‘ఎప్పుడు వచ్చాం అనేది కాదన్నయ్యా.. బుల్లెట్ దిగిందా లేదా’ అనే డైలాగు చాలా మందికి ఇష్టం. చాలా లోతైన అర్థం ఉన్న, పదునైన డైలాగు అది. ఆ సినిమాకు సంభాషణలు రాసినందుకు పూరీ జగన్నాధ్ నంది అవార్డు కూడా అందుకున్నాడు. ‘ఫలితం మాత్రమే ముఖ్యం, దానికోసం అనుసరించే పథకంగానీ, పథం గానీ ముఖ్యం కాదు’ అనే సూత్రం చెబుతుంది ఈ డైలాగు.
‘సక్సెస్ సాధించామా లేదా?’ ఇదే ముఖ్యం. వ్యక్తిత్వ వికాసం పేరిట సక్సెస్ మంత్రాలను బోధించే వాళ్లు మనకు వేలల్లో ఉంటారు. వాళ్లందరూ సక్సెస్ అనేది ఎంత ముఖ్యమో మనకు నేర్పుతారు. ఫలితం అనేది ఎంత పెద్దదిగా ఉంటే అంత గొప్ప అనే నీతిని కూడా చెబుతారు.
కానీ ఈ సుభాషితం కొంచెం భిన్నమైన భావాన్ని, భాష్యాన్ని మనకు చెబుతుంది.
అకృత్వా పరసంతాపం అగత్వా ఖలసంసదం
అనుత్సృజ్య సతాం ధర్మ యదల్పమపి తబ్దహు
ఇతరులకు బాధ కలిగించకుండా.. దుర్మార్గులతో స్నేహం చేయకుండా- కలిసి పనిచేయకుండా.. ధర్మాన్ని ఎప్పటికీ వీడకుండా.. ఉన్నప్పుడు దక్కే ఫలితం చాలా కొంచెమే అయినా సరే.. అదే చాలు. -అనేది శ్లోకభావం.
సంపాదన అనేది సన్మార్గంలో మాత్రమే ఉండాలంటుంది ఈ సుభాషితం. ఇతరులకు కష్టం కలిగించకూడదు, సంపాదన కోసం చెడ్డవారిని కలుపుకుపోకూడదు అని చెబుతుంది.
ధర్మమార్గం తప్పకూడదు అనే మాటను అందరూ ఒప్పుకుంటారు. అత్యంత అవినీతిపరులు, అక్రమార్కులు కూడా ఈ మాటను ఒప్పుకుంటారు.. తాము ధర్మమార్గం తప్పడం లేదనే అంటారు. కాబట్టి దాన్ని పక్కన బెట్టి మొదటి రెండు సంగతులు చూద్దాం.
మొదటి అంశం సంగతేమో గానీ.. రెండోది పాటించే విషయంలో చాలా మందికి రకరకాల భిన్నాభిప్రాయాలుంటాయి. అందరూ మంచివాళ్లనే ఏరుకుని.. వాళ్లతో మాత్రమే కలిసి పనిచేయాలంటే ఎలా కుదురుతుంది? అనేది మొదటి ప్రశ్న. నా పని సాగడానికి నేను చెడ్డవాళ్లతో కలిసి చేస్తుండవచ్చు గాక.. వారి చెడ్డతనంతో నాకు సంబంధం ఏమిటి? నేను చెడ్డగా చేయడం లేదు కద.. అని వాదించే వాళ్లుంటారు.
ఏ పనిచేసినా ఫలితం పెద్దదిగా ఉండాలనే అందరూ అనుకుంటారు. అందుకు అనేక రకాల కొత్త కొత్త మార్గాలను అన్వేషిస్తుంటారు. ఆ కొత్త మార్గాల అన్వేషణ సమయంలోనే ఈ జాగ్రత్తలను, హెచ్చరికలను మనం గుర్తుపెట్టుకోవడం అవసరం.
నిజానికి సక్సెస్ సాధించిన తర్వాత.. శిఖరాన్ని చేరుకున్న తరువాత.. వాడి విజయాన్ని యావత్ ప్రపంచం గుర్తిస్తుంది. కానీ.. ఆ శిఖరం మీదకు చేరుకోవడం వాడు అనుసరించిన మార్గం అతడి పూర్వాశ్రమాన్ని ఎరిగిన కొద్దిమందికి మాత్రమే తెలుస్తుంది. ఒకవేళ్ల వాళ్లు ఏదైనా విమర్శలు చేసినా.. ఓర్వలేక చెబుతున్న మాటలుగా కొట్టిపారేయడం చాలా సులువు. అంటే.. విజయం సాధించిన తర్వాత.. తతిమ్మా విషయాలేవీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు.
కానీ.. మనమందరం నమ్మే ఈ సిద్ధాంతానికి భిన్నంగా సుభాషితం ధర్మమార్గం గురించి చెబుతుంది. ఫలితం పెద్దదిగా ఉండాల్సిన అవసరం లేదు. కానీ అనుసరించే మార్గం సరైనదిగా ఉండాలని అంటుంది.
శుభోదయం.
EXCLUSIVE ARTICLES
సీనియర్ జర్నలిస్టు గోవిందరాజు చక్రధర్ వ్యాసాల ప్రత్యేకపేజీ కోసం క్లిక్ చేయండి
‘సుభాషితం’ సంస్కృతశ్లోకాలకు భావవివరణల వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు బీరక రవి ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు డాక్టర్ ఎస్ రాము ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
దేవీప్రసాద్ ఒబ్బు లోపలిమాట వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సంపాదకుడు సురేష్ పిళ్లె వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
Discussion about this post