ప్రకృతిలో… అన్ని జీవరాసుల్లోకి మనిషి ఒక్కడే ఉత్తమమైన, తెలివైన జీవి అని మనిషే పుస్తకాల్లో రాసేసుకున్నాడు. అతను పెద్దమనిషి అని ఊళ్లోవాళ్లు చెప్పాలి. నేను పెద్దమనిషినని తనకు తానే చెప్పుకుంటే ఎలా? ఇతర జీవరాశి అనాలి మానవజన్మే ఉత్తమమైనదని మానవుడే వ్రాసుకుంటే ఎలా?
కానీ బాగా ఆలోచించి చూస్తే… ఇప్పుడున్న కరోనా పరిస్థితులను పరిశీలిస్తే… ఈ ప్రకృతిలో జీవించే అన్నీ జీవరాశుల్లోకెల్లా మనిషే.. క్రూరమైన, నికృష్టమైన జీవి అని చెప్పడానికి నేను సందేహించను.
ఎందుకంటే… ఆనాటి నుంచి ఈనాటి వరకు మిగతా జీవరాశులన్నీ తమ మానాన తాము సహజంగా జీవిస్తున్నాయి. కానీ, మనిషి ఒక్కడే తన సహజత్వాన్ని కోల్పోయి (అనగా ప్రకృతితో మమేకం అయ్యి జీవించడం మరచిపోయి) నాగరికత (నగరాలలో జీవించడం) అనే పేరుతో సహజంగా, ఉచితంగా దొరికే సుఖాల్ని ధ్వంసం చేసుకున్నాడు. పూరిగుడెసె, కట్టెల పొయ్యి, మట్టిపాత్రలు, రాగి సంగటి. .ఇవన్నీ పేదరికానికి చిహ్నాలు కావు..
పరిపూర్ణమైన ఆరోగ్యానికి బహ్మసూత్రాలు.
అంతేకాదు, జంతువులను, పక్షులను, వృక్షాలతో పాటు అవి హాయిగా మనుగడ సాగించే ప్రాంతాలను కూడా ధ్వంసం చేసి వాటి అవశేషాలను ఆభరణాలుగా, ఆవాసాలుగా మార్చేసుకునికి గ్రీన్ జంగిల్ ను కాంక్రీట్ జంగిల్ గా మార్చేస్తున్నాడు. దీనివలన జీవరాశుల మధ్య అసమతుల్యత ఏర్పడింది. ఆ అసమతుల్యతను సమతుల్యం చేయడానికి ఏర్పడినవే ఈ వైరస్ లాంటి.. వైపరీత్యాలు.
అంతటితో ఆగకుండా ఈ విపరీత సాంకేతిక వస్తువులను తయారుచేసుకుని నిత్యం వాడడం వలన అందులోంచి వెలువడే విపరీతమైన రేడియషన్ వలన పక్షిజాతులు విపరీతంగా నశిస్తున్నాయి. అన్నింటినీ చంపి, తానొక్కడే ఈ ప్రపంచాన్ని ఏలాలని చూస్తున్నాడు. అది వీలుకాదు. చివరకి జరిగేదేమంటే- మిగతా అన్నీ ఉండి మానవుడొక్కడే లేకుండాపోయే పరిస్థితి దాపురించడమే.
ప్రకృతితో సహజీవనం వలనే మానవుని మనుగడ ఇంకొన్ని యుగాలు కొనసాగుతుంది. లేదంటే, మానవుడొక్కడే మరుగయ్యి.. .మిగతా జీవరాశులంతా క్షేమంగా, సుఖంగా… మనుగడసాగించగలవు.
అందుకే…
సమయం లేదు మిత్రమా…!
మరణమా?.. ప్రకృతితో సహజీవనమా?
నీవే ఆలోచించుకో..
…దేవీప్రసాద్ ఒబ్బు
9866251159.
.
Discussion about this post