వర్చువల్ మరియు ప్రత్యక్ష విధానాలను సమ్మిళితం చేస్తూ తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న రెండు రోజుల మహానాడు కార్యక్రమంలో తొలి రోజు లోకేష్ మహిళలకు ప్రకటించిన వరం తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో ఒక మైలు రాయి లాంటిది. చట్టసభలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే చట్టం అమలులోకి వచ్చినా, రాకపోయినా.. కేంద్ర ప్రభుత్వం సంకల్పిస్తున్నట్లుగా ఆ చట్టం అమలు చేయడానికి వీలుగా డి లిమిటేషన్ ప్రక్రియ లోక్సభ ఆమోదం పొందినా పొందకపోయినా.. ఇకపై వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ 33 శాతం సీట్లు మహిళలకు కేటాయిస్తుందని జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రకటించడం అభినందనీయం.
ఈ ప్రకటన ద్వారా నారా లోకేష్ తెలుగు రాష్ట్రాలలోని మిగిలిన అన్ని పార్టీలకు, ఆ మాటకొస్తే భారతీయ జనతా పార్టీతో సహా దేశంలోని అన్ని పార్టీల కంటే ఒక అడుగు ముందే వేశారని ఒప్పుకోవాల్సిందే. ఈ మాట ద్వారా ఆయన అన్ని పార్టీలకు ఒక బెంచ్ మార్క్ ఏర్పాటు చేశారు. పార్టీలన్నీ ఇప్పుడు ఆ బెంచ్ మార్కును అందుకోవడానికి దానిని అధిగమించి ముందుకు వెళ్లడానికి తమ తంటాలు తాము పడాల్సి ఉంటుంది.
మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే చట్టం సభ ఆమోదం పొంది చాలాకాలం అయింది. 2029 ఎన్నికల నాటికి ఈ మహిళా రిజర్వేషన్ చట్టాన్ని కార్యరూపంలోకి తెస్తామని కేంద్రం ఇటీవలే ప్రకటించింది. చట్టంలో ఉన్న మెలిక కోసం ఈలోగా డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తి చేయడానికి కొత్త బిల్లు రూపొందించి సభ ముందు పెట్టింది. దేశంలోని అన్ని రాష్ట్రాలకు సమాన నిష్పత్తిలో 50% లోక్సభ ఎంపీ సీట్లు పెంచుతూ ముసాయిదాని రూపొందించారు. ఈ బిల్లు లోక్ సభలో వీగిపోయిన తరువాత.. డీలిమిటేషన్ కమిటీ ఏర్పాటు తదితర వ్యవహారాలకు సంబంధించిన మరో రెండు బిల్లులుసహా అన్నింటిని కేంద్రం ఉపసంహరించుకుంది. నిజంగా రాజకీయాలలో మహిళలకు ప్రోత్సాహం అందించాలనే చిత్తశుద్ధి పార్టీలకు ఉండాలే గాని, అందుకోసం నిర్దిష్టంగా ఒక చట్టం అవసరం అనుకోవడం భ్రమ. రాజకీయ పార్టీలు చట్టసభల ఎన్నికల సమయంలో తమ తమ పార్టీల తరఫున 33 శాతం సీట్లు మహిళలకు కేటాయిస్తే చాలు! మహిళా వర్గాన్ని రాజకీయంగా ప్రోత్సహించడంలో వారి చిత్తశుద్ధి వ్యక్తం అవుతుంది. అయితే చట్టం గత ఎన్నికలకు ముందే సభామోదం పొందినప్పటికీ గత ఎన్నికల్లో ఎవరూ ఈ అంశాన్ని పట్టించుకోలేదు. ఇప్పుడు లోక్సభలో బిల్లు వీగిపోయిన తర్వాత కూడా మహిళా రిజర్వేషన్ల గురించి ఎవరు సీరియస్ గా మాట్లాడటం లేదు.
ఇలాంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకే మహానాడు తొలి రోజున ఈ వరం ప్రకటించడం గొప్ప విషయమే. ఇతరులకు అనుసరణీయం కాగల నిర్ణయం ఇది. రాష్ట్రంలోని ఇతర పార్టీలు కూడా ప్రధానంగా ప్రతిపక్షం వైయస్సార్ కాంగ్రెస్ కూడా తమ అస్తిత్వ పరిరక్షణ కోసం ఇదే తరహా ప్రకటనను చేయక తప్పని పరిస్థితిని లోకేష్ సృష్టించారు. ఇప్పటిదాకా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ కూడా ఇంతటి విస్పష్టమైన ప్రకటన చేసింది లేదు. కాకపోతే వచ్చే ఎన్నికలలోగా మరోసారి డీలిమిటేషన్ బిల్లును సభ ముందుకు తెచ్చి, ఆమోదింపజేసి ఆ ఎన్నికలనాటికి తాము ప్రకటించినట్లుగా మహిళలందరికీ చట్టప్రకారం 33% రిజర్వేషన్ అందుబాటులోకి తేవాలని బిజెపి అనుకుంటోంది. ఏది ఏమైనాప్పటికీ ఆ చట్టం అమలైనా కాకపోయినా డీ లిమిటేషన్ జరిగినా జరగకపోయినా తెలుగుదేశం మాత్రం 33% సీట్లు మహిళలకు ఇస్తే యావత్ దేశంలో మహిళా లోకం వారికి నీరాజనం పడుతుందని చెప్పవచ్చు. అనివార్యంగా దేశంలోని అన్ని పార్టీలో వీరిబాటను అనుసరించాల్సిన పరిస్థితి వస్తుంది.
.
Discussion about this post