ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. సుదీర్ఘకాలం భయం తర్వాత.. నిన్న మొన్నటి రోజుల్లో కాస్త స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకున్న ప్రపంచం ఇప్పుడు మళ్లీ బెంబేలెత్తిపోతోంది. ఏపీ ప్రభుత్వం రాత్రి కర్ఫ్యూలను విధించింది. ప్రభుత్వం తరఫునుంచి వారు చేయగల ప్రమాద హెచ్చరిక అది.
కానీ మూడో వేవ్ ఎంత ఉధృతంగా మనల్ని కబళించేస్తుందనేది.. ప్రభుత్వం విధించే నిషేధాజ్ఞల్లో ఉండదు.. కేవలం మనం తీసుకునే జాగ్రత్తల్లో మాత్రమే ఉంటుంది. మనమందరమూ కూడా.. ఇటీవలి కాలంలో వాతావరణం మామూలుగా ఉందని మనలో ఏ కొంచెమైనా అలక్ష్యం చొరబడి ఉంటే దానిని వీడి.. అప్రమత్తం కావాల్సిన ఆవశ్యకత ఉంది.
కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. ఒమిక్రాన్ రూపంలో థర్డ్ వేవ్ ప్రారంభమైందని.. ఏ మాత్రం నిర్లక్ష్యం తగదని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. అందుకు అనుగుణంగానే మన రాష్ట్రంలో కొవిడ్ కేసుల సంఖ్య రోజు రోజుకూ గణనీయంగా పెరుగుతున్నాయి. బుధవారం 547 కేసులు నమోదు కాగా… గురువారం ఏకంగా 840 కేసులు నమోదయ్యాయి. ఈ నెలాఖరుకు ఈ కేసుల సంఖ్య వేల సంఖ్యకు పెరిగే అవకాశం ఉందని వైద్యశాఖ వర్గాలు అంటున్నాయి.
ఈ హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కొవిడ్ నివారణకు మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ నెల 8వ తేదీ శనివారం నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయి. నిబంధనలు ఎలా ఉన్నా కరోనా నియంత్రణ అనేది ఎక్కువ భాగం మన చేతుల్లోనే ఉంది. కనీస నియమాలు మనం పాటిస్తే కరోనా వ్యాప్తికి చాలా వరకు అడ్డుకట్ట వేయవచ్చు.
మనం అందరం ఊహించినట్లుగానే కరోనా మూడవ దశ ప్రారంభమైంది. రెండవ దశ డెల్టా వేరియంట్ రూపంలో వ్యాప్తి చెందగా.. మూడవ దశ ఒమిక్రాన్ రూపంలో వ్యాప్తి చెందుతోంది. ప్రస్తుతం మన రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 28దే అయినప్పటికీ.. కొత్తగా పెరుగుతున్న కేసులు డెల్టా వేరియంట్ లేదా ఒమిక్రానా అంతు చిక్కడం లేదు.
ఆంధ్రప్రదేశ్ లో గురువారం ఉదయం 9 నుంచి శుక్రవారం ఉదయం 9వరకు అంటే 24గంటల వ్యవధిలో 37,849మందికి పరీక్షలు నిర్వహించగా 840 మందికి కొవిడ్ సోకినట్లు ఉన్నట్లు తేలింది. ఇటీవల కాలంలో ఇవే అత్యధిక కేసులు. జిల్లాల వారీగా పరిశీలిస్తే.. అనంతపురంలో 33, చిత్తూరులో 150, తూర్పుగోదావరిలో 70, వైఎస్ ఆర్ కడపలో 24, గుంటూరులో 66, కృష్ఱాలో 88, కర్నూలులో 23, నెల్లూరులో 69, ప్రకాశంలో 22, శ్రీకాకుళంలో 25, విశాఖపట్నంలో 183, విజయనగరంలో 49, పశ్చిమ గోదావరిలో 38 కేసులు వంతున నమోదయ్యాయి.
విశాఖలో ఒకరు కొవిడ్ తో మరణించారు. గత కొన్ని రోజులుగా పాజిటివిటీ రేటు క్రమేణా పెరుగుతుండటంతో ముందు జాగ్రత్త చర్యగా రాష్ట్ర ప్రభుత్వం రాత్రి వేళల్లో కర్ఫ్యూ అమలు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం మార్గదర్శకాలు జారీ చేసింది. కొత్త మార్గదర్శకాల ప్రకారం.. ఇకపై సినిమా థియేటర్లు, హోటళ్లు, రెస్టారెంట్లు, ప్రభుత్వ కార్యాలయాలు, బార్ లు 50శాతం ఆక్యుపెన్సీతో రాత్రి 10గంటల వరకు నిర్వహించాలి. విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు.
జిమ్ లు, పార్క్ లు పూర్తిగా మూసివేయాల్సి ఉంటుంది. ఆస్పత్రులు, మందుల దుకాణాలు, పెట్రోల్ బంకులు, ఫార్మసీలు 24గంటలు తెరిచే ఉంటాయి. సాధారణ దుకాణాలు, మార్ట్ లు, ఇతర రిటైల్ దుకాణాలు ఉదయం 9నుంచి రాత్రి 7గంటల వరకు మాత్రమే తెరచి ఉంచాలి. కర్ప్యూ రాత్రి 10గంటల నుంచి ఉదయం 5గంటల వరకు అమల్లో ఉంటుంది.
ప్రభుత్వ మార్గదర్శకాలు ఎలా ఉన్నప్పటికీ.. వాటిని అమలు చేయాల్సింది అధికారులు. అనుసరించాల్సింది జనం. వీటిలో ఏది విఫలమైనా ప్రభుత్వ ఆశయం నీరు గారినట్లే. కొవిడ్-19 అందించిన చేదు అనుభవాలు మనకు బాగానే ఉన్నాయి. మొదటి దశలో భయంతో చాలా వరకు లాక్ డౌన్ నిబంధనలు పాటించారు. అయితే రెండవ దశలో చాలా వరకు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. అందుకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. పెద్ద సంఖ్యలో ప్రాణ నష్టం సంభవించింది.
అధికారిక గణాంకాల ప్రకారం ఇప్పటి వరకు రాష్ట్రంలో కొవిడ్-19 మరణాల సంఖ్య 14,501. ఈ మరణాలు జిల్లాల వారీగా పరిధశీలిస్తే… అనంతపురంలో 1,093, చిత్తూరులో 1,959, తూర్పుగోదావరిలో 1,290, గుంటూరులో 1,259, కడపలో 644, కృష్ణాలో 1,481, కర్నూలులో 854, నెల్లూరులో 1,060, ప్రకాశంలో 1,130, శ్రీకాకుళంలో 792, విశాఖపట్నంలో 1,142, విజయనగరంలో 673, పశ్చిమగోదావరిలో 1,124 మంది మరణించారు. అయితే అధికారిక లెక్కలకు ఎక్కని మరణాలు రెట్టింపు సంఖ్యలో ఉన్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. రెండవ దశలో ఆస్పత్రుల్లో ఆక్సిజన్ పడకలు దొరకక కొవిడ్ బాధితులు ఎలా ఇబ్బందులు పడ్డారో మనకు తెలిసిందే.
ఈ అనుభవాలు దృష్టిలో ఉంచుకుని మూడవ దశ కొవిడ్ ను ఎదుర్కోవడానికి మనం సిద్ధం కావాల్సిన అవసరం ఉంది.
ప్రతి ఒక్కరూ తప్పని సరిగా మాస్కు ధరించాలి. భౌతిక దూరం పాటించాలి. అనవసరంగా వీధుల్లోకి వెళ్లకూడదు. బయటకు వెళ్లి వస్తే తప్పకుండా శానిటైజరు వేసుకోవడంతో పాటు.. తల స్నానం చేస్తే మంచిది. తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలి. వీలైనంత వరకు బయట ఆహార పదార్థాలను తినకుండా ఉంటే మంచిది.
ఏదైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే కరోనా పరీక్షలు చేసుకోవడం మంచిది. ఒకవేళ పాజిటివ్ వస్తే తప్పని సరిగా ఐసోలేషన్ లో ఉండటంతో పాటు… వైద్యుల సలహా మేరకు చికిత్సలు తీసుకోవాలి. అవసరమైతే ఆస్పత్రిలో చేరాలి. ఈ నిబంధనలు పాటిస్తే చాలా వరకు మూడవ దశ ముప్పు నుంచి మనం బయట పడవచ్చు. అందుకే మనం బాధ్యతగా వ్యవహరిద్దాం.
.