టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీ పద్మావతి చిన్న పిల్లల హృదయాలయం ( గుండె చికిత్సల ఆసుపత్రి) లో మరో ఏడు ఓపెన్ హార్ట్ సర్జరీలు విజయవంతంగా నిర్వహించారు.
వీరిలో నలుగురిని బుధవారం డిశ్చార్జ్ చేస్తున్న సందర్భంగా టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి ఆసుపత్రిని సందర్శించారు. ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకుని ఐ సి యు, జనరల్ వార్డు లో చికిత్స పొందుతున్న పిల్లలు, వారి తల్లిదండ్రులు, డాక్టర్ల బృందం తో ఆయన మాట్లాడారు.
ఈ ఏడాది అక్టోబరు 11వ తేదీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ఆసుపత్రి ప్రారంభించగా, వెంటనే ఓపి సేవలు ప్రారంభించామన్నారు. నెలరోజుల్లోగానే నవంబరు 11వ తేదీ తొలి ఓపెన్ హార్ట్ సర్జరీ విజయవంతం గా నిర్వహించడం అభినందనీయమన్నారు.
లక్షలాది రూపాయలు ఖర్చు చేసి ఆపరేషన్లు చేయించే స్థోమత లేని పేద తల్లిదండ్రులకు వై ఎస్ ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా ఆపరేషన్లు చేయడం సంతోషకరమన్నారు. శ్రీ వేంకటేశ్వర స్వామి వారి కృపతో పేదలకు మరింతగా వైద్య సేవలు అందించే ఏర్పాట్లు చేస్తున్నామని ఈవో వివరించారు.
ఆసుపత్రి ప్రారంభమయ్యాక మొదట ఒక బాలికకు, తరువాత ఇద్దరు చిన్నారులకు వైద్యులు విజయవంతంగా గుండె ఆపరేషన్లు చేశారని ఈవో చెప్పారు. ఇప్పుడు ఒకే విడతలో రెండునెలల నుంచి ఆరేళ్ళ వయసు కలిగిన ఏడుగురు చిన్నారులకు విజయవంతంగా సర్జరీలు చేశారని డాక్టర్ల బృందాన్ని ఈవో అభినందించారు.
చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి కు చెందిన పవిత్ర 6 సంవత్సరాలు, కర్నూలు జిల్లా నందికొట్కూరు మండలం కొణిదెల గ్రామానికి చెందిన జి.వెంకట నాగ శేషు 2 నెలల కుమారుడు, చిత్తూరు జిల్లా దామల చెరువుకు చెందిన రిషిత అనే 4 సంవత్సరాల బాలిక, అనంత పురం జిల్లా హిందూ పురం సమీపంలోని అప్పుల కుంటకు చెందిన వేదాంత అనే 4 సంవత్సరాల బాలుడికి గుండె ఆపరేషన్లు చేశారన్నారు. వీరితో పాటు తమిళనాడు రాష్ట్రంలోని పల్లిపట్టు కు చెందిన యోక్షిత శ్రీ అనే ఏడు నెలల పాప, అనంతపురం జిల్లా తాడిపత్రి కి చెందిన ఇంషాద్ అనే నాలుగు నెలల బాబు, కర్నూలు జిల్లా డోన్ కు చెందిన నాలుగు నెలల వయసున్న గౌతంకు ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథ రెడ్డి నేతృత్వంలోని డాక్టర్ల బృందం విజయవంతంగా ఈ ఆపరేషన్లు నిర్వహించినట్లు ఈవో డాక్టర్ జవహర్ రెడ్డి వివరించారు.
పిల్లలకు గుండె ఆపరేషన్లు చేయించుకోవడానికి తల్లిదండ్రులు హైదరాబాద్, చెన్నె, బెంగుళూరు లోని కార్పొరేట్ ఆసుపత్రు లకు తిరిగి లక్షల రూపాయల ఖర్చు పెట్టుకోలేక టీటీడీ ఆసుపత్రికి వచ్చి ఉచితంగా ఆపరేషన్లు చేయించుకున్నారని తెలిపారు.
జెఈవో వీర బ్రహ్మం, ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథరెడ్డి, బర్డ్ ఆసుపత్రి ఓఎస్డీ డాక్టర్ రెడ్డెప్పరెడ్డి, చిన్న పిల్లల హృదయాలయం ఆర్ ఎం ఓ డాక్టర్ భరత్ పాల్గొన్నారు.
ఈ ఆసుపత్రి లేకుంటే మా పిల్లలు బతికే వారు కాదు
ఈవో తో తల్లిదండ్రుల ఉద్వేగం
వేంకటేశ్వర స్వామికి రుణ పడి ఉన్నా మని భావోద్వేగం
వేంకటేశ్వర స్వామి ఈ ఆసుపత్రి పెట్టించక పోయి ఉంటే మా పిల్లలు బతికే వారే కాదు. చాలా ఆసుపత్రులకు తిరిగాము. ఆ స్వామి దయతో నే మా పిల్లలు బతికారని గుండె ఆపరేషన్లు చేయించుకున్న పిల్లల తల్లిదండ్రులు ఈవో డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి ఎదుట ఉద్వేగానికి గురయ్యారు. మేమంతా శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి రుణ పడి ఉన్నామని భావోద్వేగాలకు లోనయ్యారు.
హిందూపురం కు చెందిన వేదాంత తల్లి శ్రీమతి శ్యామల మాట్లాడుతూ, “” మా బాబుకు పుట్టిన ఆరో రోజే గుండె జబ్బు ఉందని డాక్టర్లు చెప్పారు. హిందూపురం, బెంగుళూరు ఆసుపత్రులకు తీసుకుని పోయాం. ఒళ్ళంతా నీలంగా మారిపోయింది. టీటీడీ చిన్న పిల్లల ఆసుపత్రి పెట్టిందని పేపర్లో చూసి ఇక్కడికి వచ్చినాము. డాక్టర్లు మా బాబు ని బతికించారు.” అని ఆనంద భాష్పాలు కార్చారు.
“” మా బాబు పుట్టినప్పటి నుంచి ఏడుస్తూనే ఉండటం తో నందికొట్కూరు లో చిన్న పిల్లల డాక్టర్ కు చూపించినాము.ఆయన నంద్యాలలో ఒక డాక్టర్ దగ్గరికి పంపించాడు. అక్కడ డాక్టర్ బాబు గుండె కు ఆపరేషన్ చేయాలని చెప్పారు. ఏం చేయాలో దిక్కు తోచలేదు.
తిరుపతి లో దేవస్థానం వారు పిల్లల గుండె ఆసుపత్రి పెట్టినారని, అక్కడికి పోతే ఉచితంగా ఆపరేషన్ చేస్తారని చెబితే వచ్చినాము. మా 2 నెలల బాబును డాక్టర్లు అడ్మిట్ చేసుకుని ఆపరేషన్ చేసినారు.ఇప్పుడు బాబు బాగున్నాడు. వేంకటేశ్వర స్వామి దయ..ఆ స్వామికి మేము రుణ పడి ఉంటాం”” అని నందికొట్కూరు మండలం కొణిదెల కు చెందిన వెంకట నాగ శేషు ఈవో తో చెప్పారు.
.

Discussion about this post