చిత్తూరు జిల్లా రాజకీయాలను దశాబ్దాలుగా శాసిస్తున్న పెద్దిరెడ్డి కుటుంబానికి.. అధికార పార్టీకే చెందిన ఓ మండల స్థాయి నేత కొరకరాని కొయ్యగా మారాడు. జిల్లా రాజకీయాల్లో సంచలనంగా మారాడు. ఆయన బయట ఉంటే ఇంకా ఏం జరుగుతుందోనని భావించిన పెద్దిరెడ్డి కుటుంబీకులు 2008 నాటి కేసును తిరగదోడి జైలుకు పంపారా అనే చర్చ నడుస్తోంది.
ఈ ఘటనపై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తనయులు.. రాజంపేట పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి వివరణ కూడా ఇచ్చు కోవాల్సి వచ్చింది. పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులకు కంటిలో నలుసుగా మారిన ఆ వ్యక్తి ఎవరు..? అతని బ్యాక్ గ్రౌండ్ ఏమిటి..? ఏ ధైర్యంతో అతడు ఎదురొడ్డి నిలుస్తున్నాడు..? ఆ వివరాలు సవివరంగా అందించడానికి ‘ఆదర్శిని’ ప్రత్యేక కథనం..
నేపథ్యం ఇదీ..
చిత్తూరు జిల్లా పెద్దమండ్యం మండలం మందలవారిపల్లె పంచాయతీ దండురవారిపల్లెకు చెందిన మద్దిరెడ్డి కొండ్రెడ్డిది మధ్యతరగతి రైతు కుటుంబం. వీరి ప్రధాన వృత్తి వ్యవసాయం. ఈ కుటుంబానికి ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదు. కొండ్రెడ్డి విద్యార్థి దశలో ఉన్నపుడే ఈయనను ఓ హత్యకేసులో నిందితునిగా చేర్చారు. ఈ సంఘటన కొండ్రెడ్డి జీవితాన్ని మలుపు తిప్పింది.
విప్లవ రాజకీయాల వైపు అడుగులు వేశాడు. చిత్తూరు, అనంతపురం జిల్లాలకు చెందిన కొంతమంది యువకులతో ఓ ముఠా ఏర్పాటు చేశాడు. ఆ తరువాత ఈ రెండు జిల్లాల్లో కార్యకలాపాలు ప్రారంభించాడు. పోలీసులు ఈయన్ను సూడో నక్సలైటుగా ప్రచారం చేశారు. కొండ్రెడ్డి ఆయన అనుచరులు అజ్ఞాతంలో ఉంటూ కార్యకలాపాలు నిర్వహించే వారు. ఈ క్రమంలోనే కొండ్రెడ్డి, ఆయన అనుచరులపై హత్య కేసులు, బస్సు దోపిడీ కేసులు.. ఇలా పలు రకాలు కేసులు నమోదయ్యాయి.
‘మోస్ట్ వాంటెడ్’ జాబితాలోకి..
ఈ నేనపథ్యంలో అనంతపురం, చిత్తూరు జిల్లాల పోలీసులకు ‘మోస్ట్ వాంటెడ్’ వ్యక్తిగా మారాడు. ఒక దశలో కొండ్రెడ్డిని పోలీసులు ఎన్ కౌంటరు చేయాలనే వరకు వెళ్ళింది. కొండ్రెడ్డి అజ్ఞాతంలో ఉన్నపుడే గీత అనే యువతిని వివాహం చేసుకున్నాడు. వీరిపై నిర్బంధం పెరగడంతో పోలీసులకు లొంగి పోవాలని నిర్ణయించుకున్నారు. 2005 ప్రాంతంలో మద్దిరెడ్డి కొండ్రెడ్డి తన కొంతమంది అనుచరులతో కలిసి మదనపల్లెలో పోలీసులకు లొంగి పోయాడు. ఆ తరువాత కొంతకాలం జైలు జీవితం గడిపాడు.
ఇది కూడా చదవండి : తంబళ్లపల్లె వైసీపీ నేత మద్దిరెడ్డి కొండ్రెడ్డి అరెస్టు
బెయిల్ పై బయటకు వచ్చిన తరువాత తంబళ్లపల్లె మండల కేంద్రంలో ఒక ఇంటిని కొనుగోలు చేసి అక్కడే కాపురం పెట్టాడు. అప్పటి నుంచి అక్కడే నివాసం ఉంటున్నాడు. కొండ్రెడ్డి జన జీవనస్రవంతిలోకి వచ్చిన తరువాత- అప్పటి తంబళ్లపల్లె ఎమ్మెల్యే కలిచెర్ల ప్రభాకరరెడ్డి అనుచరునిగా మారాడు. కలిచెర్ల యువసేనను ఏర్పాటు చేసి నియోజకవర్గం అంతా పర్యటించారు.
ఈ కారణంగా కలిచెర్ల ప్రభాకరరెడ్డితో చాలా సన్నిహిత సంబంధం ఏర్పడింది. జనజీవన స్రవంతిలో ఉంటూనే పంచాయితీలు నిర్వహించడం.. పేదల సమస్యలతో తనను ఆశ్రయించినప్పుడు వారికి అండగా నిలబడటం చేస్తూ వచ్చాడు. ఇలా కొండ్రెడ్డి తంబళ్లపల్లెలో ప్రత్యేక వర్గం ఏర్పరచుకున్నాడు. నయానా.. భయానా లొంగదీసుకోవడం కూడా నేర్చుకున్నాడు.
ఆ తరువాత తన భార్య గీతను ప్రత్యక్ష రాజకీయాల్లోకి దించాడు. 2014లో గీతను వైసీపీ మద్దతుదారుగా తంబళ్లపల్లె సర్పంచ్ బరిలోకి దించాడు. ఆ ఎన్నికల్లో ఆమె ఘన విజయం సాధించింది. తంబళ్లపల్లె కుటుంబీకులను కాదని.. ఇతరులు తంబళ్లపల్లె సర్పంచ్ కావడం అదే మొదటిసారి. గీత సర్పంచ్ కావడంతో కొండ్రెడ్డికి ప్రజలు, అధికారులతో మరింత మంచి సంబంధాలు ఏర్పడ్డాయి. కొండ్రెడ్డి జనజీవన స్రవంతిలోకి వచ్చిన తరువాత కూడా పలు క్రిమినల్ కేసులు ఆయనపై నమోదయ్యాయి.
ఇది కూడా చదవండి : కొండ్రెడ్డి గొడవ- మిధున్ రెడ్డి వ్యాఖ్యలతో వైసీపీ పరువు పోయిందా?
తర్వాతి రాజకీయ పరిణామాలలో కాంగ్రెస్ బలహీన పడటంతో కొండ్రెడ్డి వైసీపీలో చేరారు. ఆ పార్టీ ఆవిర్భావం నుంచి తంబళ్లపల్లెలో క్రియాశీలంగా పని చేయడం ప్రారంభించాడు. ఇందుకు తనకు ముందు ఉన్న సంబంధాలను వినియోగించుకుంటూ వచ్చాడు. పార్టీలో ఈయన చురుగ్గా ఉండటంతో వైసీపీ రాజంపేట పార్లమెంటరీ రైతు విభాగం అధ్యక్ష పదవి ఇచ్చారు. ప్రస్తుతం ఆయన ఈ పదవిలో కొనసాగుతున్నారు.
పెద్దిరెడ్డి విజయం కోసం చెమటోడ్చి..
2019లో జరిగిన సాధారణ ఎన్నికల్లో పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి విజయానికి తీవ్రంగా కృషి చేశాడు. ఈ కారణంగా ద్వారకనాధరెడ్డితో సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో కొండ్రెడ్డి భార్య గీతను తంబళ్లపల్లె జడ్పీటీసీగా ఏకగ్రీవం చేసుకున్నారు. ప్రస్తుతం ఆమె తంబళ్లపల్లె జడ్పీటీసీగా ఉన్నారు. ఏ కారణంగానో ఇటీవల కిందట కొండ్రెడ్డి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి మధ్య విభేదాలు వచ్చాయి. ఎమ్మెల్యే వద్ద ఆయన ప్రాధాన్యం తగ్గి పోయింది. దీంతో పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, ఆయన అనుచరుల వ్యవహారాలపై పెద్దిరెడ్డి కొండ్రెడ్డి విరుచుకు పడటం మొదలు పెట్టాడు. ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి పాదయాత్రకు కూడా చేయడానికి ముహూర్తం నిర్ణయించాడు. పాదయాత్రపై పోస్టర్లు కూడా వేశాడు. దీంతో వారి మధ్య విభేదాలు మరింత పెరిగాయి.
read also : తెలంగాణలో అక్క పార్టీ దిక్కు లేనిదేనా?
ఈ నేపథ్యంలో పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డిపై మీడియాకు ఎక్కాడు. తంబళ్లపల్లెలో తాలిబన్ల రాజ్యం నడుస్తోందంటూ కొన్ని ఛానళ్లకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. తంబళ్లపల్లెను ముఖ్యమంత్రి జగనే కాపాడాలని కూడా విజ్ఞప్తి చేశాడు. మీడియా ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కొండ్రెడ్డి వ్యాఖ్యలు ప్రసారం కావడంతో సంచలనమైంది. ఆగమేఘాలపై పాత కేసు (2008లో జరిగిన వివాదం) తిరగదోడి ఈ నెల 1న ములకలచెరువులో కొండ్రెడ్డిని పోలీసులు అరెస్టు చూపారు. ప్రస్తుతం ఆయన జైల్లో ఉన్నాడు.
EXCLUSIVE ARTICLES
సీనియర్ జర్నలిస్టు గోవిందరాజు చక్రధర్ వ్యాసాల ప్రత్యేకపేజీ కోసం క్లిక్ చేయండి
‘సుభాషితం’ సంస్కృతశ్లోకాలకు భావవివరణల వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు బీరక రవి ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు డాక్టర్ ఎస్ రాము ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
దేవీప్రసాద్ ఒబ్బు లోపలిమాట వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సంపాదకుడు సురేష్ పిళ్లె వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
పెద్దిరెడ్డి కుటుంబం ఒత్తిడితోనే తన భర్త కొండ్రెడ్డిని పోలీసులు 13ఏళ్ల నాటి కేసులో అరెస్టు చేశారని ఆయన భార్య, తంబళ్లపల్లె జడ్పీటీసీ గీత ఆరోపిస్తోంది. తన భర్త అరెస్టుపై మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తానని కూడా ఆమె చెబుతోంది. తన భర్తకు ఏమైనా జరిగితే పెద్దిరెడ్డి కుటుంబమే అందుకు బాధ్యత వహించాల్సి ఉంటుందని కూడా గీత అంటోంది. ఈ పరిణామాలు ఎక్కడకు దారి తీస్తాయో వేచి చూడాల్సి ఉంది.
read also : ఆదర్శిని జోస్యం నిజం.. జగన్ అనుచరుడు షర్మిల గూటికే చేరాడు!
.
Discussion about this post