టిటిడిలోని అన్ని ప్రాజెక్టులు సమన్వయం చేసుకుని క్షేత్రస్థాయిలో మరింత విస్తృతంగా ధర్మప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని టిటిడి అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో గురువారం ప్రాజెక్టుల అధికారులతో అదనపు ఈవో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా అదనపు ఈవో మాట్లాడుతూ ధర్మప్రచార కార్యక్రమాల నిర్వహణ కోసం అన్నిప్రాజెక్టుల అధికారులతో కలిసి జిల్లాస్థాయిలో సమన్వయ సమావేశాలు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమాల్లో ఎన్జివోలు, శ్రీవారిసేవకులను భాగస్వాములను చేయాలని సూచించారు. కల్యాణోత్సవం ప్రాజెక్టు ఆధ్వర్యంలో భవిష్యత్తులో విరివిగా శ్రీనివాస కల్యాణాలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు.
అష్టాదశ పురాణాల్లో ఇప్పటివరకు మత్స్య, కూర్మ, విష్ణు, బ్రహ్మ, అగ్నిపురాణాలు అర్థతాత్పర్యాలతో సహా ముద్రణ పూర్తయిందని, మిగిలిన 13 పురాణాల ముద్రణను రెండేళ్లలో పూర్తి చేసేందుకు కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు.
తరిగొండ వెంగమాంబ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఇప్పటివరకు 32 పుస్తకాలు ముద్రించారని, మరిన్ని పుస్తకాలు ముద్రణ చేపట్టాలని కోరారు. ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థ ఆధ్వర్యంలో చతుర్వేద హవనం, వేదసభలు నిర్వహించాలన్నారు. ఎస్వీ రికార్డింగ్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో 1000 అన్నమయ్య సంకీర్తనలను రికార్డింగ్ చేయాల్సి ఉండగా, 290 సంకీర్తనల రికార్డింగ్ పూర్తయిందని చెప్పారు.
నిర్ణీత వ్యవధిలో మిగిలిన సంకీర్తనలను ప్రముఖ సంగీత విద్వాంసులతో స్వరపరిచి రికార్డింగ్ చేయాలన్నారు. దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో దాస సంకీర్తల స్వరకల్పన, రికార్డింగ్కు ప్రణాళిక రూపొందించాలని కోరారు. టిటిడి చేపట్టే కార్యక్రమాలకు ఎస్వీబీసీ ద్వారా, సప్తగిరి మాసపత్రిక ద్వారా విశేష ప్రాచుర్యం కల్పించాలన్నారు.
ఈ సమావేశంలో టిటిడి జెఈవో వీరబ్రహ్మం, ఎస్వీబీసీ సిఈవో సురేష్కుమార్, ప్రాజెక్టుల అధికారి విజయసారథి, సప్తగిరి చీఫ్ ఎడిటర్ డా. రాధారమణ, దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి ఆనందతీర్థాచార్యులు, అన్నమాచార్య ప్రాజెక్టు ఇన్చార్జి సంచాలకులు డా. ఆకెళ్ల విభీషణశర్మ తదితరులు పాల్గొన్నారు.
.

Discussion about this post