భూమ్మీద ఉన్న ఏ మనిషికైనా కూడు, గూడు, గుడ్డ అనేవి ప్రాథమిక అవసరాలు. ఇతర జీవరాశులు గూడు, గుడ్డ లేకపోయినా దొరికిన ఆహారంతోనే సంతృప్తిపడి హాయిగా, స్వేచ్ఛగా జీవనం సాగిస్తున్నాయి. కానీ, మనిషి మాత్రం ఈ మూడు లభించినా సంతృప్తి చెందడంలేదు.
మూమూలుగా అయితే తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, వేసుకోవడానికి బట్టలు అనేవి నేడు అందరికీ అందుబాటులోనే ఉన్నాయి. కానీ, మనిషి ఇంకా అసంతృప్తితోనే ఉన్నాడు. దానికి కారణమేమంటే కూడు, గూడు, గుడ్డ వీటిని ఇంకా మెరుగుపరచుకోవడమే నాగరికత అని మనిషి భావించడంవల్ల.
అంటే దొరికిన తిండితో సరిపెట్టుకోక ఇంకా మంచి ఆహారం కావాలని, ఉన్న ఇంటిలో సంతృప్తిపడక ఇంకా మంచి ఇల్లు కావాలని, అలాగే వేసుకున్న దుస్తులతో సంతృప్తి చెందక ఇంకా నాణ్యమైన దుస్తులు వేసుకోవాలని ఆలోచన రావడమే మనిషి అసంతృప్తికి కారణం. ఒకవేళ ఈ మూడింటిని మెరుగుపరచుకున్నా సంతోషంగా ఉన్నాడా? అంటే అదీలేదు. అందువల్లే నాగరికత పేరుతో మనిషి అనుభవించే సుఖం కన్నా ఇతర జీవరాశులు ఎక్కువ సుఖాన్ని పొందుతున్నాయి.
మనిషి ఎంతో అభివృద్ధి సాధించానని చంకలు గుద్దుకున్నా వీడి మొహం మీద ఇంకా ఏడుపు విలయతాండవం చేస్తూనే ఉంది. దీనికి అసలైన కారణం ఏంటంటే.. ధనంమీద, స్త్రీ మీద అమితమైన వ్యామోహం పెంచుకోవడమే. మనిషి ఏ పనిచేసినా, ఏం సాధించినా అంతర్లీనంగా వీడి ఆలోచనంతా ధనం, స్త్రీ ఈ రెండింటి చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. పోనీ, ధనం సంపాదించిన తర్వాతైనా, స్త్రీని అనుభవించిన తర్వాతైనా సుఖంగా ఉన్నాడా? అంటే అదీ లేదు.
పైగా ఈ రెండింటి కోసమే యుగయుగాలుగా యుద్ధాలు చేస్తూనే ఉన్నాడు. రామాయణంలో రామరావణ యుద్ధం జరగడానికిగాని, మహాభారతంలో కురుక్షేత్ర సంగ్రామం జరగడానికిగాని ఈ రెండు విషయాలే కారణమని మన అందరికీ తెలిసిన విషయమే. అయినా వాటి కోసమే మనిషి ఇప్పటికీ వెంపర్లాడుతుండడం ఆశ్చర్యకరం.
మరి ధనం సంపాదించడం, స్త్రీని అనుభవించడం తప్పా? అని మీరు అడగవచ్చు
తప్పని నేను చెప్పడంలేదు. ధనం సంపాదించవచ్చు. కానీ, పరుల ధనంకోసం ప్రాకులాడకూడదు. స్త్రీని అనుభవించవచ్చు, కానీ, పరస్త్రీని ఆశించకూడదు. ధనం మీద, స్త్రీ మీద ఆశ ఉండొచ్చుగాని, వ్యామోహం ఉండకూడదు. ఈ రెండింటి మీద వ్యామోహం వదిలితేగాని నీకు అసలైన సుఖం దొరకదు. కానీ, ఈ రెండే జీవితమని మనం ఇప్పటికీ భావిస్తున్నాం.
మరి మనం ఏం సాధించినట్లు? మనం నాగరికులమా? అనాగరికులమా? మరి సుఖంగా, సంతోషంగా ఉండాలంటే ఏం చెయ్యాలి? అనే ఎన్నో ప్రశ్నలు మనలో కలుగుతాయి.
మనం ఏం సాధించాం? అనే ప్రశ్న వేసుకునే బదులుగా ఈ భూమ్మీద సాధించడానికేముంది? అని సమాధాన పడడమే శ్రేయస్కరం. ఎందుకంటే ఏం సాధించినా మనకు సంతృప్తి కలగడంలేదు ఇక్కడ. కాబట్టి మనకు ఏది శ్రేయస్కరమో అదే లభిస్తుంది అని నిశ్చింతకు రావడమే సాధించాం అనడానికి గుర్తు.
మరి నాగరికులమా? అనాగరికులమా? అనే ప్రశ్నకు ధనంకోసం, స్త్రీ కోసం వ్యామోహం పెంచుకోవడమే అనాగరికం.
చివరగా మనం సుఖంగా ఉండాలంటే ఏంచెయ్యాలి? అన్న ప్రశ్నకు
కండక్టరైనా, కలెక్టరు అయినా…
యాక్టరైనా, డాక్టరు అయినా…
మంత్రైనా, మహారాజు అయినా..
చివరకు ఐక్యరాజ్య సమితి ఛైర్మన్ అయినా..
ఇంకా ఏదో అవ్వాలనే అత్యాశ పుడుతుంది.
కాబట్టి ఇక్కడ (భూమ్మీద) సాధించడానికి ఏమీలేదు అని నిర్ణయానికి వచ్చి నీ ప్రయత్నంలో దొరికిన దాంతోనే దొరలా బతుకుతూ ముందుకు వెళ్ళడమే నీ శాంతికి, నీ సుఖానికి, నీ గెలుపుకు నిదర్శనం.
…దేవీప్రసాద్ ఒబ్బు
9866251159.
.

Discussion about this post