అమరావతి ప్రాంతానికి చెందిన రైతుల ఆందోళనలు సుదీర్ఘకాలంగా ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. చాలా ఎక్కువకాలంగా కొనసాగుతూ ఉండడం.. వారి దీక్షలు- డిమాండ్లు అనేవి రాజకీయ రంగు పులుముకోవడం వలన ఆ పోరాటాలు రకరకాల పోకడలు పోతున్నాయి. అవకాశం దొరికినప్పుడెల్లా.. వారు పలువురు నాయకుల్ని కలిసి తమ వేదనలు వినిపిస్తున్నారు. అధికార పార్టీకి చెందిన వారు దొరికితే గనుక.. వారిని నిలదీయడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే.. ఫలితం సాధించే దిశగా కాకుండా.. కేవలం నలుగురి దృష్టిని ఆకర్షించడమూ, ఏదో ఒక సంచలనం నమోదు చేయడమూ మాత్రమే లక్ష్యంగా ఈ పోరాటాలు దారితప్పిపోతున్నాయని అనిపిస్తోంది.
ఏపీఐఐసీ ఛైర్ పర్సన్, పుత్తూరు ఎమ్మెల్యే రోజా గురువారం నాడు నాగార్జున యూనివర్సిటీలో ఒక కార్యక్రమానికి హాజరయ్యారు. తిరిగి వెళ్తుండగా.. అమరావతి ఆందోళన కారులు.. ఆమెను అడ్డుకుని పెద్ద గొడవ నడిపించారు. ఈ ఎపిసోడ్ జరిగిన తీరును గమనిస్తే.. ఆందోళనలు ఎలాంటి రూపు సంతరించుకుంటున్నాయి.. ఎలాంటి లక్ష్యాల వైపు, ఎలాంటి మార్గంలో పయనిస్తున్నాయి… అనే సందేహాలు కలుగుతాయి.
రోజా నాగార్జున యూనివర్సిటీ కార్యక్రమంలో ఉన్నప్పుడే.. అమరావతి ఆందోళనకారులకు ఆ సంగతి తెలిసింది. ఆమెకు తమ ఆందోళన రుచిచూపించాలని వారు అనుకున్నారు. యూనివర్సిటీకి ఉన్న ప్రధానమైన రెండు గేట్ల వద్దకు గుంపులుగా చేరుకున్నారు. పరిస్థితి అదుపుతప్పుతుందని గుర్తించిన పోలీసులు.. రోజాను మూడో గేటు గుండా వెలుపలికి తీసుకువెళ్లారు. అక్కడ కూడా మోటార్ సైకిళ్లను అడ్డుపెట్టి.. ఆపడానికి ప్రయత్నం జరిగింది గానీ.. రోజా దాన్ని దాటి వెళ్లగలిగారు.
ఆ తర్వాత మళ్లీ పెదపరిమి గ్రామం వద్ద ఆందోళనకారులు అడ్డుకున్నారు. రోజా వారిని సెల్ ఫోన్ లో ఫోటో తీయడానికి ప్రయత్నించడంతో రోడ్డు మీదే బైఠాయించారు. గంటకు పైగా రోజా కారులోనే ఉండిపోవాల్సి వచ్చింది. అదనపు పోలీసు బలగాలు వచ్చిన తర్వాత.. ఆమె అక్కడినుంచి బయల్దేరారు. ఆందోళనకారుల్ని పోలీసులు నెట్టివేయడంలో కొందరు గాయపడ్డారు. –ఇదీ మొత్తం ఎపిసోడ్!
ఇక్కడ కీలకంగా ప్రస్తావించాల్సి ఏంటంటే.. రోజాను పెదపరిమిలో అడ్డుకున్న ఆందోళనకారుల ప్రధాన డిమాండ్ ఏమిటో తెలుసుకుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. వారు అడిగనదెల్లా.. ‘జై అమరావతి’ అనమని! అదేం డిమాండు!
వైకాపా ఎమ్మెల్యే రోజా, జై అమరావతి అంటే వారికేం వస్తుంది..? డిమాండ్ చేయడంలో వారి ఉద్దేశ్యమే స్పష్టంగానూ, సబబుగానూ లేదు. ‘రోజాతో అమరావతికి జై కొట్టించాం’ అనే సంచలనాన్ని సృష్టించడం తప్ప.. అలా అనడం వల్ల వారి మౌలిక లక్ష్యం సాధించగలరా? అమరావతినుంచి ఎగ్జిక్యూటివ్ రాజధానిని తరలించకుండా ఆపగలరా? అనేది సందేహం. అలాగని మౌనంగా.. తమ కష్టాలు ఏకరవు పెట్టుకుంటూ, నష్టాలను నివేదిస్తూ ఒక వినతిపత్రం రోజాకు ఇచ్చి ఉంటే సరిపోయేదని అనలేం. అలాంటి దానిని రోజా తీసుకుంటుందనే నమ్మకం కూడా లేదు. తీసుకున్నా ప్రయోజనం ఉంటుందనుకోవడం భ్రమ. కేవలం.. తమ అసంతృప్తిని తెలియజెప్పడం తప్ప ఇంకోటి లేదు గనుక, అలా కాకుండా.. మరో రూపంలో నిరసనలు తెలిపి ఉంటే బాగుండేది. కానీ.. ‘సంచలన కాంక్ష’ అనేది జై అమరావతి అనాల్సిందిగా పట్టుబట్టేలా చేసిందని అనిపిస్తుంది.
శివరాత్రి రోజు కూడా ఆందోళనలు ఇదే తరహాలో సాగాయి. లలితా సహస్ర నామ స్తోత్రాలు, ఓం నమఃశివాయ మంత్ర పఠనాలు.. ఇలాంటివన్నీ.. విభిన్నమైన రూపాలుగా కనిపించవచ్చు.. పత్రికల్లో ప్రతిరోజూ వార్తలుగా మారడానికి వారికి ఉపకరించవచ్చు. అయితే లక్ష్యశుద్ధిని పలుచన చేసేస్తాయి. గతంలో కూడా వీరు ఇలాంటి అనేక నిరుపయోగమైన పద్ధతుల్లో ఆందోళనలు సాగించారు. మేడారం జాతరకు వెళ్లి మొక్కితే, షిరిడి యాత్ర చేస్తే, ఇలాంటి చిత్రవిచిత్ర పద్ధతులు అనుసరిస్తే.. ఉద్యమస్వరం ఘనంగా వినిపిస్తుందని అమరావతి రైతులు అసలు ఎలా అనుకున్నారో అర్థం కావడం లేదు.
వీరి ఆందోళనలను చూస్తోంటే.. గతంలో తెలుగుదేశం ఎంపీ ఎన్. శివప్రసాద్ పార్లమెంటు వద్ద.. వేర్వేరు సందర్భాల్లో రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడం కోసం వివిధ వేషాల్లో చేసిన నిరసన ప్రదర్శనలు గుర్తుకొస్తున్నాయి. అమరావతి ఆందోళనల్ని, శివప్రసాద్ వేషాలతో పోల్చడం.. వీరిని పలుచన చేయడం కాదు. ఇద్దరిలోనూ ఎవరి చిత్తశుద్ధినీ శంకించడం లేదు. అయితే దీక్షల తరహా వలన వచ్చే ఇబ్బందిని మాత్రం దృష్టిలో ఉంచుకోవాలి.
రాజకీయ, శాసన వ్యవస్థ మన దేశంలో సుప్రీం అనుకుంటే తప్పు. ప్రజాస్వామ్యానికి ఉండే మూడు మూల స్తంభాల్లో అది ఒకటి మాత్రమే. ఎగ్జిక్యూటివ్ అధికార వ్యవస్థ, రాజకీయ వ్యవస్థకు దాసోహం కావడం ఒక విపరిణామమే కావొచ్చు. కానీ న్యాయవ్యవస్థ ఇంకా తన పవిత్రతను కాపాడుకుంటూనే ఉంది. ఏ వ్యవస్థలో పొరబాటు, దుందుడుకు నిర్ణయం జరిగినా మిగిలిన వ్యవస్థలను ఆశ్రయించడం ద్వారా దానిని చక్కదిద్దే ఏర్పాటు ఎప్పటికీ ఉంటుంది.
ఇప్పటికే అమరావతి ప్రాంత రైతులు న్యాయస్థానాల్ని ఆశ్రయించి ఉన్నారు. అమరావతినుంచి రాజధానిని తరలించడం ఏ రకంగా న్యాయం కాదో.. అధికార వికేంద్రీకరణ అనే జగన్మోహన రెడ్డి ఆలోచనలో ఏ రకంగా తప్పు ఉన్నదో న్యాయవ్యవస్థ ఎదుట మరింత సమర్థంగా నిరూపించడానికి వారు మార్గాన్వేషణ చేయాలి. అలాంటి ప్రయత్నం మాత్రమే ఉద్యమానికి సాఫల్యతను చేకూరుస్తుంది తప్ప.. ఏ రకంగానూ ఇతర మార్గాలు ఉపకరించవు. అన్ని విషయాలను సాకల్యంగా అర్థం చేసుకుని.. తమ పోరాట దీక్షల విలువ పడిపోకుండా వారు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.
ప్రభుత్వాన్ని నిందించడం, బెదిరించడం లక్ష్యం కాకూడదు.. తమ వాదన సబబు అని నమ్మేలా వారిలో ఆలోచన తీసుకురావడం, ఆదిశగా ఇతర వ్యవస్థల నుంచి మార్గనిర్దేశనం చేయించడం కోసం ప్రయత్నం జరగాలి.
.

Discussion about this post