చంద్రబాబు సీఎం కావడం ఖాయం
– టిడిపి ప్రతినిధి సుధాకర్ రెడ్డి ధీమా
వచ్చే ఎన్నికల్లో పులివెందులలో సీఎం జగన్ మోహన్ రెడ్డి, పుంగనూరులో మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రెడ్డి ఓటమి ఖాయమని టిడిపి అధికార ప్రతినిధి, పుంగనూరు పరిశీలకుడు డాక్టర్ ఎన్ బి సుధాకర్ ధీమా వ్యక్తం చేశారు. ఉగాది సందర్భంగా తాను ఈ రాజకీయ విశ్లేషణ చేస్తున్నానని చెప్పారు. ఇద్దరు నేతలు ఇంతకాలం ప్రజలను భయపెట్టి, డబ్బు పంచి, ప్రలోభ పరచి గెలిచేవారని తెలిపారు.
అయితే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థికి వచ్చిన ఓట్లను పరిశీలిస్తే రెండు నియోజక వర్గాలలో ప్రజలు ఇద్దరు నేతలకు వ్యతిరేకంగా ఉన్నారని తేలిపోయిందని చెప్పారు. ఈ విషయం గ్రహించని వైకాపా నేతలు 175 స్థానాలలో గెలుస్తామని, కుప్పంలో చంద్రబాబును ఓడిస్తామని కోతలు కోస్తున్నారని హేళన చేశారు. జగన్ బాబాయి వై ఎస్ వివేకానంద రెడ్డిని ఎవరు చంపించారో పులివెందుల ప్రజలు అందరికీ తెలుసన్నారు.
జగన్ రాజకీయాల కోసం తల్లి, చెల్లిని కూడా ఇంటి నుంచి పంపేయడాన్ని పులివెందుల ప్రజలు వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. నియోజక వర్గం ప్రజలు గతంలో వై ఎస్ రాజశేఖర రెడ్డిని నేరుగా కలిసే వారని,ఇప్పుడు జగన్ దర్శనమే గఘనమం అయ్యిందని చెప్పారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో జగన్ ను ఓడించాలని ప్రజలు ఎదురు చూస్తున్నారని వివరించారు. పుంగనూరు ప్రజలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పట్ల తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారని చెప్పారు.
ఆయన ప్రజల అభివృద్ది కంటే స్వంత వ్యాపారాలపై ఎక్కువ శ్రద్ద చూపుతున్నారని చెప్పారు ఆయన అభివృద్ది మరచి అక్రమార్కుల కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. ఈసారి ఎన్నికల్లో ఆయనను పుంగనూరు ప్రజలే ఓడిస్తారని జోస్యం చెప్పారు. కుప్పంలో ఈ సారి చంద్రబాబు లక్ష ఓట్ల మెజారిటీ సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు.
ఉమ్మడి కడప, చిత్తూరు జిల్లాలలో 1983, 1994 ఎన్నికల ఫలితాలు పునరావృతం అవుతాయని అన్నారు. రాష్ట్రంలో టిడిపి భారీ మెజారిటీ సాధిస్తుందని, తిరిగి చంద్రబాబు ముఖ్య మంత్రి కావడం ఖాయం అన్నారు.
.

Discussion about this post