కులాల పరంగా సమాజాన్ని చీల్చేసి.. మాటిమాటికీ కులం కార్డును ప్రయోగించి.. ఓటు బ్యాంకులను రెచ్చగొట్టి.. ఓట్లు దండుకోవడం అనేది మన ప్రజాస్వామ్యంలో చాలా తరచుగా చూస్తూనే ఉంటాం. కానీ.. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఎటు చూసినా అదే కనిపిస్తోంది. మతాన్ని అడ్డంగా వాడుకుని క్యాష్ చేసుకోడానికి అన్ని పార్టీలు అదే పనిగా ప్రవర్తిస్తున్నాయి. ఈ విషయంలో అటు బీజేపీ, ఇటు మజ్లిస్ ముందున్నాయని అనాలి. అలాగని మిగిలిన పార్టీలు పరిశుద్ధాత్మ స్వరూపులు అనుకోవడానికి వీల్లేదు. ప్రధానంగా ఈ రెండు పార్టీ సంగతి చూస్తే.. మజ్లిస్ పార్టీ అనేదే కేవలం ముస్లిం మతాన్ని నమ్ముకునే పుట్టిందని అందరికీ తెలుసు. వారి ఎజెండా స్పష్టంగా ఉంటుంది. బీజేపీ కూడా హిందూత్వ కార్డును నమ్ముకునే రాజకీయం చేస్తోంది గానీ.. ఈ ఎన్నికల్లో వారి చిత్రమైన పోకడ ఏంటంటే.. ఇతర పార్టీలకు చెందిన దిగ్గజ నాయకులందరికీ కూడా హిందూత్వ రంగు పులిమేయడానికి ప్రయత్నిస్తున్నారు. అదే చోద్యం.
తాజా పరిణామాల్లో ఆక్రమణలు చేసి కట్టుకున్న ఇళ్లు కూడా కూల్చేస్తాం అనే టీఆర్ఎస్ ప్రకటనని మజ్లిస్ ప్రజల్లోకి తీసుకువెళ్లదలచులకుంది. హుసేన్ సాగర్ ఒకప్పట్లో 4700 ఎకరాలుఉంటే ఇప్పుడు 700 ఎకరాలకు మాత్రమే పరిమితం అయిపోయిందని.. దాని చుట్టూ విపరీతంగా ఆక్రమణలు రావడమే కారణమని అక్బరుద్దీన్ అన్నారు. పేదల ఇళ్లు కూల్చేస్తామని అంటున్న ప్రభుత్వం.. ముందు హుసేన్ సాగర్ ను ఆక్రమించి కట్టిన ఎన్టీఆర్, పివి నరసింహారావు లసమాధుల్ని కూడా కూల్చేయాలని అన్నారు.
ఆ ఒక్కమాట ఇతర పార్టీలకు లడ్డూలాగా దొరికింది. కేటీఆర్ ఒకవైపు ఆ ఇద్దరు నాయకుల సమాధుల గురించి మాట్లాడ్డం తగదంటూ విరుచుకుపడ్డారు.
బీజేపీ అంతకుమించిన ఎడ్వాంటేజీ తీసుకోదలచింది. ఆక్రమణల కూల్చివేతకు సంబంధించి ఆ ఇద్దరు సమాధుల్ని అక్బర్ ప్రస్తావిస్తే.. వారిద్దరికీ హిందూత్వ రంగు పులమడానికి బీజేపీ సాహసించింది. ఎన్టీఆర్ కాషాయదుస్తులు ధరించి సీఎంగా చేశారు గనుక.. ఆయన సమాధిని తొలగించాలా? పీవీ అయోధ్య బాబ్రీ మసీదు కూల్చడానికి సహకరించారు గనుక.. ఆయన సమాధులు కూల్చేయాలంటున్నావా? అంటూ.. తీవ్రంగా విరుచుకుపడింది.
అయితే ఇదంతా కూడా అధ్యక్షుడు బండి సంజయ్ ట్విటర్ లో పేర్కొన్న సంగతులు. బండి సంజయ్ ప్రసంగాల్లో కూడా విరుచుకుపడ్డారు గానీ.. ఇంతగా తలతిరుగుడు వాదన అందులో లేదు. ట్విటర్ లో మాత్రం చాలా వక్రమైన లాజిక్ తో ఎన్టీఆర్, పీవీలకు హిందూత్వరంగు పులుముతూ ఇలా పేర్కొన్నారు.
బండి సంజయ్ ట్విటర్ హాండిల్ ను నిర్వహిస్తున్న వారెవరో గానీ.. ఎన్టీఆర్ కాషాయం కట్టుకున్నాడు గనుక.. ఆయనను కాషాయా పార్టీకి ప్రతినిధిగా మార్చేయవచ్చుననే ఆలోచన చాలా చిత్రంగా వచ్చింది. బీజేపీ చాలా సంకుచితంగా మతం కార్డు ప్లేచేసి..అన్ని పార్టీల నాయకులను హిందువులుగా ముద్రవేసి.. ఆ రకంగా రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నట్టుగా కనిపిస్తోంది.
.

Discussion about this post