మూడు రాజధానుల ప్రతిపాదన ద్వారా వైసీపీ ప్రభుత్వం ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టిందని జనసేన పార్టీ అభిప్రాయపడుతోంది. ఇలాంటి పనిచేసిన జగన్ కు ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హతే లేదని ఆ పార్టీ అంటోంది. రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ విజయవాడ మీడియా సమావేశంలో జగన్ మీద నిశిత విమర్శలు గుప్పించారు.
నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ “ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నప్పుడు బాధ్యతగల రాజకీయ పార్టీలుగా ఒక వేదిక మీదకు వచ్చి సమస్య తీవ్రతను ప్రజలందరి దృష్టికి తీసుకువెళ్లాల్సిన బాధ్యత మాపై ఉంది. జనసేన పార్టీ మొదటి నుంచి ప్రజా సమస్యల మీద, ప్రజలు మా దృష్టికి తీసుకువచ్చిన సమస్యల మీద స్పందిస్తూనే ఉంది. గతంలో జనసేన పార్టీ ప్రజల తరఫున చేసే పోరాటాలను కూడా పలు సందర్భాల్లో ప్రభుత్వం అడ్డుకోవాలని చూసింది. విశాఖపట్నంలో లాంగ్ మార్చ్ అనుమతులు ఇవ్వకుండా ఆపాలని చూశారు. మదనపల్లిలో టమాటా రైతుల కష్టాలు తెలుసుకునేందుకు రైతులతో ముఖాముఖి ఏర్పాటు చేసుకుంటే అడ్డుకోవాలని చూశారు. డిసెంబర్ 31వ తేదీన అమరావతి రైతులను పరామర్శించేందుకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు బయలుదేరితే ప్రతి గ్రామం వద్ద పోలీసులు ముళ్ల కంచెలు వేసి అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాల్లో మార్పు వచ్చే వరకు జనసేన పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుంది. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే బాధ్యత అందరికీ ఉంది. ప్రజానీకం తమ కష్టాలను ప్రభుత్వానికి తెలిపేందుకు కనీసం వినతిపత్రం సమర్పించే పరిస్థితులు కూడా లేకపోవడం బాధ కలిగిస్తోంది. పోలీసులు సహనంతో, ఓపికతో వ్యవహరించాలి. అన్నంపెట్టే రైతులను ఇబ్బంది పెట్టవద్దు.’’ అన్నారు.
అమరావతి సమస్య మీద ముఖ్యమంత్రి దిగిరావాలి. రైతులతో చర్చించాలి. వారికి భరోసా కల్పించాలి. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి లబ్దిపొందాలన్న లక్ష్యంతో జగన్ తీసుకున్న నిర్ణయాన్ని జనసేన పార్టీ ఖండిస్తోందని మనోహర్ అన్నారు. రాష్ట్రానికి ఉపయోగపడుతుందన్న మంచి మనసుతో రైతులు భూములు ఇచ్చారు. వారి త్యాగాన్ని మీరు విస్మరించారు. వారిని ఇబ్బందిపెట్టడం సరికాదు. దీనిపై నూటికి నూరుశాతం చర్చ జరగాలి. ప్రజా ప్రతినిధులు, మంత్రులు, అధికారులు ప్రజల వద్దకు వెళ్లాలి. అన్ని గ్రామాల్లో పర్యటించాలి. ప్రజలతో చర్చించిన అనంతరం మీ కార్యచరణ స్పష్టం చేయాలి. మీ పాటికి మీరు సొంత నిర్ణయాలు తీసుకుంటూ, కమిటీల పేరు చెప్పి నాలుగు గోడల మధ్య తీసుకున్న నిర్ణయాలు ప్రజల మీద రుద్దాలని చూస్తే జనసేన పార్టీ ఖచ్చితంగా ఎదుర్కొంటుందన్నారు.
ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తే అది భావితరాల భవిష్యత్తుకు ఉపయోగపడుతుందని, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్ధుల కోసం ఖర్చు చేయాల్సిన నిధుల్ని డైవర్ట్ చేస్తున్నారని నాదెండ్ల ప్రశ్నించారు. మూడురాజధానుల ప్రతిపాదనను జనసేన తొలినుంచి గట్టిగానే వ్యతిరేకిస్తోంది. పవన్ పరోక్షంలో నాదెండ్ల మనోహర్ ప్రెస్ మీట్ పెట్టి ధ్వజమెత్తడం మాత్రం ఇదే ప్రథమం.
.
Discussion about this post