ఆట అన్నాక గెలుపోటములు సమానంగా ఉంటాయి. ఆటను అభిమానించే వారికి గెలుపోటములు రెండింటినీ సమానంగా ఆస్వాదించే తత్వం ఉంటేనే దానిని క్రీడాస్ఫూర్తి అంటారు. కానీ.. ఇలాంటి నిర్వచనాలు భారత్ – పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ ల విషయంలో పనిచేయవు. అందుకే దాయాదితో ఒక ఓటమి రాగానే.. భారత్ లోని క్రికెట్ ప్రియులందరూ హతాశులయ్యారు.
టీ20 ప్రపంచకప్ టోర్నీలో పాక్ చేతిలో దారుణమైన పరాభవం.. భారతీయ క్రికెట్ ప్రియులను కలవరానికి గురిచేసింది. మామూలు ఓటమి అయినా ఒకింత తట్టుకోగలిగేవారేమో. కానీ ఏకంగా పది వికెట్ల తేడాతో పలకరించిన పరాభవం.. మామూల్ది కాదు. లోతుగా విశ్లేషిస్తే.. ఈ పరాభవానికి అయిదు కారణాలు మనకు కనిపిస్తాయి.
1. టాస్
ఏ మ్యాచ్లో అయినా టాస్ కీలకం అవుతుంది. కానీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి చేజింగ్ అంటే ఇష్టం. అతడి కెప్టెన్సీలో టీమిండియా చేజింగ్లో ఎక్కువ విజయాలు అందుకుంది. అందుకే టాస్ గెలవగానే బౌలింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ మ్యాచ్కు ముందే కోహ్లీ సెంటిమెంట్పై దెబ్బ కొట్టింది. పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజాంకు తమ బ్యాటింగ్ మీద కూడా చాలా నమ్మకం ఉండడంతో టాస్ గెలవగానే ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.
2. పిచ్
పిచ్, వాతావరణ పరిస్థితుల మీద జట్టు గెలుపోటములు ఆధారపడతాయి. పిచ్ మొదట్లో స్లోగా ఉందని విరాట్ కోహ్లీ కూడా చెప్పాడు. అందులోనూ యూఏఈ పిచ్లు, అక్కడి పరిస్థితులు పాకిస్తాన్కు కొట్టినపిండి. ఆ జట్టు అక్కడ ఎక్కువ మ్యాచ్లు ఆడుతుంది. ఇటీవల ఐపీఎల్ అక్కడే ఆడినప్పటికీ టీమిండియా షార్జా పిచ్పై నిలదొక్కుకోలేకపోయింది.
3. ఓపెనర్లు త్వరగా అవుటవడం
ఒక జట్టు ఇన్నింగ్స్ మీద ఆ జట్టు ఓపెనర్ల భాగస్వామ్యం చాలా ప్రభావం చూపిస్తుంది. కానీ భారత్ మూడు ఓవర్లకే.. చెప్పాలంటే 8 బంతుల తేడాతో రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ వికెట్లు ఇద్దరి వికెట్లూ కోల్పోయింది. అది పాక్ బౌలర్లకు బూస్ట్ అయితే.. భారత్ను తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కోలుకోకుండా చేసింది. కనీసం ఒక్కరు క్రీజులో నిలిచినా పరిస్థితి మరోలా ఉండేది. దీనికి తోడు సూర్యకుమార్ యాదవ్ కూడా త్వరగా అవుట్ కావడం కూడా కెప్టెన్ విరాట్ కోహ్లీ స్వేచ్ఛగా షాట్లు కొట్టకుండా చేసింది.
4. పాక్ ఓపెనర్ల జోడీ
పాకిస్తాన్ ఓపెనర్లు బాబర్ అజాం, మొహమ్మద్ రిజ్వాన్ జోడీ గురించి టీ20 ప్రపంచకప్ ప్రారంభం ముందు నుంచే చాలా అంచనాలు ఉన్నాయి. సయీద్ అన్వర్, అమీర్ సోహెయిల్ తర్వాత మళ్లీ పాకిస్తాన్కు లభించిన మంచి ఓపెనర్లుగా ఈ ఇద్దరినీ చెబుతారు. ఈ ఇద్దరూ ఇప్పటివరకూ టీ20ల్లో మొదటి వికెట్కు 673 పరుగుల భాగస్వామ్యం అందించారు. 9.01 రన్ రేటుతో సగటున 67.30 పరుగులు చేశారు. అదుకే పాకిస్తాన్ టీ20లో ఇప్పటివరకూ ఓపెనింగ్ చేసిన 46 జంటల్లో ఇద్దరూ టాప్లో నిలిచారు.
EXCLUSIVE ARTICLES
‘సుభాషితం’ సంస్కృతశ్లోకాలకు భావవివరణల వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు బీరక రవి ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు డాక్టర్ ఎస్ రాము ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సంపాదకుడు సురేష్ పిళ్లె వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
5. ఒత్తిడి
పాక్-భారత్ ప్రపంచకప్ సూపర్ 12 మ్యాచ్కు ముందు అందరూ పాకిస్తాన్ మీద విపరీతంగా ఒత్తిడి ఉంటుందని రాశారు. భారత విజయగాథలు సిరీస్లా ప్రచురించారు. కానీ అది తప్పని నిరూపితమైంది. నిజానికి ఈ కథనాలు అంచనాలతో ఒత్తిడి కోహ్లీ జట్టు మీదే ఎక్కువగా పడింది. వరసగా 7 సార్లు విజయాలు అందుకున్న టీమిండియాను 8వ సారి కూడా అదే బాటలో నడపాలనే ఒత్తిడి కోహ్లీ జట్టుపై తీవ్రంగా పడింది. ఆ ఒత్తిడిలోనే ఓపెనర్లు వెంటవెంటనే తమ వికెట్లు పారేసుకున్నారు. అదే పాకిస్తాన్ బ్యాటింగ్లో ఆ ఒత్తిడి కాస్త కూడా కనిపించలేదు. 151 పరుగులు ఒక మోస్తరు స్కోరే అయినా. ఓపెనర్లు ఇద్దరూ స్వేచ్ఛగా ఆడారు. నలువైపులా షాట్లు కొట్టి రన్ రేట్ తగ్గకుండా చేశారు. చివరికి భారీగా 10 వికెట్ల తేడాతో విజయం సాధించారు.
.. లహరి
.