ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డి.. అమ్మఒడి పథకాన్ని ప్రారంభించారు. బడికి వెళ్లే చిన్నారులు ఉన్న ప్రతి తల్లికీ ఏడాదికి 15 వేల రూపాయలు నేరుగా ఆమె బ్యాంకు ఖాతాలోకి జమచేసే పథకం ఇది. ఎన్నికలకు ముందు హామీగా 10వేల రూపాయలు మాత్రమే ప్రకటించినప్పటికీ.. ఎన్నికల తర్వాత.. ఆ మొత్తాన్ని జగన్ 15 వేల రూపాయలకు పెంచారు. ఆ పథకానికి చిత్తూరు జిల్లాలో గురువారం శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా జగన్ ప్రకటించిన మరో ఆలోచనను మాత్రం ప్రశంసించి తీరాల్సిందే.
ఏడాదికి 15 వేల రూపాయలు తీసుకుంటున్న ప్రతి తల్లి.. తమ బిడ్డ చదువుతున్న స్కూలుకోసం ఏడాదికి వెయ్యి రూపాయలు ఇవ్వాలని జగన్ పిలుపు ఇచ్చారు. పాఠశాల సక్రమ నిర్వహణలో యాజమాన్య కమిటీలతో పాటు తల్లిదండ్రులందరూ కూడా భాగం పంచుకోవాలని జగన్ పిలుపు ఇచ్చారు. ‘మరుగుదొడ్ల పరిశుభ్రతకు, శానిటరీ వస్తువుల కొనుగోలుకు, వాచ్మెన్ జీతాలు చెల్లించేందుకు ఈ మొత్తాన్ని ఖర్చు చేయండి. మీ పిల్లలు చదువుతున్న బడికి మీరే నిర్వాహకులుగా వ్యవహరించండి’ అని జగన్ పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి లబ్ధి పొందుతున్న వారికి ‘తిరిగి ఇవ్వడం’ అలవాటు చేయడానికి ప్రయత్నిస్తున్న ఈ ఆలోచనని మాత్రం ఖచ్చితంగా ప్రశంసించాలి.
ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా నాయకులు ప్రజాసంక్షేమ పథకాల మీద, తాయిలాల మీద దృష్టిపెట్టడం మామూలే. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి సంక్షేమం ముసుగులో ఇబ్బడి ముబ్బడిగా పథకాలను ప్రకటించడం జరుగుతుంది. కానీ.. ప్రజలు తిరిగి ప్రభుత్వానికి కూడా కొంత ఆధరవుగా ఉండాలని, తిరిగి వారు సాయం అందించాలని సూచించే ప్రభుత్వం ఉండదు. అలా చేస్తే.. ఓటర్లుగా వారు భావించే ప్రజల్లో నెగటివ్ ప్రభావం పడుతుందని వారు జంకుతారు.
కానీ జగన్మోహనరెడ్డి అలా చేయలేదు. ప్రతి తల్లి కూడా తాను తీసుకుంటున్న 15 వేల రూపాయల్లో ఒక వెయ్యి రూపాయలను తమ బిడ్డ చదువుతున్న పాఠశాలకు తరిగి ఇవ్వమని ఆయన సూచించారు. పదివేలు ఇస్తానన్న జగన్.. ఎవరూ అడగకపోయినా ఆ మొత్తాన్ని 15వేలకు పెంచి ఇస్తున్నారు. అలాంటప్పుడు ఒక వెయి తగ్గించుకోవడం ఎవ్వరికీ ఇబ్బంది కాకపోవచ్చు. ఆర్థిక కొలబద్ధతల ప్రకారం కాకపోయినప్పటికీ… ఇది మాత్రం చాలా మంచి పద్ధతి. దీనిలో పైకి కనిపించని చాలా అనుకూలాంశాలు ఉన్నాయి.
స్కూలు పరిశుభ్రత, మరుగుదొడ్ల శుభ్రత, శానిటరీ వస్తువులు కొనడం, వాచ్మన్ వంటి అవసరాలకు ఆ మొత్తం ఉపయోగపడుతుందని జగన్ సూచన. సగటున వంద మంది విద్యార్థులు ఉంటారని అనుకునే ఒక స్కూలుకు ఏడాదికి తల్లులు ఇచ్చే లక్ష రూపాయలు నిర్వహణకు ఉపయోగపడుతాయి. రాష్ట్రమంతా కలిపి తల్లులకు 6456 కోట్లు అందజేసిన ప్రభుత్వానికి ఒక్కోస్కూలుకు ఈ లక్ష ఇవ్వడం పెద్ద విషయం కాదు. కానీ.. ఆయా పాఠశాలల నిర్వహణలో తల్లులందరినీ కూడా భాగస్వాముల్ని చేయడం దీనిద్వారా సాధ్యమవుతుంది. తమ పిల్లలు చదువుతున్న స్కూలుకు తాము డబ్బు కూడా ఇస్తోంటే.. అది ఎలా నడుస్తోందో, అక్కడ శుభ్రత ఎలా ఉంటున్నదో తల్లులు పర్యవేక్షించడం జరుగుతుంది. ఇలాంటి దానివల్ల వ్యవస్థలో ఒక ‘చెక్’ ఉంటుంది. ప్రభుత్వం నుంచి ఎంతో కొంత నిధులొస్తే.. వాటిని ఏదో ఒకరీతిగా ఖర్చు పెట్టేసే వ్యవహారాలు తగ్గుతాయి. బడి జరిగే తీరుకు, చేపట్టే పనులకు, నిర్వహణకు ప్రజలే అధిపతులుగా ఉంటారు. బడిలో చదివే పిల్లల తల్లులే ఆ బడికి యజమానులుగా మారుతారు. పాఠశాల నిర్వహణలో జవాబుదారీతనం పెరుగుతుంది.
మొత్తానికి జగన్ సర్కారు తీసుకువచ్చిన ఒక సంక్షేమ పథకంలో ‘తిరిగి ఇవ్వడం’ అనేది ఇప్పుడే మొదలైంది. ప్రభుత్వానికి ఏమీ ఇవ్వకుండా.. కేవలం పథకాల లబ్ధి పొందుతున్న వారు అనేకవర్గాల వారు ఉన్నారు. అలాంటి అన్ని పథకాలకు కూడా ఇలాంటి ‘తిరిగి యిచ్చే’ అలవాటును ప్రభుత్వం చేయాలి. వ్యవస్థ సవ్యంగా ఉండాలంటే.. సదరు వ్యవస్థలో ప్రజలే ప్రశ్నించేవారుగా, ప్రజలే జవాబుదారీగా ఉండాలి. ప్రభుత్వం నుంచి ఆర్థికంగా లబ్ధి పొందుతున్న పేదలు, మరొక రకంగా ఏదో ఒక విధంగా ప్రభుత్వానికి, వ్యవస్థకు, సమాజానికి తిరిగి ఇచ్చే నిబంధనలు రావాలి. అమ్మఒడిలో ‘తిరిగి ఇవ్వడం’ అనే గొప్ప ఆలోచన.. అన్ని పథకాలకు వర్తించాలి. అప్పుడు మొత్తంగా సమాజానికి మంచి జరుగుతుంది.
.

Discussion about this post