కొన్ని విషయాల్లో నాయకుల మధ్య పార్టీల తేడా ఉంటుందే తప్ప.. వారి ఎప్రోచ్లో తేడా ఉండదు. మక్కీకి మక్కీగా నాయకులు అందరూ ఇదేరీతిగా ప్రవర్తిస్తారేమో అనిపించేలా ఉంటుంది. ఇప్పుడు గుంటూరులో జైల్ భరో పేరిట ఆందోళనలు చేసిన అమరావతి రైతులు, మహిళలు, తెలుగుదేశం నాయకుల పట్ల అధికార పార్టీ వ్యవహరించిన తీరు చూస్తే అలాగే అనిపిస్తుంది. మహిళల పట్ల దారుణంగా వ్యవహరిస్తూ.. వారిని ఈడ్చి పారేస్తూ పోలీసులు దుర్మార్గంగా వ్యవహరించారు. దీనికి సంబంధించిన దృశ్యాలన్నీవైరల్ అయ్యాయి. పోలీసులు మరీ ఇంత దారుణంగా మనుషుల్ని డీల్ చేస్తారా? అని చూసిన వారు ఆశ్చర్యపోయేలా జరిగింది.
ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే లేదా, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఒక వర్గానికి నచ్చకపోతే గనుక.. తమ వ్యతిరేకతను బయటపెట్టుకోవడానికి నిరసన ప్రదర్శనలు, ఆందోళనలు చాలా సహజం. పైగా ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటివి లేకపోతే.. అది ప్రజాస్వామ్యం అనే భావనే మనకు కలగదు. కానీ.. ప్రభుత్వాలు తమ వ్యతిరేకంగా ఒక్కరు గళమెత్తినా సహించలేకపోతున్నాయి. గతంలో కొన్ని ప్రజాందోళనల విషయంలో చంద్రబాబునాయుడు ప్రభుత్వం ఎలా ప్రవర్తించిందో.. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా అలాగే ప్రవర్తిస్తున్నారు.
గతంలో అంగన్ వాడీలు ఉద్యమించినప్పుడు గానీ, ఏఎన్ఎంలు ఉద్యమించినప్పుడు గానీ చంద్రబాబునాయుడు ప్రభుత్వం ఆ పోరాటాలను ఉక్కుపాదాలతో అణచివేయడానికి ప్రయత్నించింది. అమానుషంగా ప్రవర్తించారు. ఇప్పుడు అమరావతి రైతులు జైల్ భరోకు పిలుపు ఇస్తే.. ఆ ఉద్యమం పట్ల జగన్ సర్కారు అంతే అమానుషంగా వ్యవహరించింది.
ముమ్మాటికీ తప్పే..
రాష్ట్రానికి మూడు రాజధానులు మాత్రమే కావాలి.. రాజధాని అమరావతిలో ఉండొద్దు అంటూ అమరావతిలో ఎవరైనా దీక్షలు చేస్తే.. దాని వెనుక వైసీపీ నాయకులు ఉండి నడిపిస్తారని.. పసిపిల్లలను అడిగినా ఇట్టే చెప్పేస్తారు. అలాంటి రాజకీయ ప్రేరేపిత దీక్షలు చేసే వారిని రైతులు అడ్డుకున్నారు. అందుకు వారిపై కేసులు నమోదు అయ్యాయి. అరెస్టు చేశారు. కానీ జైలుకు తరలించేప్పుడు చేతులకు బేడీలు వేయడం ముమ్మాటికీ తప్పే. అందుకే పోలీసులు సస్పెండు కూడా అయ్యారు.
(ఇదీ చదవండి : పవన్కల్యాణ్ ను బతిమాలుకుంటున్న బీజేపీ )
అయితే ఈ బేడీల్లోంచి రాజకీయ ప్రయోజనాన్ని పార్టీలు, అమరావతి పోరాటానికి రాష్ట్రవ్యాప్త సానుభూతిని అక్కడి ఉద్యమకారులు ఆశించారు. అందుకోసం జైల్ భరోకు పిలుపు ఇచ్చారు. ఇది కాస్తా రక్తసిక్తం కూడా అయింది. లాఠీచార్జిలు జరగలేదు గానీ.. పోలీసుల అమానుషత్వం బయటపడింది.
ప్రభుత్వానికి బాధ్యతలేదా?
ఉద్యమకారులు ప్రవర్తించిన తీరును బట్టి.. పోలీసులు స్పందిస్తారు.. ఇది అక్కడికక్కడ జరిగే వ్యవహారం దానికి ప్రభుత్వం ఎలా బాధ్యత తీసుకుంటుంది అని తేల్చేయడానికి వీల్లేదు. అసలు ఇలాంటి ఉద్యమానికి మూలకారణమైన వ్యవహారం వెనుక ప్రభుత్వంలో ఉన్న పార్టీనే ఉన్నదని అందరూ అనుకుంటున్నప్పుడు.. సదరు ప్రభుత్వాన్ని సంతృప్తి పరచడానికి పోలీసు బలగాలు ఇతోధికంగా చేసిన కృషిలో భాగమే ఇలా ప్రవర్తించడం. కాబట్టి జరిగిన దానికి ప్రభుత్వం బాధ్యత వహించాల్సిందే.
ప్రజలు జగన్ను సీఎం చేసింది ఇందుకేనా?
చంద్రబాబునాయుడు కూడా గతంలో ఇలాగే చేశారు.. హౌస్ అరెస్టులు, పోరాటాలను పోలీసు బలంతో అణచివేయడం అప్పుడు కూడా జరిగాయి. ఇప్పుడు కూడా సేమ్ టూ సేమ్ అవే జరుగుతున్నాయి. కాబట్టి ఈ ప్రభుత్వం చేసిన తప్పేముంది అనడానికి వీల్లేదు. చంద్రబాబు నాయుడు అడుగుజాడల్లో నడవడానికి, ఆయనను ఫాలో అయిపోవడానికి రాష్ట్ర ప్రజలు జగన్ను గెలిపించలేదు. ఆయన చేసింది కరెక్టే అనుకుంటే ఆయననే గెలిపించి ఉండేవారు. ఆయన చేసినట్టే మేం కూడా చేస్తాం.. ఆయన అణిచేసినట్టే.. మేం కూడా అణిచేస్తాం అని జగన్ సర్కారు భావిస్తే గనుక.. ఆయనను ఓడించినట్టే రేపు జగన్కు కూడా చేటు తప్పదు. ఆ సంగతి స్పష్టంగా తెలుసుకుని ప్రభుత్వం వ్యవహరించాలి.
.

Discussion about this post