పంజాబ్ సంఘటన విషయంలో జనసేనాని పవన్ కల్యాణ్ కూడా ఒక పత్రికాప్రకటన విడుదల చేశారు. ఈ సంఘటన దురదృష్టకరం అని పవన్ పేర్కొన్నారు. ఇలా జరిగి ఉండాల్సింది కాదన్నారు. ప్రధాని మాత్రమే కాదు, రాజ్యాంగబద్ధ అత్యున్నత పదవుల్లో ఉండే ఏ ఒక్కరికి కూడా ఇలాంటి అనుభవం మళ్లీ రాకూడదని కోరుకున్నారు.
ఇదంతా బాగానే ఉంది. కానీ.. ఆ ప్రకటనలో పవన్ కల్యాణ్ భారతీయ జనతా పార్టీ వాదనతో విభేదించారు. ఆ పార్టీతో పొత్తు పెట్టుకుని ముందుకు సాగుతున్నప్పటికీ.. ఎన్డీయేలో తానుకూడా భాగస్వామి అయినప్పటికీ.. ఆయన పంజాబ్ ఘటన గురించి బీజేపీ చేస్తున్న వాదనతో విభేదించడం విశేషం.
పంజాబ్ ఘటనను ప్రధాని నరేంద్రమోడీ హత్యకు జరిగిన కుట్ర స్థాయిలో అభివర్ణించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. తద్వారా వారు పొలిటికల్ మైలేజీ ఆశిస్తుండవచ్చు. ఇక్కడ ‘‘కాంగ్రెస్ పార్టీ వారు ప్రధానిని హత్య చేయడానికి చేసిన ప్రయత్నం బెడిసి కొట్టిందని’’ అర్థం వచ్చేలా.. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేసిన వ్యాఖ్యలు కూడా పరిగణనలోకి తీసుకోవాలి.
అయితే ఆయన బిజెపి వారి వాదనతో ఏకీభవించలేదు. ‘‘ఈ దుస్సంఘటన కావాలని చేసినట్టు నేను భావించడం లేదు’’ అని పవన్ కల్యాణ్ విస్పష్టంగా పేర్కొన్నారు. పంజాబ్ ప్రభుత్వ వైఫల్యాన్ని తప్పుపడుతూనే.. బిజెపి ఆశిస్తున్న రాజకీయ లబ్ధికి జై కొట్టకుండా.. పవన్ కల్యాణ్ చాలా బ్యాలెన్స్డ్గా మాట్లాడడం విశేషం.
అసలే పవన్ కల్యాణ్ తో బీజేపీ సంబంధ బాంధవ్యాలు మరీ అంత గొప్పగా ఏమీ లేవు. అలాంటి నేపథ్యంలో వారు ఆశిస్తున్న మైలేజీకి గండి కొట్టేలా.. వారి వాదనలను ప్రజలు అపనమ్మకంతో చూసేలా.. పవన్ వ్యాఖ్యనించడం గమనార్హం.
పవన్ కల్యాణం విడుదల చేసిన పత్రికా ప్రకటన పూర్తిపాఠం:
పంజాబ్ సంఘటన దురదృష్టకరం
‘‘పంజాబ్ రాష్ట్రంలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి ఎదురైన సంఘటనను దురదృష్ణకరంగా భావిస్తున్నాను. దేశ ప్రధాని ప్రయాణంలో 20 నిమిషాలపాటు ముందుకు వెళ్లలేక రోడ్డుపైనే ఆయన కారు నిలిచిపోయే పరిస్థితి అవాంఛనీయం. ప్రజాస్వామ్యంలో నిరసన వ్యక్తం చేయడం ప్రజల హక్కే అయినప్పటికీ ప్రధాని భద్రతకు ఇబ్బంది కలిగేలా ఆ నిరసన ఉండరాదని భావిస్తున్నాను. ఎటువంటి పరిస్థితులలోనూ ప్రధాన మంత్రి గౌరవానికి భంగకరంగా ఏ పార్టీ ప్రభుత్వమైనా, ఎటువంటి వ్యక్తులైనా ప్రవర్తించరాదు. ప్రధాన మంత్రిని గౌరవించడం అంటే మన జాతిని, మన దేశాన్ని గౌరవించడమే. ఈ దుస్సంఘటన కావాలని చేసినట్లు నేను భావించడం లేదు. అయితే ప్రధాన మంత్రి ఇతర రాష్ట్రాలలో పర్యటనకు వచ్చినప్పుడు ప్రోటోకాల్స్ ను తు.చ. తప్పకుండా పాటించవలసిన బాధ్యత ఆయా రాష్ట్రాలపైనే ఉంటుంది. ఇది సర్వవిదితమే. మరోసారి ప్రధాన మంత్రికిగానీ, అత్యంత బాధ్యతాయుతమైన రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారెవరికీ ఇటువంటి పరిస్థితి ఎదురుకాకూడదని కోరుకుంటున్నాను. క్లిష్ట పరిస్థితుల్లో సంయమనం పాటించిన శ్రీ నరేంద్ర మోదీ గారికి గౌరవపూర్వక అభినందనలు తెలియచేస్తున్నాను.’’
.

Discussion about this post