పెద్దవాళ్ళ విషయంలోనే ఇలాగుంటే.. మరి పేదవారికి పరిస్థితి ఎలావుంటోంది? మెగాస్టార్ చిరంజీవి.. యావత్ తెలుగు సినీ అభిమాన ప్రపంచానికి మకుటం లేని రారాజు. అలాంటి చిరుకి ఆరోగ్యం సరిగా లేదు అంటే అటు అభిమానులు… ఇటు అధికారులు ఎంతగా గాభరా పడతారో తెలుసుకదా…మరి అలాంటిది ఏకంగా కరోనా వచ్చింది అని తెలిస్తే… ఇంకెంత హైరానా పడతారో మనం చెప్పాల్సిన పనిలేదు.. ఇటీవల చిరంజీవికి కరోనా పాజిటివ్ వచ్చింది అని తెలియగానే అభిమానులు చాలా ఆందోళన పడ్డారు. చిరు త్వరగా కోలుకోవాలని అందరూ కోరుకున్నారు. పూజలు చేయించారు. అయితో మెగాస్టార్ కు అసలు కరోనా సోకనే లేదు. అసలు తనకు పాజిటివ్ అని చెప్పిన నివేదిక తప్పని ఆయన అభిమానులకు చెప్పుకున్నారు. ఈ సందర్భంగా ఆయన తన శ్రేయోభిలాషులందరికీ తన కృతజ్ఙతలు తెలియజేసుకున్నారు.
ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ పాజిటివ్ అని తెలిసిన తర్వాత.. తాను చక్కగా మెడిసిన్స్ తీసుకున్నానని, అలాగే కరోనా విషయంలో తగు జాగ్రత్తలు తీసుకున్నానని… తెలిపారు. తర్వాత కరోనా పరీక్ష చేయించుకోగా నెగిటివ్ వచ్చిందని, అయినా తాను నమ్మకుండా పలుమార్లు వేరు వేరు హాస్పిటళ్లలో చెక్ చేయించుకున్నానని, అన్ని పరీక్షల్లోను తనకు నెగిటివ్ వచ్చిందని, అంతటితో ఆగకుండా తనకు మొదటిసారి కరోనా పాజిటివ్ అని చెప్పిన దగ్గరే పరీక్ష చేయించుకున్నానని, అక్కడ కూడా నెగిటివ్ అనే వచ్చిందని దీంతో తాను హాయిగా ఊపిరి పీల్చుకున్నానని తెలిపారు.
తనకు ఎలాంటి కరోనా లక్షణాలు లేకుపోయినా కూడా తాను కరోనా విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను అన్నింటినీ తీసుకున్నానని ఈ సందర్భంగా చిరు తెలిపారు. తనకు మొదట పరీక్ష చేసిన వారిని విచారించగా అది అప్పుడు పొరబాటున అలా పాజిటివ్ గా వచ్చి ఉంటుందని వారు తెలిపారని ఆయన చెప్పారు.
అదే ప్రమాద సంకేతం..
మెగాస్టార్ చిరంజీవి అంతటి వాడికి వైద్య పరీక్షలు చేయడం అంటే.. ఎవ్వరైనా సరే ఒళ్లు దగ్గర పెట్టుకుని వ్యవహరిస్తారు. చాలా జాగ్రత్తగా ఉంటారు. అలాంటిది అంత నిర్లక్ష్యంగా తప్పుడు పరీక్ష ఫలితాలు చెప్పి.. పాజిటివ్ అని ఎలా చెప్పగలిగారు. మెగాహీరోకే అలాంటి రిజల్ట్ ఇచ్చిన డాక్టర్లు ఇక మామూలు వ్యక్తుల విషయంలో ఇంకెంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారో కదా అనే ఆలోచన వస్తేనే భయం కలుగుతోంది.
చిరంజీవి లాంటి పెద్దవారి విషయంలో పరీక్షల ఫలితాలు ఇలా వుంటే… ఇక సామాన్య ప్రజల గురించి ఏం చెప్పాలి…? కరోనా రాకపోయినా… ఇలా పరీక్షల్లో తప్పుడు ఫలితాలు రావడం వల్ల ఎంతమంది కరోనా పాజిటివ్ వచ్చినట్లు విలవిలలాడిపోయి ఉంటారో.. ఊహించుకోండి. అందరూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకోలేరు కదా.. కొందరు మరింత చక్కటి వైద్యం లభిస్తుందని ఆశతో లక్షలు ఖర్చుబెట్టి ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనా వైద్యం తీసుకుంటున్నారు. కరోనా సోకితే ప్రెవేటు చికిత్స చేయించుకుంటున్నవారు.. లక్షలకు లక్షలు అందుకోసం ఖర్చు పెట్టేస్తున్నారు. అప్పుల పాలవుతున్నారు. ఆస్తులు కూడా అమ్ముతున్నారు. ఇలా నష్టపోతున్న వారు వేలల్లోనే ఉన్నారు. వీరిలో ఎంతమంది ఇలాంటి తప్పుడు నివేదికల కారణంగా అనవసరంగా డబ్బు తగలేసుకుంటున్నారో అనే అనుమానం ఇప్పుడు కలుగుతోంది.
ఇదిలా ఉండగా… మరోవైపు ప్రైవేటు ఆసుపత్రులు కూడా కరోనా వైద్యం పేరిట లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ… రోగులకు అతి ఎక్కువ డోసులో మందులు ఇవ్వడంతో పాపం రోగులు ఆ మందుల ప్రభావానికి తమ శరీరం తట్టుకోలేక చాలా డీలా పడిపోతున్నారు.
ఇదీ చదవండి :
తమిళంలో మన అక్కినేని అంతటివాడు.. జెమినీ గణేశన్
ఒక సాధారణ ఉపాధ్యాయుడికి కరోనా పాజిటివ్ అని టెస్టుల్లో తేలింది. దీంతో పాపం ఆ ఉపాధ్యాయుడు ఎలాగోలా డబ్బు ఖర్చుబెట్టి పేరుపొందిన ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. కానీ అక్కడ ఉపాధ్యాయుడికి ఎక్కువ డోసులో మందులు ఇవ్వడం ప్రారంభించారు. ఆ మందుల ప్రభావానికి సదరు ఉపాధ్యాయుడు తట్టుకోలేక… ఆసుపత్రి నుండి నాలుగు రోజులకు ఇంటికి వచ్చేశారు. చక్కగా ఇంట్లోనే ఉండి తగిన జాగ్రత్తలను పాటిస్తూ, బలవర్ధకమైన ఆహారం తింటూ ఉండడంతో వారం రోజులకు కరోనా దారికి వచ్చిందని చెప్పుకొచ్చారు.
మొత్తంగా కరోనా ఉందో లేదో… తెలియదుగానీ,… పరీక్షల్లో పాజిటివ్ అని తేలితే మాత్రం ఖతం… అప్పటి వరకూ మీరు కూడబెట్టుకున్న డబ్బు… ఆసుపత్రి పాలే… కాబట్టి తస్మాత్ జాగ్రత్త… పరిశుభ్రత పాటిద్దాం… కరోనా కోరలకు దూరంగా ఉందా…! మనమందరం కూడా కనీసం మన మెగాస్టార్ చిరంజీవి కి ఎదురైన వైద్యుల నిర్లక్ష్యం నుంచి.. పాఠాలు నేర్చుకుని జాగ్రత్తలు తీసుకోవాలి. పరీక్షల కోసం వెళ్లేంత దుస్థితి రాకుండా వీలైనంత జాగ్రత్తగా ఉంటే మంచిది.
.

Discussion about this post