తెలుగుదేశానికి చెందిన రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్.. పార్టీ ఫిరాయిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరబోతున్నారని చాలా ప్రచారం జరిగింది. అది అబద్ధం అని నిరూపించుకునే ప్రయత్నాలను ఇప్పుడు అనగాని సత్యప్రసాద్ ప్రారంభించినట్లు కనిపిస్తోంది.
చాలాకాలంగా ఆయన తెలుగుదేశానికి దూరంగా జరుగుతున్నారనే ప్రచారం ఉంది. కొంత కాలం కిందట ఆయన బీజేపీలో చేరబోతున్నారనే ప్రచారం కూడా జరిగింది. తాజాగా ఆయన వైఎస్సార్సీపీ వైపు మొగ్గు చూపుతున్నట్లుకూడా పుకార్లు వెల్లువెత్తాయి. ఇప్పుడు వాటిని కడిగేసుకునే ప్రయత్నం ఆయన చేస్తున్నారు.
టీడీపీ రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఒక సుదీర్ఘమైన లేఖ రాశారు. సీఎంఆర్ఎఫ్ విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న ధోరణిని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. సీఎంఆర్ఎఫ్ తో తెలుగుదేశం ప్రభుత్వం.. పేదలను ఎంతో గొప్పగా ఆదుకుంటే.. జగన్మోహన్ రెడ్డి సర్కారు పేదలకు అన్యాయం చేస్తోందని పేర్కొన్నారు. సీఎంఆర్ఎఫ్ కు ముడిపెట్టి జగన్ సర్కారు మీద అనేక నిందలు వేశారు.
ఇదంతా కూడా.. తన మీద పడిన ఫిరాయంపు మరకలను కడుక్కునే ప్రయత్నంగానే కనిపిస్తోంది. ఇటీవల మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి రష్యా యాత్ర ఎంత పెద్ద వివాదం అయిందో అందరికీ తెలుసు. ఆ వివాదానికి సంబంధించి.. ఆయన వివరణ తీసుకోడానికి మీడియా ప్రతినిధులు ఆయనకోసం ప్రయత్నించినప్పుడు.. తాను మిత్రులతో వచ్చానని, తెలుగుదేశం ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ కూడా తనతో ఉన్నారని ఆయన చెప్పుకొచ్చారు.
దాంతో అనగాని ఫిరాయింపు మళ్లీ జోరందుకున్నాయి. బీజేపీలో చేరుతారని అదివరలో ప్రచారం ఉండగా.. ఆ ఆలోచన మానుకుని.. వైసీపీ వైపు చూస్తున్నట్టుగా, బాలినేనితో మంత్రాంగం నడుస్తున్నదని.. రష్యానుంచి తిరిగి రాగానే.. వైసీపీలో చేరుతారని ప్రచారం బాగా జరిగింది. ఇప్పుడు బాలినేని అండ్ కో అంతా రష్యానుంచి తిరిగివచ్చారు.
బాలినేని మాటల పుణ్యమాని.. తాను పార్టీ మారుతున్నట్టు వచ్చిన పుకార్ల మరకలను కడుక్కోవాల్సిన పని అనగాని సత్యప్రసాద్ పై పడింది. దాంతో ఆయన ఏకంగా సీఎం జగన్మోహన్ రెడ్డినే ఉద్దేశించి ఘాటుగా ఒక లేఖ రాశారు. ఆ లేఖలో కేవలం సీఎంఆర్ఎఫ్ పేదల ప్రస్తావన మాత్రమే కాకుండా, తమ టీడీపీ ప్రభుత్వంలో అద్భుతంగా చేశాం అని కూడా తమను తాము కీర్తించుకోవడం గమనిస్తే.. ఆయన వైసీపీలోకి వెళ్లడం జరగదని అర్థమవుతోంది.
అనగాని సత్యప్రసాద్, సీఎం జగన్ కు రాసిన లేఖ పూర్తిపాఠం :
బహిరంగ లేఖ
శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు,
ఏపీ ముఖ్యమంత్రి.
విషయం: పేదలకు సంజీవనిగా ఉపయోగపడిన సీఎంఆర్ ఎఫ్ పునరుద్ధరణ, కరోనా సమయంలో ముఖ్యమంత్రి సహాయనిధికి వచ్చిన నిధుల సద్వినియోగం, పెండింగ్ నిధుల విడుదల గురించి..
-అనగాని సత్యప్రసాద్, టీడీపీ శాసనసభ్యులు
ప్రాణాంతక, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి వరం లాంటిది. సీఎంఆర్ ఎఫ్ ద్వారా ఆర్థిక సాయం అందడంతో సకాలంలో వైద్యం చేయించుకుని ఏటా వందలమంది ప్రాణాలు దక్కించుకున్నారు. సీఎంఆర్ ఎఫ్ అంటే ఆపత్కాలంలో ఆదుకునే నిధి. దీని ద్వారా టీడీపీ హయాంలో ఇతోదికంగా సాయం చేశాం. పార్టీలు, కులాలకు అతీతంగా సాయం చేయడం జరిగింది. ముఖ్యమంత్రి సహాయనిధి పేద ప్రజానీకానికి సంజీవనిగా ఉపయోగపడింది.
ఇప్పుడా పరిస్థితి లేదు. సాయాన్ని పూర్తిగా నిలిపేశారు. పేద, బలహీన వర్గాలకు ఆపన్న హస్తంలా ఉపయోగపడిన సీఎమ్ ఆర్ఎఫ్ ను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం బాధాకరం. ప్రభుత్వ సాయం కోసం కళ్లు కాయలే కాచేలా ఎదురుచూస్తున్న పేదలకు నిరాశే ఎదురవుతోంది. ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా పేదలకు సాయం చేసేందుకు శాసనసభ్యులు ఇస్తున్న లేఖలను కనీసం పరిగణలోకి తీసుకోవడం లేదు.
గడిచిన ఐదేళ్లలో సీ.ఎం.ఆర్.ఎఫ్ కింద రెండున్నర లక్షలమంది రోగులకు రూ. 1600 కోట్లు చెల్లించి వైద్య సదుపాయాలు అందించడం జరిగింది. గతంలో ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా పేదలకు 1500 వ్యాధులకు పైగా చికిత్స అందించడంతోపాటు సీఎంఆర్ఎఫ్ ద్వారా వేలాది మంది పేదలకు ఆర్థిక సాయం అందించడం జరిగింది. దీనివల్ల అప్పటివరకూ మెరుగైన వైద్యం కోసం అప్పులు చేసి, ఆస్తులమ్ముకుని అవస్థలు పడుతున్న పేదలకు సీఎంఆర్ ఎఫ్ ఆసరాగా నిలిచింది. అలాగే బాధిత కుటుంబాలకు, ఆస్పుత్రులకు చెల్లించాల్సిన బిల్లులను కూడా గత ప్రభుత్వం వేగంగా క్లియర్ చేసింది. వైసీపీ అధికారంలోకి వచ్చాక పెండింగ్ లో ఉన్న బిల్లులను పరిగణలోకి తీసుకోకపోగా కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి సకాలంలో బిల్లులు చెల్లించకుండా నిలుపుదల చేయడం సరికాదు.
సీఎంవో నిర్లక్ష్యం కారణంగా 40 వేలకు పైగా దరఖాస్తులు, వందల కోట్ల రూపాయిల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. కరోనా కారణంగా ఓ వైపు ఉపాధి లేక మరోవైపు వైరస్ సోకి వైద్యం చేయించుకోలేక ఎంతోమంది పేదలు ప్రాణాలు కోల్పోయారు. కరోనా వంటి విపత్తులో ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్థిక సాయం అందుంటే పేదలకు ఎంతో ఉపయోగకరంగా ఉండేది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. కరోనా సమయంలో సీఎంఆర్ ఎఫ్ కు పెద్ద ఎత్తున విరాళాలు వచ్చిన నేపథ్యంలో ఆ నిధులను నిరుపేదల వైద్యానికి కేటాయిస్తే కొండంత ఆసరాగా ఉంటుంది.
అన్ని వ్యాధులను ఆరోగ్యశ్రీలో చేర్చాము కనుక సీఎంఆర్ ఎఫ్ అవసరం లేదన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలి. ఆరోగ్యశ్రీ పేరుతో సీఎంఆర్ ఎఫ్ ను కనుమరుగు చేయడం సరికాదు. దారిద్ర్యరేఖకు దిగువన ఉండీ ఆరోగ్యశ్రీ కార్డు లేని వారి పరిస్థితి ఏంటి? టీడీపీ ప్రభుత్వంలో గుండె సంబంధిత వ్యాధితో బాధపడేవారికి సీఎం సహాయనిధి ద్వారా ఒక్కోరికి రూ. 10 లక్షల సాయం అందించడం జరిగింది. అలాగే డెలివరీ సమయంలోనూ సాయం అందించాం. వైసీపీ ప్రభుత్వం గుండె మార్పిడి చికిత్స ఆరోగ్యశ్రీ పరిధిలో చేర్చలేదు. మరి వారికి వైద్య సాయం ఎలా అందుతుంది? ముఖ్యమంత్రి సహాయనిధి లేకుండా సొంతంగా లక్షలు వెచ్చించి వైద్యం చేయించుకోవడం పేదల వల్ల అయ్యే పనేనా?పేదలకు మెరుగైన వైద్యం అందిస్తామంటున్న మీరు వెంటనే ఆ దిశగా చర్యలు తీసుకోవాలి. నిరుపేదలకు ఆర్థికంగా కొండంత అండగా నిలిచిన ముఖ్యమంత్రి సహాయనిధిని వెంటనే పునరుద్దరించాలి. పేదలకు మెరుగైన వైద్యం అందించాలి.
..అనగాని సత్యప్రసాద్
టీడీపీ శాసనసభ్యులు
.

Discussion about this post