పశ్చిమ బెంగాల్ ఎన్నికలు ఇప్పుడు.. అనేక మంది భవిష్యత్తును నిర్దేశించబోతున్నాయి. అదేమిటి.. మహా అయితే అక్కడి ఎన్నికలు ప్రస్తుతం రాజ్యం చేస్తున్న మమతా దీదీ భవిష్యత్తును గానీ, అక్కడ రాజ్యం చేయాలని కలలు కంటున్న బీజేపీ #moditeam భవిష్యత్తును మాత్రమే డిసైడ్ చేయగలవు గానీ… ఎంతో మంది భవిష్యత్తును ఎలా నిర్దేశిస్తాయి.. అని మీకు సందేహం కలుగుతోంది కదా..! భవిష్యత్తు తేలబోయే వారి జాబితాలో ఇప్పుడు ఎన్నికల వ్యూహనిపుణుడు కూడా చేరుతున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించారు.
తన కెరీర్ ప్రారంభంలో నరేంద్ర మోదీ కోసం చెమటోడ్చి పనిచేసిన ప్రశాంత్ కిషోర్.. తర్వాతి కాలంలో మోదీ ద్వేషిగా మారిన సంగతి అందరికీ తెలిసిందే. మోడీ వ్యతిరేక పార్టీలకు ఆయన మరింత మనసుపెట్టి పనిచేస్తూ.. వారి విజయానికి దోహదపడుతుంటారు. ఏపీలో జగన్ కు అనుకూలంగా తన టీమ్లతో పనిచేసిన పీకే.. ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో మమతా దీదీ విజయం కోసం పరిశ్రమిస్తున్నారు.
త్వరలో జరగబోతున్న ఎన్నికల్లో మమతా బెనర్జీ విజయం ఖాయం అని ప్రశాంత్ కిషోర్ చెబుతున్నారు. ఈ రాష్ట్రంలో మమత ఓటమిని ఖాయం చేస్తామని బీజేపీ గొప్పలు చెప్పుకుంటోంది. అయితే పశ్చిమ బెంగాల్ ఎన్నికల విషయంలో వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ మళ్లీ అధికారాన్ని కైవసం చేసుకుంటుందని భరోసా వ్యక్తం చేశారు. ఆయన ఆమెకు అనుకూలంగా పని చేస్తున్నారు గనుక.. ఆమె విజయం గురించి ధీమా వ్యక్తం చేయడంలో విశేషం లేదని అనుకోవచ్చు. కానీ.. ఆ విజయానికి తన కెరీర్కు కూడా ఆయన ముడిపెట్టారు.
ఒకవేళ బీజేపీ గనక బెంగాల్లో అధికారంలోకి వస్తే ప్రస్తుతం చేస్తున్న వృత్తి నుంచి పూర్తిగా తప్పుకుంటానని కూడా పీకే అన్నారు.
ఇందులో రెండు అంశాలు కనిపిస్తున్నాయి! మమత గెలుస్తుందని ఆయన అంటున్నారు గానీ.. తన రిటైర్మెంటుకు మాత్రం.. బీజేపీ అధికారంలోకి రావడంతో ముడిపెడుతున్నారు. అంటే.. సీట్లు గెలిచినా సరే.. బీజేపీ అధికారంలోకి రాకపోతే.. రాకుండా చేయగలిగితే.. తన ప్రతిజ్ఞకు ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నట్టు కనిపిస్తోంది. మమత సొంత బలంతో అధికారంలోకి రాకపోతే గనుక.. తను తన వృత్తినుంచి తప్పుకుంటానని ఆయన అనిఉంటే ఆ సవాలు కాస్త గట్టిగా ఉండేది. ఆయన ఇలా మెలికపెట్టి చెప్పడం వలన.. బహుశా మమతకు సీట్లు తగ్గిపోతాయి గానీ.. బీజేపీ అధికారంలోకి రావడం కష్టమేమో అని పీకే మాటల్ని బట్టి అనిపిస్తోంది.
.