపురేఖలను మార్చేస్తున్న సంధియుగంలో.. ప్రాసెస్ డిపార్ట్మెంట్ అనేది అవసరం లేని విభాగంగా తయారైంది. వారిని వీఆర్ఎస్ ద్వారా మాన్పించాలని అనుకున్నారు. సంస్థ ఆఫర్ చేసిన మొత్తానికి, ఉద్యోగులు డిమాండ్ చేసిన మొత్తానికి చాలా తేడా వచ్చింది. కొందరు రాజీనామా చేశారు. ప్రాసెస్ ఉద్యోగుల్లో కొందరు రాజీనామా చేయకుండా కోర్టుకు వెళ్లారు. సంస్థ అప్పటికి- వదిలించుకునే ఆలోచన వాయిదా వేసుకుంది. సుమారు అయిదారేళ్లుగా ఆ విభాగానికి చెందిన ఆ ఉద్యోగులు ఏమాత్రం పనీ లేకుండా ఉద్యోగాల్లో కొనసాగుతున్నారు. జీతాలు తీసుకుంటున్నారు. ఆ రోజున వారు డిమాండ్ చేసిన మొత్తాలకంటె.. ఇప్పటిదాకా సంస్థ వారికి జీతాల రూపేణా చెల్లించిన మొత్తం చాలా ఎక్కువ. ఇలాంటి లాభనష్టాలను సహేతుకంగా బేరీజు వేసుకుంటే.. ఒకసారి డిసైడ్ అయిన తర్వాత.. భారంగా మారిన అదనపు ఉద్యోగులను ఎంత త్వరగా వదిలించుకుంటే అంత మంచిదని.. జాగు చేసే కొద్దీ.. సంస్థకే నష్టమని వారికి అర్థమవుతుంది.
ఇప్పుడు ప్రతిపాదించిన వీఆర్ఎస్ డీల్ విషయంలో ఉద్యోగులు దిగివస్తారని సంస్థ ఎదురుచూడడం కూడా దండగ. ఒకసారి సిబ్బందిని తగ్గించదలచుకున్నా.. ఎంత ఎక్కువ కాలం సాగదీస్తే సంస్థకే అంత నష్టం. సంస్థ ఒక మెట్టు దిగి, డీల్ లో మార్పులు చేసి పునఃప్రతిపాదించవచ్చు. ఏది ఏమైనా అటు ఉద్యోగులు, ఇటు సంస్థ ఉభయులకు ప్రయోజనకరమైన డీల్ కుదురుతుందనే ఆశించవచ్చు. ఒకసారి డీల్ ఓకే అయితే.. ఎడిషన్ చిక్కిపోయినంత సులువుగా, ఈనాడు కార్యాలయాల్లో ఇతర విభాగాల్లోనూ కలిపి ఉద్యోగుల సాంద్రత కూడా పలచబడిపోతుంది. ఈ విషయంలోనూ.. ఈనాడు మళ్లీ తెలుగునాట ఇతర పత్రికలకు మార్గదర్శనం చేస్తుంది. అచ్చంగా ఇదే బాటలో కాకపోయినా.. ఏదో ఒకరీతిగా అన్ని పత్రికలూ ఉద్యోగులను వదిలించుకునే పనిని ప్రారంభిస్తాయి.
.

Discussion about this post