ఎదుటివాడిని ఇరుకున పెట్టేస్తున్నాం అని నాయకులు కొన్ని సార్లు అనుకుంటారు. ముందూ వెనుకా చూసుకోకుండా.. అడ్డగోలు విమర్శలు చేస్తారు. ఇలాంటి సందర్భాల్లో ఎంత లేకి విమర్శలు చేయడానికైనా వెనకాడరు. అయితే కొన్నిసార్లు ఇలాంటి అతి వ్యవహారాలు బూమరాంగ్ అవుతుంటాయి. తిరిగి వారినే ఇరుకున పెడుతుంటాయి. వారి పరువే తీస్తుంటాయి.
తాజాగా అలాంటి పరిణామమే చోటు చేసుకుంది. నందమూరి తారక రామారావు నాలుగోకూతురు రెండు రోజుల కిందట బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆమె ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. నందమూరి కుటుంబానికి ఇది పెద్ద విషాదమే. సహజంగానే చంద్రబాబు, లోకేష్ తదితరులు కూడా వెళ్లి.. పరామర్శించారు. ఆత్మహత్య చేసుకునేంత మానసిక ఒత్తిడులు ఎన్టీఆర్ కుమార్తెకు ఏం ఉన్నాయి? అనేది సర్వత్రా చర్చనీయాంశం కూడా అయింది.
అయితే, ఆమె ఆత్మహత్యను చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ లకు ముడిపెట్టే కుటిల ప్రయత్నం ఒకటి సోషల్ మీడియాలో మొదలైంది. సోషల్ మీడియాకు అడ్డూ అదుపూ ఉండదు గనుక.. ఇలాంటి వెర్రిమొర్రి ప్రచారాలు అనేకం జరుగుతూనే ఉంటాయి. వాటిని ఇగ్నోర్ చేయాల్సిందే. కానీ.. ఒక రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్లమెంటరీ పార్టీ నాయకుడు వంటి గౌరవప్రదమైన హోదాలో ఉన్న ఎంపీ విజయసాయిరెడ్డి కూడా ఇదే ప్రచారాన్ని మరింత ఘనమైన రీతిలో ఎండార్స్ చేయడం ఆయన స్థాయికి తగ్గట్టుగా లేదు!
చంద్రబాబు నాయుడు అనేకమందిని మానసిక క్షోభకు గురిచేసి పొట్టన పెట్టుకున్నాడంటూ విజయసాయిరెడ్డి తన ఫేస్ బుక్ వాల్ మీద ఒక సుదీర్ఘమైన పోస్టు రాశారు. ఎన్టీఆర్ మరణంతో దానిని ప్రారంభించారు. ఎన్టీఆర్ ఆరోజునాటి పరిస్థితుల్లో మరణించడానికి.. చంద్రబాబు కారణం అనే వాదన చాలా కాలంగా ఉన్నదే. దానిని చాలా విపులంగా ఆయన ప్రస్తావించారు. ఎన్టీఆర్ కొడుకు హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో చనిపోతే దానిని కూడా చంద్రబాబునాయుడు ఖాతాలో వేశారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ మరణిస్తే.. దానిని చంద్రబాబు వల్లనే అంటూ సిద్ధాంతీకరించారు. చివరికి ఉమామహేశ్వరి కూడా చంద్రబాబు, నారా లోకేష్ పెట్టిన మానసిక ఒత్తిడి వల్లనే ఆత్మహత్య చేసుకున్నదని తేల్చారు. వారు ఒత్తిడి పెట్టకపోతే.. వారే స్వయంగా సీబీఐ విచారణను కోరి.. తాము పరిశుద్ధులం అని నిరూపించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇంత వక్రపూరితమైన ప్రచారం ఒక గౌరవ ఎంపీస్థాయికి తగినది కాదు. ఆయన ఇలా అతి చేయడం.. బూమరాంగ్ అవుతోంది. ఫేస్ బుక్ వాల్ మీద ఆయన పోస్టు పెట్టగానే.. కామెంట్లలో వెల్లువగా.. వైఎస్ వివేకా హత్యను అనేక మంది ప్రశ్నిస్తున్నారు. జగన్ తన సొంత చిన్నాన్నను చంపించాడని అంటున్నారు. విజయసాయి.. తేనెతుట్టెను కదిపి.. నిరాధారంగా, ఏమాత్రం తర్కం కూడా లేకుండా.. ఉమామహేశ్వరి ఆత్మహత్యను.. చంద్రబాబుకు ముడిపెట్టేసి.. కామెంట్లలో అందరూ జగన్ చిన్నాన్న హత్య గురించి విరుచుకుపడే దుస్థితిని కల్పించారని అంతా అనుకుంటున్నారు.
.

Discussion about this post