విజయవాడలో సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగరాజు వ్యవహార సరళి ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. సాయికృష్ణ కస్ట్టోడియల్ డెత్ దాదాపుగా నిర్ధారణ అయినప్పటికీ ఇంకా శిక్షలు పడే వరకు పరిస్థితి రాలేదు. ఈ నేపథ్యంలో సీఐ నాగరాజు కారణంగానే.. ఆత్మహత్య చేసుకున్న మరో రౌడీషీటర్ క్రాంతి కుమార్ కుటుంబానికి కూడా న్యాయం జరగాలనే డిమాండ్ వినిపిస్తోంది.
ఎన్డీఏ కూటమి ప్రభుత్వ జమానాలో రౌడీ షీటర్ల పట్ల ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ కర్కశంగా ప్రవర్తించడం సహజంగానే రాజకీయ రంగు పులుముకునే అవకాశం ఉంది. ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ తమ శక్తి వంచన లేకుండా ఈ రెండు ఉదంతాల నుంచి రాజకీయ మైలేజీ కోసం తాపత్రయపడుతున్నది. ఈ పరిస్థితుల్లో క్రాంతి కుమార్ కుటుంబాన్ని కలిసిన ఎమ్మార్పీఎస్ నాయకుడు మందకృష్ణ మాదిగ చేసిన డిమాండ్ చాలా సహేతుకంగానూ, ధర్మసమ్మతంగానూ ఉంది!
మందక్రిష్ణ ఏం కోరుతున్నారంటే.. క్రాంతి కుమార్ ఆత్మహత్య కేసును కూడా సాయికృష్ణ హత్య (లేదా కస్టోడియల్ డెత్) కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ పరిధిలోకి తీసుకురావాలని అంటున్నారు. క్రాంతికుమార్ కుటుంబానికి న్యాయం జరగడం అంటే అచ్చంగా ప్రభుత్వం డబ్బులు ఇచ్చేయాలని, భూములు ఇచ్చేయాలని అడగడం లాగా ఈ డిమాండ్ కనిపించడం లేదు. క్రాంతికుమార్ మీద గత ఎనిమిదేళ్లుగా ఎలాంటి కేసులు లేవనే విషయాన్ని కూడా అందరూ గుర్తు చేస్తూనే ఉన్నారు. రౌడీషీటర్ లను పోలీసులు బైండోవర్ చేయడం, వారిని హెచ్చరిస్తూ ఉండడం వరకు సహజం. అందరూ అర్థం చేసుకోగలరు. అయితే ఆ హెచ్చరికలకు కూడా ఒక పరిమితి ఉంటుంది. అంతకుమించి వారు ఆత్మహత్యలు చేసుకునే లాగా, లేకపోతే కస్టడీలో మరణించే స్థాయికి హింసించడం అనేది సహించడం కష్టం. ఆవేశపరులు ఎలా రెస్పాండ్ అయినప్పటికీ, రౌడీలను చంపకపోతే ఎలా.. అని రెచ్చిపోయినప్పటికీ.. సభ్యసమాజం- ఇలా చట్టాలను చేతిలోకి తీసుకోవడాన్ని హర్షించదు!
ఈ నేపథ్యంలో మందకృష్ణ మాదిగ రాజకీయ డిమాండ్ల రూపంలో కాకుండా క్రాంతికుమార్ కేసును కూడా సిట్ పరిధిలోకి తీసుకురావాలని అనడం సబబుగా ఉంది. ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ ఒక రకమైన అతివాద పోకడలు పోతున్నప్పుడు వాటి పర్యవసానంగా ఒకరు కస్టడీలో మరణించారు.. మరొకరు తనే ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. ఈ రెండూ ఒకేరకమైనవే. ఒక కేసును విచారించే క్రమంలోనే రెండో కేసును కూడా విచారిస్తే.. పోలీసుల ఇలాంటి దుడుకు ప్రవర్తనలు రికార్డుల్లోకి వస్తాయి. పోలీసులు కఠినంగా ఉండకూడదని ఎవరూ అనరు. అమ్మా బాబూ అని పోలీసులు బతిమాలి చెప్పడం వల్ల రౌడీషీటర్ల విషయంలో ప్రయోజనం ఉండకపోవచ్చు.
కానీ.. ముందే చెప్పుకున్నట్టు దేనికైనా ఒక హద్దు ఉంటుంది. అలాంటి హద్దులు దాటినప్పుడే ఇలాంటి దుర్మార్గాలు చోటుచేసుకుంటాయి. సీఐ నాగరాజు దుడుకు ప్రవర్తన మీద జరుగుతున్న సిట్ దర్యాప్తు లో క్రాంతికుమార్ మరణం కూడా భాగమైనప్పుడే.. సమగ్రంగా ఉంటుంది. ఈ కేసు మొత్తం పూర్తయి.. హద్దులు దాటే వారి విషయంలో చర్యలేమిటో కూడా తేలితే. అలాంటి గీతదాటే ఇతర పోలీసులకు ఈ తీర్పు ఒక హెచ్చరిక అవుతుంది. కనీసం మిగిలిన పోలీసు వ్యవస్థను గాడిలోపెట్టడానికి, హద్దుల్లో ఉంచడానికి క్రాంతికుమార్ ఆత్మహత్య కేసును కూడా సిట్ పరిధిలోకి తేవడం అవసరమే. అందుకే మందకృష్ణ డిమాండ్ సహేతుకంగా కనిపిస్తోంది. ప్రభుత్వం ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి.
.