మనిషి ఎప్పటికీ ఒంటరి కాదు. ఒక్కో సమయంలో బతుకు గమనానికి ఒక్కొక్కరి ఆసరా అవసరం అవుతుంది. వ్యక్తులు మాత్రమే కాదు నైపుణ్యాలు, ప్రతిభలు కూడా మనల్ని వేర్వేరు సందర్భాల్లో ఆదుకుంటూ ఉంటాయి. ఏవి ఎప్పుడు ఎలా మనకు అవసరమౌతాయో మన అవగాహనను బట్టి.. మిత్రుల్ని పెంచుకుంటూ పోవడం గానీ, నైపుణ్యాల్ని పెచుకోవడం గానీ మనం చేస్తుంటాం. చేయాలి.
పరిణామక్రమంలో ప్రాణులకు వాడుకకు అవసరమైన శరీరభాగాలు మాత్రం మిగిలిపోయి.. అనవసరమైన భాగాలు క్రమేపీ అంతరించిపోవడం వలనే.. జీవవైవిధ్యం ఏర్పడిందని చెప్పే ఒక సిద్ధాంతం ఉంటుంది. అలాగే జీవితగమనానికి ఏ సందర్భాల్లో అవసరమయ్యేవి ఏమిటో తెలుసుకుంటే వాటి పట్ల మన దృక్పథం మారుతుంది. అవి నైపుణ్యాలు అయితే అధ్యయనం, లక్షణాలు అయిదే సాధన, వ్యక్తులు అయితే ఆదరణ మనలో పెరుగుతాయి.
ఈ విషయంలో జీవితం గురించి స్పష్టత ఇచ్చే ఒక చిన్న శ్లోకం ఉంటుంది.
విద్యా మిత్రం ప్రవాసేషు భార్యా మిత్రం గృహేషు చ
వ్యాధితస్యౌషధం మిత్రం ధర్మోమిత్రం మృతస్య చ
ప్రవాసేషు అంటే అచ్చంగా ఇప్పుడు మనం పరిగణిస్తున్న అర్థంలో విదేశాలు అని మాత్రమే కాదు. మనది కాని ఇతర ప్రాంతాల్లో గడపడం ఏదైనా ప్రవాసమే. అలా ఇతర ప్రాంతాల్లో బతకవలసి వచ్చినప్పుడు విద్య మనకు ఫ్రెండ్ అవుతుంది. విద్య మనల్ని ఆదుకుంటుంది. మన చేతిలో ఒక విద్య ఉంటే.. భాష, ప్రాంతీయత, కులం, మతం వేటితోనూ నిమిత్తం లేకపోయినప్పటికీ.. ఒక కొత్త ప్రదేశంలో మనం మనుగడ సాధించగలం. విద్యమనకు అంతటి గొప్ప స్నేహితుడు అవుతుంది. ప్రవాసేషు విద్యా మిత్రం అంటే అదే.
అలాగే ‘భార్యామిత్రం గృహేషు చ’. ఇంటిలో భార్యను మించిన స్నేహితుడు ఉండరు. మన బాగోగుల గురించిన ధ్యాస భార్యకు ఉంటుంది. అలాగే వ్యాధి సోకినప్పుడు, అనారోగ్యం పాలైనప్పుడు.. ఔషధాన్ని మించిన ఫ్రెండ్ మరొకటి కాదు. ఇవన్నీ చెప్పిన తర్వాత.. ఈ శ్లోకంలో ముగింపు కీలకమైనది. ‘ధర్మోమిత్రం మృతస్య చ’ మరణ సమయానికి నీకు ఫ్రెండ్ గా ఉండగలిగేది ధర్మం మాత్రమే.. అని చెబుతుందీ శ్లోకం. అంటే వ్యక్తిలోని ధర్మానువర్తనం మాత్రమే.. మరణంచిన తర్వాత కూడా అతడి బాగు, క్షేమం కోరుతుంది. మరణం తర్వాత కూడా అతడికి మంచి స్నేహితుడిగా ఉండగలుగుతుంది అని భావం.
ఇవి కూడా చదవండి
జీవితపు వేర్వేరు దశలలో వేర్వేరు లక్షణాలు, గుణాలు, వ్యక్తులు మనకు స్నేహితులుగా ఉన్నప్పటికీ.. అంతిమంగా మరణసమయం వరకూ కూడా మనం తప్పనిసరిగా స్నేహితుడిగా పరిగణించాల్సింది ధర్మమే అని అర్థమవుతోంది.
ఈ శ్లోకాన్ని మరో దృష్టితో చూసినప్పుడు ఇంకోసంగతి అర్థమవుతుంది.
సాధారణంగా మనకు ‘మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ..’ అనే సూక్తులు తెలుసు. తల్లిని, తండ్రిని, టీచర్ ని దేవుడితో సమానంగా చూడాలని శాస్త్రం చెబుతుంది. అంటే అన్యాపదేశంగా.. దేవుడు అనే అస్తిత్వం ఈ ముగ్గురికంటె కూడా గొప్పది, విశిష్టమైనది అని చెప్పడమే కదా.
అలాంటి దృష్టితో చూసినప్పుడు.. ప్రవాసంలో విద్య గానీ, ఇంట్లో భార్య గానీ, రోగం సోకినప్పుడు మెడిసిన్ కానీ, చావునాటికి ధర్మం కానీ.. నీకు ‘‘స్నేహితుడు వంటివి’’ అని చెప్పడంలోనే.. వీటన్నింటికంటె కూడా.. స్నేహితుడు చాలా గొప్పవాడు అనే అర్థం పరోక్షంగా మనకు కనిపిస్తుంది.
మంచి స్నేహాలను ఎప్పటికీ పెంచుకుంటూ పోవాలి. జీవన మాధుర్యం మొత్తం అదులోనే ఉంటుంది.
.

Discussion about this post