తప్పుడు పనులు అనే పదం అంటే కాస్త మనకు నొప్పిగా అనిపిస్తుంది గానీ.. చేసే పనుల్లో తప్పులు తరచూ ఉంటాయి. మనం చేస్తున్న పని తప్పు అని తెలీకుండానే చేస్తుంటామా? తెలిసి చేసిన తప్పులు ఏవి? తెలియక చేసే తప్పులు ఏవి?
చాలా సందర్భాల్లో ఏదో తెలియక తప్పు చేశాడని మనం దాటవేస్తుంటాం. ఇతరుల విషయాల్లో మనం అలా భ్రమపడడంలో తప్పు లేదు. కానీ.. మన సొంత పనుల విషయంలో తెలిసి చేస్తున్నామో.. తెలియక చేస్తున్నామో.. బయటివారికంటె ఎక్కువ స్పష్టత మనకు ఉంటుంది కద. ఆత్మవంచన చేసుకోలేం. తెలిసి చేసే తప్పులను అదే పనిగా కొనసాగిస్తూ ఉంటే మాత్రం.. ఖచ్చితంగా పెద్ద తప్పు.
ఎంత పెద్ద తప్పో.. ఎంతటి దుర్మార్గులు ఆ రకంగా ప్రవర్తిస్తారో.. మనకు తెలియడానికి మహాభారత ప ప్రస్తావనతో ఒక మంచి శ్లోకం ఉంది.
జానామి ధర్మం న చ మే ప్రవృత్తిః
జానామి అధర్మం న చ మే నివృత్తిః
కేనాపి దేవేన హృది స్థితేన
యథా నియుక్తోస్మి తథా కరోమి
ధర్మం ఏమిటో నాకు తెలుసు. కానీ నేను దానిని అలవాటుగా మార్చుకోలేకపోతున్నాను. అధర్మం ఏమిటో కూడా నాకు తెలుసు. కానీ.. దాని నుంచి బయటకు రాలేకపోతున్నాను. హృదయంలో ఏ దేవుడైతే కొలువై ఉంటాడో.. వాడు నాతో ఏ పని చేయించదలచుకుంటే అదే చేస్తున్నాను. ..అనేది శ్లోకభావం.
మహాభారతంలో దుర్యోధనుడు చెప్పినట్లుగా ఈ శ్లోకం ప్రస్తావన మనకు కనిపిస్తుంది. రుషులు అడిగితే చెప్పాడని, ద్రౌపది అడిగితే చెప్పాడని, కృష్ణుడితో ఈ ముచ్చట పంచుకున్నాడని రకరకాల వాదనలు ఉన్నాయి. అసలు ఈ శ్లోకం ప్రస్తావన మహాభారతంలోనిది కాదని. మహాభారతం ఆధారంగా పుట్టిన ఇతర గ్రంథాలలోనిదనే వాదన కూడా ఉంది. ఏది ఏమైనప్పటికీ.. ఇది దుర్యోధనుడి మాటగా ప్రచారంలో ఉంది. అందుకే దర్యోధునుడు ఈ శ్లోకంలో ఏం చెబుతున్నాడో ఓసారి గమనిద్దాం.
ఏ నేపథ్యంలో ఈ మాటను దుర్యోధనుడు చెప్పవలసి వచ్చిందనే ప్రస్తావన కూడా తెలుసుకోవడం అవసరం. దుర్యోధనుడికి ఓ ప్రశ్న ఎదురైంది. ‘‘నువ్వు కూడా పాండవులలాగా (ధర్మరాజులాగా) ఒకే కులంలో పుట్టావు, ఒకే గురువు దగ్గర చదువుకున్నావు, ఒకే రకంగా విద్యలు అభ్యసించావు.. మరి ఇంత దుర్మార్గుడిగా ఎందుకు తయారయ్యావు?’’ అని! దానికి సమాధానమే ఈ శ్లోకం.
ఈ ప్రశ్నమాత్రం నిజమే. ఒకే రకం పుట్టుక, పెపంకం, పరిసరాలు, విద్య అనేవి.. ఏ ఇద్దరిలోనూ ఒకే రకంగా అభివృద్ధిని, వికాసాన్ని తీసుకురాలేవు. అలా జరిగేట్లయితే.. అత్యద్భుతమైన మేధావులు చదువుకున్న బడిలో అందరికీ అదే విద్యాబుద్ధులు రావాలి కదా! అసాధ్యం.
దుర్యోధనుడు చెప్పిన సమాధానాన్ని మనం రెండు భాగాలుగా గమనించాలి.. అర్థం చేసుకోవాలి.
మొదటి భాగం- అసలు హేతువు- అతడికి ధర్మం ఏమిటో తెలుసు, కానీ దాన్ని పాటించాలని, ఆచరించాలని, ధర్మబద్ధంగా నడుచుకోవాలని కోరిక లేదు. తాను నడుస్తున్న దారి అధర్మమార్గం అనే స్పృహ కూడా అతనికి ఉంది. కానీ.. దాన్నుంచి పక్కకు జరగాలంటే.. ఒక వెరపు. ఆ అధర్మమార్గంలో నడిచే తీరును, కలిగే స్వల్పసుఖాన్ని అతను ఆనందిస్తున్నాడు.
ఇలాంటి వాళ్లు మనకు మన చుట్టూ ఉన్న సమాజంలో వందలు వేలల్లో కనిపిస్తూ ఉంటారు. లంచాలు మరిగేవాళ్లు, దళారీ పనులు చేసేవాళ్లు, ఇతరులను వేధించేవాళ్లు, ఇతరుల మీద కుట్రలు చేసేవాళ్లు, మరొకరిని చూసి ఓర్వలేని వాళ్లు అనేకులు మనకు కనిపిస్తుంటారు. ముందే చెప్పుకున్నట్టు తెలియక చేసే తప్పులు చాలా స్వల్పంగా ఎప్పుడో ఒకసారి మాత్రమే జరుగుతుంటాయి. కానీ.. ఈ జాబితాలో.. తెలియక చేసే తప్పులు ఏవి? అన్నీ తెలిసి తెలిసీ చేసేవే. తాను చేసే పని అధర్మం అని తెలియకుండా.. ఏ ఒక్కడూ లంచం అడగడం లేదు. తెలిసినా మంచి దారి తొక్కడం లేదు, తెలిసినా చెడు దారి వీడడం లేదు.
రెండో భాగం- తాను ఆ రకంగా ఎందుకు ప్రవర్తిస్తున్నానో చెప్పుకున్నాడు దుర్యోధనుడు. తన అంతరంగంలో, హృదయంలో కొలువైన దేవుడు.. తనను ఏ రకంగా నడిపిస్తే అలా చేస్తున్నాడట. ఇది దుర్యోధనుడి శైలి పలాయనవాదం. తన చేతగానితనానికి హృదయంలోని దేవుడి పేరిట ముసుగు వేసుకుంటున్నాడు. తప్పించుకోవాలని చూస్తున్నాడు.
మన చుట్టూ కనిపించే వందలు వేల మందిలో అందరూ ఇలాంటివాళ్లే. ప్రతి ఒక్కడూ తను చేసే పనిని సమర్థించుకోవడం, దానికి అనుకూలంగా ఒక తర్కం నిర్మించుకోవడం నేర్చుకున్నాడు. అది తప్పుకాదని చెప్పడం నేర్చుకున్నాడు. ఈ తరహాలో అత్యంత నీచమైన వాదన ఏంటంటే… ‘ఏం నేనొక్కడినే చేస్తున్నానా?’ అంటాడు.
మనచుట్టూ కనిపించే ఇలాంటి వాళ్లందరూ కూడా దుర్యోధనుడి స్వరూపాలే. అతడి ఆత్మస్వభావాన్ని పుణికి పుచ్చుకున్న వాళ్లే. దుర్యోధనుడు ఆ మాటలతో తప్పించుకోజూడవచ్చు గాక.. కానీ.. మనం ఎవరినుంచి తప్పించుకోవాలనుకుంటున్నాం. మనం చేసే తప్పులు మన ఆత్మసాక్షికి చాలా స్పష్టంగా తెలుసు కద. కాబట్టి ఈ రెండో భాగంలోని బుకాయింపు మాటల అవసరమే రాకుండా.. తప్పొప్పుల గురించిన విచక్షణతో నడుచుకోవడం మంచిది.
శుభోదయం.
Discussion about this post