మంత్రిగా నారా లోకేష్ పనితీరు ఎలా ఉన్నదంటే.. ప్రస్తుతానికి మంచి మార్కులే వస్తాయి. విద్యారంగాన్ని పునర్వ్యవస్థీకరించే ప్రయత్నంలో గానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అనుకూల అంశాలను ప్రపంచ యవనికపై విస్తృతంగా ప్రచారం చేస్తూ పెట్టుబడులను ఆకర్షించడంలో గానీ, సామాజిక సమస్యలకు బాధ్యతగా స్పందించడంలో గానీ అనేక రకాలుగా నారా లోకేష్ మెరుగైన పనితీరు కనబరుస్తున్నారు. కానీ ఆయన విద్యాశాఖ మంత్రిగా ప్రతిభను మరింతగా నిరూపించుకోవాల్సిన సమయం ఇప్పుడు వేచి ఉంది.
విద్యాశాఖ మంత్రిగా ఆ రంగాన్ని బాగుపరచడం అంటే కేవలం నూరు శాతం ఫలితాలు సాధించడం.. సర్కారు స్కూళ్ళ స్థితిగతులను మెరుగుపరచడం మాత్రమే అనుకుంటే సరిపోదు. వీటికి తగ్గట్లుగా ప్రభుత్వ స్కూళ్లలో అడ్మిషన్లను గణనీయంగా పెంచాలి. ప్రభుత్వ స్కూళ్లలో అడ్మిషన్ల పెరుగుదల శాతం ఎంత గొప్పగా ఉన్నదనేదే తన ప్రతిభకు గీటురాయి అని లోకేష్ నిర్ణయించుకోవాలి. అప్పుడే విద్యారంగానికి నిజంగా మేలు జరుగుతుంది.
ప్రస్తుత పరిణామాలను గమనిస్తే.. పదో తరగతిలో నూరు శాతం ఉత్తీర్ణత సాధించే దిశగా పాఠశాలలను ప్రోత్సహించడంలో ప్రభుత్వం ముందంజలోనే ఉంది. దానికి తగ్గట్టుగా ప్రభుత్వ స్కూళ్లలో చదువుకొని అత్యుత్తమమైన మార్కులు సాధించిన పదవ తరగతి విద్యార్థులను అధికార కూటమి పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు పలు రకాలుగా ప్రోత్సహిస్తూ, వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. వారి పై చదువులకు మొత్తం తాము చేయూత అందిస్తామని భరోసా అందిస్తున్నారు. 10వ తరగతిలో ఉత్తమమైన మార్కులు సాధించిన వారికి విమాన ప్రయాణావకాశం కల్పిస్తూ కొత్త ఉత్సాహాన్ని ఇస్తున్నారు. అలాగే మంచి మార్కులు సాధించిన వారికి మూడు సెంట్ల వంతున ఇంటి జాగాలు ఇస్తూ మొత్తం కుటుంబాన్ని కూడా అభినందిస్తున్నారు. ఇవన్నీ చాలా గొప్ప పనులే. అంతమాత్రాన ఇవి సరిపోతాయని అనుకోవడానికి వీల్లేదు.
ప్రభుత్వ స్కూళ్లలో అడ్మిషన్లు పెరగాలి. ప్రైవేట్ విద్యారంగం సామాన్యులను, మంచి ఫీజులు వసూలు చేసే స్కూల్లో వేస్తే మంచి చదువు వస్తుందనే భ్రమల్లో బతికే మధ్యతరగతి జీవులను పీల్చి పిప్పి చేస్తున్న ఈ రోజులలో ఉన్నతమైన విద్యార్హతలు, ఉత్తమమైన శిక్షణలు పొందిన ప్రభుత్వ టీచర్ల సేవలు మరింతగా విస్తరించాల్సిన అవసరం ఉంది. అంటే ప్రభుత్వ స్కూళ్లలో కొత్త విద్యార్థులు చేరడం పెరగాలి. ఈ దిశగా రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, క్షేత్రస్థాయిలో ఉండే ప్రతి కార్యకర్త కూడా పూనిక వహించాలి. వారిలో అలాంటి ఉద్దేశాన్ని అధినాయకులు పాదుగొల్పాలి. మరో పదిరోజుల్లో పాఠశాలలు పునః ప్రారంభం కారున్నాయి. ఈ నేపథ్యంలో కిందిస్థాయి కార్యకర్త నుంచి- ముఖ్యమంత్రి వరకు విస్తృతంగా ప్రభుత్వ స్కూళ్లలో ఎడ్మిషన్ల గురించి ప్రచారం నిర్వహిస్తే ఫలితం ఉంటుంది. ప్రైవేట్ స్కూళ్లతో పోల్చి చూసినప్పుడు.. ప్రభుత్వ స్కూళ్లలో ఎంత గొప్ప సదుపాయాలు ఉంటున్నాయో టీచర్లు ఎంత ఉత్తమమైన విద్యార్హతలను, శిక్షణలను కలిగి ఉన్నారో పదేపదే ప్రచారం చేయడం ద్వారా సామాన్యులను ప్రభుత్వ స్కూళ్ల వైపు మళ్ళించగలగాలి.
చంద్రబాబునాయుడు ప్రభుత్వం కొలువు తీరిన వెంటనే తొలి సంతకంతోనే.. 16వేల మంది టీచర్లను నియమించి.. ప్రభుత్వ విద్యారంగానికి కొత్త జవసత్వాలు అందించారు సీఎం చంద్రబాబునాయుడు. గతంలో అయిదేళ్లపాటు డీఎస్సీ లేకుండాపోయిన నేపథ్యంలో నీరసించిన ప్రభుత్వ విద్యారంగం.. కొత్త టీచర్ల నియామకాలతోప్రభుత్వ ఎంతగానో బలపడిందని మనం నమ్మాం. అందుకు నిదర్శనం, ఫలితం కూడా కనిపించాలి కదా! ప్రభుత్వ స్కూళ్లలో ఎడ్మిషన్లు పెరగడం ఒక్కటే అందుకు తార్కాణం. తమ కృషి ఫలించిందనే తృప్తి నాయకులకు కలగాలంటే.. ఈదిశగా కూడా వారే కష్టపడాలి.
నాయకులు తలుచుకుంటే ఇది అసాధ్యమైన విషయం కాదు. వారు పూనుకొని ఈ పని చేసేలాగా అవసరమైన డ్రైవ్ ను విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్, ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు, శాఖలతో నిమిత్తం లేకుండా తనకు ఆసక్తి ఉన్న ప్రతి అంశంలోనూ చొరవ ప్రదర్శించే డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పూనుకోవాలి! వీరందరూ కలిసి ఎంతగా ప్రభుత్వ స్కూళ్లలో అడ్మిషన్లను పెంచగలిగితే.. అంతగా లోకేష్ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. కేవలం మంచి మార్కులు సాధించిన వారిని అభినందిస్తే సరిపోదు. ప్రభుత్వ స్కూళ్ల ఎడ్మిషన్లు పెరగడం మాత్రమే, విద్యా ప్రమాణాలను పెంచడం మాత్రమే ‘నీడ్ ఆఫ్ ది అవర్’ అని పాలకులు గుర్తించాలి!
గత ఏడాది వేసవి సెలవులలో కొందరు ఎమ్మెల్యేలు ప్రభుత్వం స్కూళ్లలోనే పిల్లలను చేర్చాల్సిందిగా గ్రామాల్లో తిరుగుతూ ప్రచార కార్యక్రమాలను నిర్వహించారు. ఈసారి మాత్రం అలాంటి కృషి ఎక్కడా పెద్దగా కనిపించడం లేదు. ఒకవైపు జూన్ 12వ తేదీనాటికి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లాలని చంద్రబాబు పిలుపు ఇస్తున్నారు. రెండేళ్లలో సాధించిన విజయాలను ప్రచారం చేయాలని, రాబోయే మూడేళ్లలో చేయబోయే పనులను కూడా వివరించి చెప్పాలని చంద్రబాబు నాయుడు పిలుపు ఇస్తున్నారు. ఇదే సమయంలో ఈ పది రోజుల వ్యవధిలో ప్రభుత్వ పాఠశాలల గురించి, వాటిలో ఉండే ప్రత్యేకతల గురించి కూడా ప్రతి కార్యకర్త ప్రచారం చేసి ప్రభుత్వ విద్యారంగాన్ని పటిష్టంగా నిలబెట్టే వాతావరణం కల్పించాలి. అలా చేస్తేనే లోకేష్ తన శాఖను సమర్ధంగా, దీక్షగా నిర్వహించినట్లు అవుతుంది.
..కె.ఎ. మునిసురేష్ పిళ్లె
సంపాదకుడు

.
Discussion about this post