రాజకీయాల్లోకి వచ్చే ప్రతి ఒక్కరూ.. తాము ప్రజాసేవ చేయడం కోసమే ఈ మార్గం ఎంచుకున్నామని చెబుతుంటారు. సొంత ఆదాయం కొంతైనా లేకుండా రాజకీయాల్లో ఎందుకు కొనసాగుతుంటారు.. అని ప్రజలు సందేహిస్తూ ఉంటారు. అచ్చమైన ప్రజాసేవ చేయాలనుకుంటే ఏ పార్టీ కూడా ఎవ్వరికీ అడ్డు చెప్పదు. కానీ వ్యక్తిగత ప్రయోజనాలు కూడా ముడిపడి ఉంటాయి గనుకనే.. చాలా మంది తరచూ పార్టీలు మారుతుంటారు. కానీ.. కార్యకర్తలకు అలా దృష్టి మరలకుండా ఉండేందుకు.. వారి వ్యక్తిగత ప్రయోజనాలను రాజకీయాలనుంచి వేరుచేసేందుకు చంద్రబాబునాయుడు ఒక సరికొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టారు. దీనివల్ల కార్యకర్తలు పార్టీతో మరింతగా మమేకం అయ్యే అవకాశం ఏర్పడుతుంది.
చంద్రబాబు నాయుడు ఇప్పుడు తమ పార్టీ కార్యకర్తల కోసం ఒక వరం లాంటి మాట ప్రకటించారు. కార్యకర్తలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేలా, తద్వారా ఆర్థికంగా నిలదొక్కుకోగలిగేలా ప్రోత్సహించడానికి పార్టీ పరంగా ఒక విధానం నిర్ణయం తీసుకున్నట్లుగా ఆయన వెల్లడించారు. కార్యకర్తలు నిజాయితీగా ఉండడానికి, సంపాదన కోసం రాజకీయాలను అడ్డదారిగా మార్చుకోకుండా రుజువర్తనతో మెలగడానికి ఇలాంటి ఆలోచన ఉపయోగపడుతుందనే విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. తన జీవితాన్నే ఆయన ఉదాహరణగా చెప్పారు కూడా! తన కుటుంబం సంపాదన కోసం హెరిటేజ్ సంస్థను స్థాపించానని.. అది బాగా విస్తరించి ప్రస్తుతం 5000 కోట్ల వ్యాపార సామ్రాజ్యంగా ఆవిర్భవించిందని.. ఇప్పుడు తన అవసరాలకు కూడా ఆదుకునే స్థాయిలో హెరిటేజ్ ఉన్నదని ఆయన కార్యకర్తల సమావేశంలో చెప్పారు. అదే విధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఆర్థికంగా ఎదగడానికి వారిని వ్యాపారవేత్తలుగా తయారు చేయాలనే ఆలోచన పంచుకున్నారు. అందుకోసం ప్రత్యేకించి హైదరాబాద్ లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) సంస్థను పార్టీ కోసం కన్సల్టెంట్ గా నియమించుకున్నట్లు కూడా చంద్రబాబు నాయుడు వెల్లడించారు.
ఇది చాలా అపూర్వమైన ఆలోచన. ఎందుకంటే పార్టీ కార్యకర్తలను బలోపేతం చేయడం అనే మాట ప్రతి నాయకుడు వల్లె వేస్తుంటాడు. కానీ ప్రజాసేవలోనే దానికి సంబంధించిన మార్గాలు ఉన్నట్లుగా ధ్వనింప చేస్తుంటారు. అలా కాకుండా వారు ప్రజాసేవలో ఉండాలి.. ఆర్థిక అవసరాల కోసం వెతుకులాడకుండా ఉండేందుకు వ్యాపారవేత్తలుగా మనుగడ సాగించాలి.. అనే రెండు మార్గాలను రూపొందించడం చంద్రబాబు నాయుడు దార్శనికతకు ఉదాహరణగా చెప్పాలి. ఆ మాటకొస్తే కార్యకర్తల విషయంలో, వారి సంక్షేమం, వారి అభివృద్ధి విషయంలో తెలుగుదేశం పార్టీ వినూత్నమైన ఆలోచనలతో వర్తమాన రాజకీయాలను కొత్త పుంతలు తొక్కించిందని చెప్పాలి! ఎందుకంటే క్రియాశీల కార్యకర్తలకు బీమా ఏర్పాటు చేయడం.. అందుకు అవసరమైన ప్రీమియం మొత్తాన్ని పార్టీ చెల్లించడం అనేది ఇదివరలో ఎన్నడూ రాజకీయ పార్టీలలో ఎరగని సంగతి. తర్వాతి రోజుల్లో అదే సిద్ధాంతాన్ని జనసేన కూడా పాటిస్తోంది. కార్యకర్తలు మరణించినప్పుడు వారికి పార్టీ తరఫునుంచి ఆ బీమా పరిహారం అందుతోంది. వారి కుటుంబాలను ఆదుకుంటోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇటువంటి ఏర్పాటు లేకపోవడం కూడా గమనించాలి. అందుచేతనే జగన్మోహన్ రెడ్డికి వీరాభిమాని అయిన వ్యక్తి కూడా తెలుగుదేశం పార్టీ క్రియాశీల సభ్యత్వం తీసుకోవడాన్ని గతంలో మనం గమనించాం.
అదే తరహాలో పార్టీ కార్యకర్తలను.. పార్టీ కార్యకలాపాలతో మరింతగా మమేకం అయ్యేలా చేయడానికి పార్టీ పట్ల ప్రేమను పెంచుకునేలా చేయడానికి.. ఇలా వారిని వ్యాపారవేత్తలుగా తయారు చేసే ఆలోచన ఉపకరిస్తుంది. దరిమిలా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపరంగా రాబోయే రోజుల్లో మరింత సుసంపన్నం అవుతుంది. కార్యకర్తలకు బీమా సదుపాయం ఏర్పాటు చేసినప్పుడు.. అది నారా లోకేష్ ఆలోచనగా పలువురు సీనియర్లు అభినందించారు. అలాగే వారిని వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడానికి ప్రత్యేకంగా ఒక హైదరాబాద్ ఐఎస్బి ని నియమించుకుని, ఆ సేవలను వాడుకుంటూ ముందుకు సాగడం అనే ఆలోచన వెనుక ఎవరు ఉన్నప్పటికీ.. దానిని కార్యరూపంలోకి తీసుకువచ్చిన ఘనత అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడుకు, వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ కు దక్కుతుంది.
.

Discussion about this post